– మాది కార్మికుల అనుకూల, పరిశ్రమలను పరిరక్షించే ప్రభుత్వం
– కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే
– కొత్త లేబర్ కోడ్ తో ఉద్యోగులు, యజమానుల జీవితాల్లో గొప్ప మార్పు
– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
– విజయవాడలో ప్రాంతీయ కార్మిక సదస్సు ప్రారంభం
విజయవాడ: కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడమే కొత్త లేబర్ కోడ్ ల ప్రధాన లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు.
స్థానిక నోవాటెల్ హోటల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్మిక సదస్సు (Regional Conference of Labour & Employment and Industry Secretaries of States/UTs), కొత్త కార్మిక సంస్కరణల (Labor Codes) పై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ… దక్షిణ భారతదేశ కార్మిక శాఖ ప్రాంతీయ అధికారుల సమావేశం జరుగుతోందన్నారు. దేశంలో నవంబర్ 21న కొత్త లేబర్ కోడ్ (కార్మిక చట్టం) అమలులోకి వచ్చిందన్నారు.
ఈ కొత్త చట్టం రాబోయే రోజుల్లో ఉద్యోగులు, యజమానుల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందన్నారు. మన దేశంలో బ్రిటిష్ కాలం నాటి 29 పాత చట్టాలు అమలులో ఉండేవన్నారు. ఆ చట్టాలు మన కార్మికులకు అనుకూలంగా తీసుకురాలేదన్నారు. నవభారతంలో, కొత్త తరం కోసం కొత్త చట్టాల అవసరం ఉందన్నారు. దీన్ని గుర్తించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కార్మిక మరియు ఉపాధి శాఖ ఈ కొత్త చట్టాలను తీసుకువచ్చిందన్నారు. కార్మిక రంగం అనేది రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమని, దీని అమలు 90% బాధ్యత రాష్ట్రాలదే అన్నారు.
అందుకే వివిధ ప్రాంతాల్లోని అధికారులు, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కొత్త లేబర్ కోడ్ ద్వారా కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఇ.పి.ఎఫ్.ఓ (EPFO), ఈ.ఎస్.ఐ (ESI) సౌకర్యాలను అసంఘటిత రంగంలోని 90% కార్మికులకు ఎలా అందించాలి అనే అంశాలపై చర్చిస్తున్నామన్నారు. కొత్త చట్టాల ప్రకారం మహిళలకు సమాన పనికి సమాన వేతనం లభిస్తుందన్నారు. పని పూర్తి చేసిన ఒక వారంలోపే వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇలాంటి ఎన్నో మార్పులను రాష్ట్రస్థాయిలో, తాలూకా, జిల్లా స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.. ఇదివరకే గోవా, జైపూర్లలో సమావేశాలు జరిగాయని నేడు విజయవాడలో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో లక్నో, గౌహతి ల్లో కూడా నిర్వహిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలియజేశారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. గోవా, జైపూర్ తర్వాత ఈ మూడవ ప్రాంతీయ సదస్సు మన రాష్ట్రం విజయవాడ లో జరగడం గర్వకారణమన్నారు. కొత్త కార్మిక చట్టాల (Labor Codes) పట్ల కార్మికుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి, వారిలో అవగాహన కల్పించడానికి ఈ సమావేశం దోహదపడుతుందన్నారు.
మహిళల భాగస్వామ్యం పెంచి, వారి భద్రత కోసం పని ప్రదేశాల నుండి ఇంటి ముంగిట (Doorstep) వరకు రక్షణ కల్పించడం జరుగుతుందున్నారు. లింగ వివక్ష లేకుండా పురుషులతో సమానంగా వేతనాలు అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో 50 సీట్ల ఈఎస్ఐ (ESI) మెడికల్ కాలేజీ, అమరావతిలో కొత్త మెడికల్ కాలేజీతో పాటు 150 పడకల సెకండరీ కేర్ హాస్పిటల్, 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు, శ్రీసిటీ, గుంటూరు, కర్నూలులో ఈఎస్ఐ ఆసుపత్రుల కోసం భూముల కేటాయింపు, విజయనగరంలో ఈఎస్ఐ ఆసుపత్రి పనుల ప్రారంభం జరుగుతుందన్నారు.
పని ప్రదేశాల్లోనే వైద్య శిబిరాల ద్వారా షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు, ఐటీ ఆధారిత డిజిటల్ సిస్టమ్స్, ఆన్లైన్ సేవల ద్వారా పారదర్శకతను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను సవరించి, కార్మికుల ఆరోగ్యం, భద్రత, న్యాయం కోసం నాలుగు కొత్త లేబర్ కోడ్లను తీసుకువచ్చామని, వీటిపై మీడియా మిత్రులు కూడా అవగాహన కల్పించాలని కోరుతూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు.