జీఓ 77 రద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, పాఠశాల విలీన ప్రక్రియ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.ఈ సందర్భంగా విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ డిమాండ్ చేశారు. విశాఖలో టీఎన్ఎస్ఎఫ్ పిలుపు మేరకు విద్యాగ్రహ దీక్ష చెపట్టారు విద్యార్థి సంఘం నాయకులు. తెదేపా కార్యాలయం నుంచి దీక్షకు ర్యాలీగా వెళ్లుతున్న విద్యార్థి నాయకులతో పాటుగా తెదేపా కార్యకర్తలకు పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి అరేటి మహేష్తో సహా పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు.తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అరెస్టులపై స్పందించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు టీఎన్ఎస్ఎఫ్ తలపెట్టిన విద్యా ఆగ్రహ దీక్షను అడ్డుకోవడం జగన్ నియంత పరిపాలనకు నిదర్శనమని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.వారం రోజుల ముందే అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
ఇవ్వకపోగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.అడ్డగోలు నిర్ణయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేసిన జగన్ ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలని హితవు పలికారు. జీఓ.77 రద్దు, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పునరుద్ధరణ, పాఠశాల విలీన ప్రక్రియ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, తదితర డిమాండ్స్ను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.