Suryaa.co.in

Andhra Pradesh

యువకుడిని చెట్టుకు కట్టి కొట్టిన వైసిపి నాయకుడు

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వి.జుత్తడ లో అమానుషం చోటు చేసుకుంది. ఓ దళిత యువకుడిని మరో దళిత నాయకుడు చెట్టుకు కట్టేసి, చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పెందుర్తి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వి.జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు మద్యం తాగి, వైసిపి నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు.

మర్నాటి ఉదయం తన సెల్ ఫోన్ దొంగిలించాడు అన్న ఆరోపణతో తారకేశ్వర రావును సూరిబాబు చెట్టుకు కట్టి, చెప్పుతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడు. వైసిపి నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. సూరిబాబు చంపేస్తానని తారకేశ్వర రావు బెదిరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సూరిబాబు తారకేశ్వర రావుపై కేసు పెడతానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పాత ఘటన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానిక ఎంపీటీసీ సభ్యుడి ఇంటి సమీపంలోనే జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెల్ ఫోన్ దొంగిలించాడనే దాడి : సీఐ
తన సెల్ ఫోన్ ను తారకేశ్వరరావు దొంగిలించాడనే సూరిబాబు అతనిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పెందుర్తి సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ వీడియో కలకలం రేపిన నేపథ్యంలో గ్రామంలో విచారణ చేశామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

LEAVE A RESPONSE