– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కొనియాడారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరులో సోమవారం నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు.
పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావించిందన్నారు. నేటి తెలుగు ప్రజల ఉనికి పొట్టి శ్రీరాముల పోరాటంతోనే సాధ్యమైందన్నారు. పొట్తి శ్రీరాముల త్యాగం భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్న లక్ష్యంతోనే భారీ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన అభినందనీయమన్నారు.
విగ్రహం ఏర్పాటు చేసిన అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి సవిత అభినందించారు. పొట్టి శ్రీరాముల భారీ విగ్రహం భావి తరాలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందన్నారు. అమరజీవి తరవాత తెలుగు వారి సత్తాను ఢిల్లీ చాటిన ఘనత అన్న ఎన్టీఆర్ దన్నారు. పొట్టి శ్రీరాముల ఆశయ సాధన, ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రుల రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.