– బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు, రివార్డు ప్రకటించాలి
– అమిత్ షా, మోడీతో మాట్లాడి బండి సంజయ్ ను భర్తరఫ్ చేయాలి
– ముఖ్యమంత్రి,హోం మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్
– బండి సంజయ్ ఎ2, సంగప్ప ఎ3 గా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయాలి
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్,ఆసిఫాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు,నౌకాశ్రయాలకు నోటీసులు పంపాలని, సాయి భగీరథ్ ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని తెలుపుతూ,సైబరాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించాలన్నారు.
సాయి భగీరథ్ పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి,కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదని, నిందితునికే పోలీసులు సహకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్తే, పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదు? బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలి.
నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్, ఎసిపిలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర డిజిపిని కోరారు. పోలీసులు సాయి భగీరథ్ పై ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 11,12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదైన,దు చేశారన్నారు. వాస్తవానికి సెక్షన్ 7,8 ప్రకారం అతనిపై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట్టాలన్నారు. నిందితునిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలన్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారని, నిందితున్ని ఎందుకు పట్టుకోవడంలేదన్నారు.
బాలల హక్కుల కమీషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ,రాష్ట్ర డిజిపిలకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలన్నారు. బండి సంజయ్ కూడా బాధిత కుటుంబాన్ని బెదిరించారని, ఆయన కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉంటే కేసును ప్రభావితం చేస్తారని,బాధిత కుటుంబాన్ని బెదిరిస్తారని అందుకే దేశ హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో మాట్లాడి బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో వి6 రిపోర్టర్ గా పనిచేసి,ఇపుడు బిజేపి అధికార ప్రతినిధిగా ఉన్న సంగప్ప కూడా బాధితులను తీసుకొచ్చి బండి సంజయ్ తో కలిపించి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అందుకే బండి సంజయ్ ఏ2, సంగప్ప ఏ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి ప్రధాని కార్యక్రమంలో బండి సంజయ్ తమ ప్రియ మిత్రుడని చెప్పుకున్నారని, అందుకే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయడం లేదన్నారు.
హైదరాబాద్ లో మాజీ డిజిపి భార్యను హత్య చేసినా అడిగే నాధుడే లేడని, తెలంగాణలో శాంతి భధ్రతలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా ,ముఖ్యమంత్రిగా విఫలమయ్యారన్నారు. రేవంత్ రెడ్డి కింద లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయని, ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదని, అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు విజిట్ చేయలేదని అడిగారు.
బండి సంజయ్ కొడుకును కింద కోసం,రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా ఫోన్ ట్యాపింగ్,ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గృహ లక్ష్మి, మహా లక్ష్మి పేరుతో పథకాలు పెట్టి మహిళల గురించి గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాల్లు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని, బాధిత అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డిపైనే ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు ఈ విషయం తెలుసుకోవాలన్నారు. బిజేపి సోషల్ మీడియాలో అమ్మాయి గురించి తప్పుడు ప్రచారం చేస్తూ, బాధిత కుటుంబం గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.
గతంలో జర్నలిస్ట్ రేవతిని అర్థరాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసినట్టు, క్రిశాంక్ పై 35 కేసులు పెట్టినట్టు బిజెపి కార్యకర్తలపై ఎందుకు పెట్టడం లేదన్నారు? సాయి భగీరథ్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకులే కేసులు పెట్టించారని బిజేపి నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, నిందితుడు మైనర్ అమ్మాయిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన తర్వాతనే మాకు తెలిసిందని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేయడం మారాలని, వాట్సాప్ యూనివర్సిటీ తెలిపి చూపించకూడదని సూచించారు.
బిజెపి అగ్రనాయకత్వం భేటీ బచావో అని చెప్పి, కేంద్ర మంత్రి బేటా బచావో అమలు చేస్తుందని విమర్శించారు. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని మోడీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మహిళలకు మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ విమర్శించారు. బండి సంజయ్ నిన్నటి సభలో నేను ఎబివిపి,యువ మోర్చా, బిజేపిలో పని చేశానని కన్నీరు పెట్టుకుంటూ డ్రామాలు చేస్తున్నారని.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలన్నారు. గత మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మైనర్ అమ్మాయికి వ్యతిరేకంగా కుల సంఘాలు మాట్లాడడం, బండి సంజయ్ ని కాపాడుకుంటామనడం దారుణమన్నారు. అమ్మాయి కూడా బండి సంజయ్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని, కుల సంఘాల నాయకులు అమ్మాయికి ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సామాజిక ఉద్యమకారులు మందకృష్ణ మాదిగ,ఇతర ప్రజా సంఘాల నాయకులు యువత కూడా స్పందించి మైనర్ అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని, పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అమ్మాయికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు.
కాగజ్ నగర్ లోని తమ నివాసం ప్రాణ హిత నిలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మహిళా కన్వీనర్ లలిత,మాజీ సిర్పూర్ ఎంపిపి మాలతి, మహిళా నాయకురాలు వరలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.