Suryaa.co.in

Telangana

కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల ముందో, వెనుకో పొత్తు ఉంటుంది

-మునుగోడు గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు
-రాష్ట్ర పతి ఎన్నికల్లో మీరు తెరాస కలిసి మద్దతు తెలపలేదా?
-ఢిల్లీలో కేటీఆర్, రాహుల్ చెట్టా పట్టాలు వేసుకొని తిరగ లేదా?
-తెలంగాణ ప్రజలు అమాయకులు, ఏడ్డోల్లు అనుకుంటున్నారా ?
-కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ప్రశ్నలతో కడిగేశారు. కాంగ్రె స్ విధానాలను దుయ్యబట్టారు. తెలంగాణకు బీజేపీ దిక్సూచిగా మారిందన్నారు.

ఈటల రాజేందర్ ఇంకా ఏమన్నారంటే… కోమటి రెడ్డి నాకు చిరకాల మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు. 2006 నుండి ఈరోజు వరకు పార్టీలు వేరు అయిన అన్యాయాలకు వ్యతిరేకంగా కలిసి కొట్లడుతున్నం. పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు. పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు సమాజం అసహ్యించుకునే రీతిలో జుగుప్చాకరంగా ఉన్నాయి. తిట్టడం, బ్లాక్ మెయిల్, ఇతరుల మనసులు గాయపరచడం ఆయన నైజం. పిసిసి అధ్యక్షుడు స్థాయిలో కూడా గత భాష, ప్రవర్తన, బ్లాక్ మెయిల్ మర్చిపోలేదు. సంస్కారవంతమన వారు ఈ మాటలు సహించరు. 4 పార్టీలు మారిన వ్యక్తి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడలేను.

కాంగ్రెస్ ఎందుకు బాగుపడతలేదు అనే నిస్పృహలతో మాట్లాడినట్టు ఉంది. దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్. 100 సంవత్సరాల చరిత్ర కల పార్టీ అని చెప్పుకునే వారు..75 ఎల్లలో 50 సంవత్సరాలు పాలించిన పార్టీ.. అలాంటి పార్టీ ఎందుకు ఇలా అయిపోయింది అని శోధించి, ఆత్మావలోకనం చేసుకొని, రిపేర్ చేసుకోవాలి. కానీ అది మర్చి పోయి మమ్ముల్ని విమర్శిస్తే ఆయనే పలుచ పడతారు.

ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కాంగ్రెస్. అహంకారం వల్ల పతనం అయిన పార్టీ కాంగ్రెస్. ఎంపీలను, ఎమ్మెల్యేలను చివరికి సీఎంలను కూడా లెక్క చేయని పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజానీకాన్ని వంచించిన కారణంగా అది తుడిచిపెట్టుకుపోయింది. ఎమర్జెన్సీ వ్యతిరేకతలో కూడా 1978లో గెలిచిన చెన్నా రెడ్డి సీఎం అయితే ఆయన్ని మార్చి అంజయ్యను, ఆయన్ని మార్చి భవనం వెంకట్రామిరెడ్డి, ఆయన్ని మార్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డినీ నియమించారు. సంవత్సరానికి ఒక సీఎంను చేశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టవద్దు అని ఎన్టీఆర్ కొట్టుడు కొడితే కాంగ్రెస్ దిమ్మ తిరిగింది. 245 పైన సీట్లు ఎన్టీఆర్ గెలిచారు.

అప్పుడు ఎలా కాంగ్రెస్ లేకుండా పోయిందో అదే పద్ధతిలో కాంగ్రెస్ ఇప్పుడు కనుమరుగు అవుతుంది. మహారాష్ట్రలో ఎక్నాథ్ షిండే తన భాధ్యత నిర్వహించారు. ప్రజానీకం బీజేపీ-శివసేన కూటమికి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ తన సిద్ధాంత పక్కన పెట్టి.. శివసేన తో అక్రమ పొత్తు పెట్టుకొని దొడ్డి దారిన థాక్రే ను సీఎం చేశారు. దీనికి మహారాష్ట్ర ప్రజలు మదనపడ్డారు. మూల సిద్దాంతం వదిలిన థాక్రే ని మహారాష్ట్ర ప్రజలు ఛీ కొట్టారు. ప్రజలకు అనుగుణంగా ఏక్ నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు. అన్యాయం చేసింది, దుర్మార్గానికి ఒడిగట్టింది, చిల్లర పనులు చేసింది కాంగ్రెస్. యూపీలో ప్రియాంక నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళితే 403 స్థానాలకు 2 స్థానాలకు పరిమితం అయ్యింది. రాహుల్ గాంధీ సైతం సొంత ఊరిలో ఓడిపోయి కేరళ పోయారు.కాంగ్రెస్ పతనానికి కారణాలు ఆత్మావలోకనం చేసుకోండి. ఇతరుల మీద దాడి ఎందుకు?

రేవంత్ గారు మీరు తెరాస చెట్టపట్టలు వేసుకొని తిరగడం వాస్తవం కాదా ? మీ మిత్రపక్ష పార్టీలు అయిన హేమంత్ సోరేన్ కు, యూపీలో అఖిలేష్ కి, తమిళనాడులో స్టాలిన్ కి కేసీఆర్ పైసలు పంపింది వాస్తవం కాదా ? కాంగ్రెస్ మిత్ర పార్టీలకు కెసిఆర్ సంపూర్ణ సహకారం ఉన్న తరువాత, ఇక్కడ మీరు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? రాష్ట్ర పతి ఎన్నికల్లో మీరు తెరాస కలిసి మద్దతు తెలపలేదా? ఢిల్లీలో కేటీఆర్, రాహుల్ చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేద ? తెలంగాణ ప్రజలు అమాయకులు, ఏడ్డోల్లు అనుకుంటున్నారా ? కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల ముందో, వెనుకో పొత్తు ఉంటుంది.

మేము ఫిరాయింపులు చేయడం లేదు.ప్రలోభ పెట్టడం లేదు. బాజాప్త బహిరంగంగా చేర్చుకుంటున్నం. 2014 నుండి 18 మధ్యలో.. 12 మంది mlc కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, 5 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తెరాసాలో కలుపుకున్నారు. 2018 లో.. 88 మంది తెరాస వాళ్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీనీ ప్రతిపక్ష పార్టీగా ఉండమని ప్రజలు గెలిపిస్తే.. మీ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన యాంటీ డిఫెక్టన్ లా ను అధిగమించి 12 మంది ఎమ్మెల్యేలు తెరాస కి పోయారు. మీరు ఏం చేశారు? రాజగోపాల్ రెడ్డి పోవాలి అనుకుంటే ఆయనకు ఆరోజే మంత్రి అయ్యేవారు.. నేనే సాక్షిని. కొట్లడత అన్నారు. కాంగ్రెస్ పార్టీలో హీరోయిజంగా కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వీడలేదు.

2014 నుండి ఆయన్ని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టారో నాకు తెలుసు. కక్ష కట్టి, కాంట్రాక్ట్ రద్దు చేసిన, బిల్లులు ఆపినా తెరాసలో చేరలేదు. కమిటీ చైర్మన్ గా నన్ను పెట్టారు. నేను దొంగల్లాగా ప్రలోభ పెట్టీ తీసుకోవడంలేదు. మోదీ గారి గొప్పతనం ప్రజల చేత ఆమోదం పొందిది కాబట్టి, రాబోయే కాలంలో ఉండేది బీజేపీ కాబట్టి,రాజకీయ భవిష్యత్తు ఉటుంది అని బీజేపీకి వస్తున్నారు. మాతో టచ్ లేని ఎమ్మెల్యే లేరు.. వందలమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు మాట్లాడుతున్నారు.

రేవంత్ సోయి ఉంటే అడుగుతున్న.. సర్పంచ్ బిల్లులు ఇవ్వడం లేదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ లకు భాద్యతలు నిధులు ఉన్నాయా? ఉత్సవ విగ్రహాలు చేయడం నిజం కాదా వాటి గురించి మాట్లాడు. కేసీఆర్ దొర అహంకారంతో కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు అని, కాంగ్రెస్ పార్టీ సహకరించక పోయినా కూడా అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి.. నీకు సత్తా ఉంటే కొడంగల్ లో ఎందుకు ఒడిపోయావు? రాజకీయ సన్యాసం తీసుకుంట అన్నావు ఏమైంది? ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవారు ఎవరు.. ఎవరి చరిత్ర ఏంటి ? ఎవరి కమిట్మెంట్ ఎంత ? ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు.. ఎవరు వారికోసం పనిచేసుకుంటున్నారు.. నిర్ణయించాల్సింది ప్రజలు.

మునుగోడు ఎన్నికల్లో ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్న. డబ్బు సంచులు, అధికార దుర్వినియోగంను హుజూరాబాద్ లో లాగా పాతరవేయాలి.నల్గొండ రేశానికి పుట్టినిల్లు. రాజీ పడని వారు,రజాకార్ల వ్యతిరేకంగా కొట్లడిన ప్రజలు. ఇది వ్యక్తుల మధ్య కాదు పోటీ కాదు.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు మహర్ధశ పట్టింది. అక్కడ ప్రజలు సంతోష పడుతున్నారు. అన్నీ వస్తాయి అని కుషీ అవుతున్నారు. చేనేత భీమా వస్తుంది అని, దళిత బంధు వస్తుందని భావిస్తున్నారు. గట్టుప్పల్ మండలం వెంటనే అయ్యింది. మునుగోడు ప్రజలారా.. మా హృదయం ఎంత గాయపడిందో మీకు తెలుసు. ఓట్ల కోసం, సీట్ల కోసం తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి కేసీఆర్.

నల్లగొండ జిల్లాలో తేల్చుకుందాం.. ధర్మం న్యాయం వైపు ఉందాం ఉందాం అని పిలుపు ఇచ్చా.. మా ఎజెండా కెసిఆర్ దుర్మార్గాలు అడ్డుకోవడం.. ప్రజాస్వామ్యాన్ని చెరపడుతున్న కెసిఆర్ దుర్మార్గాన్ని ఎదిరించెందుకు జరుగుతున్న పోరాటం. మునుగోడుగెలుపు తెలంగాణ ప్రజల గెలుపు, మునుగోడు ప్రజల గెలుపు. అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదు కాబట్టి సభ జరిగితే మమ్ముల్ని మళ్లీ రానివ్వరట. Vro జీవితాలు అగమ్య గోచరం అయ్యాయి. మహిళలకు 3 వేల కోట్ల బాకీ ఉంది. సీఎం నీకు పాలించే దమ్ము లేదా.. తప్పు జరిగితే సంస్కరించ లేవా ? ఎలుకల బాధకు ఇళ్ళు తగలపెడతారా ? వేల ఎకరాల భూములు కబ్జా చేయడానికే ధరణి తెచ్చారు. అడ్డుగా ఉంటారు అని vro లను తొలగించారు.

హుజూరాబాద్ లో చిల్లర గాళ్లు ఎంది ? వారి సవాలు ఎందీ ? ఎమ్మెల్యే గెలిచిన తరువాత ప్రోటోకాల్ పాటిస్తున్నారా ? 20 ఏళ్లలో 7 సార్లు గెలిచిన..రెండు సార్లు మంత్రిగా పని చేసిన. ఎమ్మెల్యే పిలిస్తే mro రారు, ఎంపిడిఓ రారు. వారికి మాత్రం రెండు పోలీసు కార్లు.. ముందు వెనుక పడతారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. చిల్లర వేషాలు మా ప్రజలు సహించరు. 2014 లో నన్ను ఓడించడానికి ఈయనకు కెసిఆర్ డబ్బులు పంపించారు. మానుకోటలో మేము జగన్ రావొద్దు అని ఆందోళన చేస్తుంటే, మా మీద రాళ్ళు వేశారు, జిప్పు విప్పి చూపించారు. మా రక్తం కళ్ళజూశారు. అలాంటి ఆయన ఇప్పుడు కేసీఆర్ కి దేవుడు అయ్యాడు. నేను దయ్యం అయిన.

నా పంచాయితీ ధర్మాన్ని చెరపడుతున్న, తెలంగాణ ఆశయాన్ని తుంగలో తొక్కిన కెసిఆర్ తో. చిల్లర పనులు చేస్తున్న వారు ఊదితే పోతారు.. నేను మొన్నే కెసిఆర్ మీద హుజూరాబాద్ లో గెలిచిన.. ఇక గజ్వేల్ లో కొడతా అని చెప్పిన. కేసీఆర్ దమ్ముంటే రా పోదాం.. అంతే కానీ నియోజకవర్గంలో ఇలాంటి పిచ్చి వేషాలు వేయిస్తే మాడి మసి అవుతారు. ఆయారం గాయారం ఉంటారు, చెరపకురా చెడేవు అంటారు, అప్రజాస్వామిక విధానాలకు పుట్టినిల్లు కాంగ్రెస్, నీవు నేర్పిన విద్య నే కదా నీరజాక్ష అన్నటు, విష సంస్కృతి ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అనుభవిస్తుంది.

సాయుధ పోరాటానికి కేంద్ర బిందువు నల్గొండ అయితే.. మలి యుద్ధం చేసింది కరీంనగర్, హుజూరాబాద్ అలాంటి దగ్గరే బీజేపీ గెలిచింది. ప్రజలకు మేలైన.. ప్రజలకు నచ్చిన పార్టీ కోసం ప్రజల ఆరాటం..ఇది సాయుధ పోరాటం కాదు బ్యాలెట్ యుద్ధం. సంకీర్ణ ప్రభుత్వాలు దిక్కు అనుకున్న సమయంలో, బీజేపీ అధికారంలోకి వచ్చింది. రెండవ సారి 303 సీట్లు సాధించి ప్రజల ప్రేమ పొందారు నరేంద్ర మోదీ. రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు నిధుల కోసం సీఎం ను మొర పెట్టుకున్నారు..మునుగోడు ప్రజానీకానికి మేలు జరుగుతుంది అని రాజీనామా చేశారు.అవమానం భరించలేక ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడిజిల్లా జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ నాయకులు ప్రేమెందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ, ప్రకాష్ రెడ్డి, అందే బాబయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE