– బలహీన వర్గాల సంక్షేమానికే మా ప్రాధాన్యత
– అసమానతలు తగ్గించడానికే పీ4 కార్యక్రమం
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గతాని కంటే ఎక్కువ కేటాయింపులు
– స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీ రిజర్వేషన్లు
– సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులపై శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి : సామాజిక సమానత్వం కోసమే కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం వహించేలా సామాజిక సాధికారత సాధించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
బడ్జెట్లో సంక్షేమ శాఖల కేటాయింపులపై శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని అన్నారు. వీటితో పాటు అన్ని వర్గాలకూ మరింత అదనంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో పథకాలతో పాటు చేనేత కార్మికులకు కూడా ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమాన్ని అందించి న్యాయం చేస్తున్నామని అన్నారు.
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపులు పెంచాం
‘చౌక దుకాణాల ద్వారా వినియోగదారులకు మరింత సమర్ధంగా సరకులు అందించేందుకు ప్రణాళిక చేయటంతో పాటు సక్రమంగా చేరవేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం. సంక్షేమ పథకాలను సాంకేతికత సాయంతో అనుకున్న సమయానికే చేరేలా చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపులు గతం కంటే పెంచాం. కేటాయించిన మొత్తాలను ఆ వర్గాలకే ఖర్చు చేసేలా చిత్తశుద్ధితో పనిచేస్తాం.
సంక్షేమ కార్యక్రమాల ఇవ్వడంతో పాటు ప్రతి వర్గాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ప్రజల ఆదాయాలను పెంచి జీవనప్రమాణాలు మెరుగుపరుస్తాం. స్వర్ణాంధ్ర 2047 విజన్ నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం రూ.3 లక్షలు ఉన్న తలసరి ఆదాయాన్ని 2047 నాటికి రూ.54 లక్షలకు పెంచే నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళుతున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.
దృష్టంతా భావితరాలపైనే
‘మా దృష్టి అంతా భావి తరంపైనే పెట్టాం. అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రాథమిక పాఠశాల వరకూ బలోపేతం చేశాం. రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యను అందిస్తున్నాం. పౌష్టికాహారంతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేసి ఆదాయం పెంచడంతో పాటు సుపరిపాలన అందిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు చెప్పాం. నాడు చెప్పినట్లు గానే నేడు ముందుకెళుతున్నాం. పీపీపీ ద్వారా గతంలో సంపద సృష్టికి ముందుకెళ్లాం.
పీపీపీ విధానంలో రోడ్లు, విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక వసతులు కల్పన జరిగింది. వీటితో సంపద పెరిగి, మెరుగైన వసతులు ఏర్పడినా అసమానతలు తగ్గలేదు. ఆర్థిక తారతమ్యాలు తగ్గించేందుకు పీ4 విధానాన్ని తీసుకొచ్చాం. 10 లక్షల బంగారు కుటుంబాలను 1 లక్ష మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఏ కార్యక్రమంలోనైనా ఫలితాలు వెంటనే రావు. అసమానతలు తగ్గించేందుకు పీ4 మించి కార్యక్రమం మరొకటి ఉండదు. కొందరికి ఉద్యోగాలు ఉండవు. ఇంకొన్ని వర్గాలు కూలీ పని చేస్తే తప్ప పూట గడవదు.
అలాంటి వారిని ఆదుకుని పైకి తీసుకురావాల్సి ఉంది. 2047కు భారత్ అగ్ర దేశంగా తయారవుతుంది. వికసిత్ భారత్గా తయారయ్యేనాటికి అసమానతలు ఉండటం మంచిది కాదు. ఇది కేవలం పబ్లిక్ పాలసీల వల్లే సాధ్యం అవుతుంది. చట్టసభల్లో ఉన్న మనమందరం కృత నిశ్చయంతో పని చేస్తే ఇది కష్టం కాదు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
స్థానిక సంస్థల కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు
శాసన సభలో ఉన్న మనపై ఎంతో నమ్మకం ఉంచి ప్రజలు ఓట్లు వేశారు. 94 శాతం స్ట్రైక్ రైట్తో ఎన్డీఏకు సీట్లు ఇచ్చారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కోవాలి. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది. గత ప్రభుత్వం తగ్గించిన రిజర్వేషన్లు మళ్లీ 34కు పెంచేందుకు వన్ మెన్ కమిటీ వేశాం.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు పెంచి అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. బీసీ రక్షణ చట్టం ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. అదే విధంగా బీసీల్లో ఉన్న కొందరు ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారు…వీటిపై ఇప్పటికే చేసిన బిల్లులను కేంద్రానికి కూడా పంపాం. వాటిని ఫాలోఅప్ చేస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.
జీఓ నంబర్3పై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తాం
నేను ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి 1996-1997లో ఎస్సీ వర్గీకరణ చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కాపాడ లేకపోయాయి. ఇప్పుడు మళ్లీ వర్గీకరణ చేసి ఎస్సీల్లో కూడా సామాజిక న్యాయం చేసిన ఘనత మాది. గిరిజనుల కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ని కూడా గత పాలకులు కాపాడలేకపోయారు. దీంతో ఆ జీఓ నంబర్ 3ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆచరణతో పాటు అందరికీ ఆమోద యోగ్యంగా జీఓ నంబర్ 3 ఉండాలి. అందుకే సమావేశాలు ఏర్పాటు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం.
మైనారిటీలకు రక్షణ కల్పించడంతో పాటు మౌజన్, ఇమామ్లకు గౌరవ వేతనం అందిస్తున్నాం. ఆడబిడ్డలను అన్ని విధాలా ఆదుకుంటున్నాం. ఆస్తి హక్కు, బాగా చదివించడం ఎన్టీఆర్తో మొదలయ్యాయి. మహిళలు సాధికారత సాధిస్తే కుటుంబమే కాకుండా సమాజం కూడా సాధికారత సాధిస్తుంది. అగ్రవర్ణాల్లో పుట్టడమే మేం చేసిన పాపమా అని ఆ వర్గంలోని పేదలు బాధపడుతున్నారు. వారిని కూడా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది.
పేదలు ఎక్కడున్నా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. త్వరలోనే కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తాం. సంజీవని ద్వారా పేదలకు ఆర్థిక వెసులుబాటు కలిగి ఇబ్బందులు తగ్గుతాయి. అన్ని శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నా…మీ విభాగాల్లో మంచిగా పని చేసి బలహీనవర్గాలను బలోపేతం చేయాలి. ఇది బలహీన వర్గాల ప్రభుత్వం…బలహీన వర్గాలను ఆదుకుంటాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు.