ఈ పేజీ చూస్తుంటే కళ్లు చెమర్చుతున్నాయి (నవ్వు ఆపుకోలేక)! తిరుమల నెయ్యి గొడవ పుణ్యమా అని, మన గ్రేట్ ఆంధ్రా వారు జగనన్నను ఏకంగా ప్రస్తుత అవతారం చాలించి కొత్త అవతారం ఎత్తమంటున్నారు.
అబ్బో! ఈ టైటిల్ చూస్తే సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం, అధర్మం పెరిగిపోయి ధర్మానికి హాని కలిగినప్పుడు, సాధువులను రక్షించి దుష్టులను శిక్షించడానికి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతరిస్తాడు. దీనినే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతమ్” అంటూ వివరించారు.
కలియుగ వైకుంఠంలో ప్రసాదాల కల్తీ నుండి పరకామణి వరకు ఈ రాక్షసుల పాపాలను, విధ్వంసాలను చూసి, యావత్ భక్తకోటి దిగ్భ్రాంతికి గురై, “దేవుడా! ఈ రాక్షసులను నువ్వే శిక్షించు” అని ప్రార్థిస్తున్నారు.
ఈ తరుణంలో అసెంబ్లీకి వెళ్లక, కోర్టు వాయిదాలకు వెళ్లక, చేసిన పాపాల విషయంలో కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. రోజుకో కుట్ర పన్నుతూ ఈ పాపులు వేస్తున్న వేషాలు వెగటు పుట్టించినట్లుంది గ్రేట్ ఆంధ్రా వెంకట్ రెడ్డికి. అందుకేనేమో, రాక్షస ప్రవృత్తి గల జగన్ను మరో అవతారం ఎత్తమంటున్నాడు.
జయ-విజయులు ఎత్తిన మూడు రాక్షస జన్మల గురించి తెలుసుకుందాం. కృతయుగంలో భూమిని అపహరించిన హిరణ్యాక్షుడిని వరాహ అవతారంలో, భక్తుడైన ప్రహ్లాదుడిని వేధించిన హిరణ్యకశిపుడిని నరసింహ అవతారంలో ఆయన సంహరించాడు.
త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించి లోకకంటకుడిగా మారిన రావణాసురుడిని, అతని సోదరుడు కుంభకర్ణుడిని శ్రీరాముడిగా అవతరించి హతమార్చాడు. ద్వాపరయుగంలో అహంకారంతో ధర్మాన్ని ధిక్కరించిన శిశుపాలుడు, దంతవక్త్రులను శ్రీకృష్ణుడి రూపంలో సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు.
ఈ లెక్కన జగన్ మరో అవతారం అంటే గ్రేట్ ఆంధ్రా ఉద్దేశం ఏమిటి? ఈ జన్మ చాలించి, పురాణాల ప్రకారం కలియుగ అంతంలో అధర్మం పరాకాష్టకు చేరినప్పుడు, మళ్లీ ధర్మ పరిరక్షణ కోసం వచ్చే కల్కి చేతిలో అంతమవ్వడానికి.. మరింత దుష్ట దుర్మార్గుడిగా పుట్టాలని కోరుకుంటున్నారా?
– చాకిరేవు