భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అనే నినాదం వినడానికి బాగున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. విత్తనాలనే అక్షరాలతో పుడమి తల్లి ఒడిలో స్వేదాన్ని చిందించి, మనకు అన్నం పెట్టే రైతు.. చివరకు కన్నీళ్లే మిగిలి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.
గత 15 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3,19,598 మంది రైతులు, కూలీలు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి ఎలా ఉందో తెలుపుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 90 వేల మంది తనువు చాలించడం సాగు సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అద్దం పడుతోంది.
సంక్షోభానికి మూలాలు:
పెరుగుతున్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు మరియు కూలీల ఖర్చులు రైతుకు పెను భారంగా మారాయి. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా సకాలంలో రుణాలు అందక, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. అధిక దిగుబడి కోసం భూమిని రసాయనాలతో విషతుల్యం చేయడం వల్ల నేల నిస్సారమై, పంటల్లో రోగనిరోధక శక్తి తగ్గి పెట్టుబడి రెట్టింపవుతోంది. చివరకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పు తీర్చలేక రైతు తన ‘పరువు’ కోసం ‘అరువు’ భారంతో ప్రాణాలు వదులుతున్నాడు.
ప్రభుత్వాల బాధ్యత :
రైతు ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వాల పాత్ర అత్యంత కీలకం. కేవలం ఎన్నికల సమయంలో ఇచ్చే రుణమాఫీలు రైతు సమస్యకు శాశ్వత పరిష్కారం కావు.
మద్దతు ధర కాదు.. లాభసాటి ధర: పంటలకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు సాగు వ్యయంపై అదనపు లాభం కలిపి ధర నిర్ణయించేలా చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలి..
సకాలంలో సంస్థాగత రుణాలు: సాగు కాలం ప్రారంభానికి ముందే ప్రతి రైతుకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా చూడాలి. తద్వారా వడ్డీ వ్యాపారుల దోపిడీని అరికట్టవచ్చు.
సాంకేతికత – అవగాహన: ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలను బలోపేతం చేయాలి. ఏ నేలలో ఏ పంట వేయాలో రైతుకు శాస్త్రీయంగా వివరించే యంత్రాంగం ఉండాలి.
మార్కెటింగ్ వ్యవస్థ: దళారీల ప్రమేయం లేకుండా రైతు తన పంటను నేరుగా అమ్ముకునేలా కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలి..
ప్రకృతి వైపరీత్యాల పరిహారం: పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనల సాకులు చెప్పకుండా, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా రైతుకు తక్షణ ఆర్థిక సాయం అందించాలి.
రైతు బాట – పరిష్కార దిశగా..
రైతులు కూడా సాంప్రదాయ సాగుతో పాటు ఆధునిక, లాభసాటి పద్ధతులను అవలంబించాలి.
సహజ వ్యవసాయం: పెట్టుబడిని తగ్గించే జీవామృతం, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి నేల తల్లిని రక్షించుకోవాలి.
సమగ్ర వ్యవసాయం: కేవలం పంటలపైనే కాకుండా పాడి, కోళ్లు, జీవాల పెంపకం వంటి అనుబంధ రంగాలను ఎంచుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
అంతర పంటలు: ఒకే రకమైన పంట కాకుండా, అంతర పంటల సాగు ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.
రైతు అభివృద్దే దేశాభివృద్ధికి అసలైన చిరునామా. ప్రభుత్వాలు, వ్యవసాయ వ్యవస్థలు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేసి రైతుకు భరోసా కల్పించాలి. అప్పు కోసం పరుగు తీయకుండా,ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతు ఆనందంగా సేద్యం చేసే రోజు రావాలి. అది జరిగినప్పుడే రైతే రాజు అనే నినాదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది..
– జి. అజయ్ కుమార్