– పవన్ కల్యాణ్ మీద చంద్రబాబే కుట్ర చేస్తున్నాడేమో..!
– పవన్ పై జరిగిన రెక్కీ కేసులో అరెస్టైంది చంద్రబాబు, లోకేష్ మనుషులే
– గుజరాత్ వాహనం పట్టుబడితే.. దానికి రెడ్డి కార్పొరేషన్ బోర్డు మార్ఫింగ్ చేసి కుట్రలా?
– ఈ కుట్ర వెనుక పెద్దలెవరో నిగ్గు తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తాం
– రెడ్డి-కాపు కులాల మధ్య చిచ్చు పెడితే లబ్ధి పొందేది ఎవరో జనసైనికులు గుర్తెరగాలి
– కాపు, కమ్మ, రెడ్డి కార్పొరేషన్ల ఛైర్మెన్లు అడపా శేషు, తుమ్మల చంద్రశేఖర్, చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి
రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు రాజేసి.. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని కాపు, కమ్మ, రెడ్డి కార్పొరేషన్ల ఛైర్మెన్లు అడపా శేషు, తుమ్మల చంద్రశేఖర్, చింతలచెరువు సత్యనారాయణ రెడ్డిలు మండిపడ్డారు. సంక్షేమం-అభివృద్ధే ఎజెండాగా సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వేలెత్తి చూపించేందుకు ఏ ఒక్క అంశమూ లేకపోవడంతో, ఆఖరికి కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు దిగజారిపోయారని అన్నారు.
హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ పై రెక్కీ జరిగితే.. అదికూడా టీడీపీకి చెందినవారే, ఆ సామాజికవర్గంవారే, చంద్రబాబు, కోడెల శివప్రసాద్ లతో ఫోటోలు దిగిన వారే పాల్పడితే, అక్కడ వారిపై కేసు కూడా నమోదైతే.. దాన్ని తీసుకువచ్చి ఆంధ్రా రాజకీయాలకు ముడి పెట్టి, రెడ్డి కార్పొరేషన్ ఛైర్మెన్ కారు పేరుతో బోర్డును మార్ఫింగ్ చేసి, రెడ్డి, కాపుల మధ్య చిచ్చు పెట్టి, ఈ కులాల మధ్య మంటలు పెట్టాలని చూస్తున్నారని వారు దుయ్యబట్టారు. రెడ్డి-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టి.. తద్వారా చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నాడని వారు ధ్వజమెత్తారు. అధికారం కోసం ఇంతగా దిగిజారిపోయి.. సమాజంలో చిచ్చుపెడతారా చంద్రబాబూ.. అంటూ వారు సూటిగా ప్రశ్నించారు.
గత మూడు రోజులుగా ఓ వర్గం టీవీ ఛానళ్ళలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, 99 టీవీ, ప్రైమ్ 9లలో, పవన్ కల్యాణ్ రెక్కీ వెనుక రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ హస్తం ఉందని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ.. కథనాలు నడిపిస్తూ, వాటిపై చర్చలు చేస్తూ, వాటిని టీడీపీ, జనసేన అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి, రెడ్డి-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై బురదచల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కుట్రల వెనుక కచ్చితంగా చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కుట్రకు ఎవరు పాల్పడ్డారు, దీని వెనుక ఎవరున్నారన్నదానిపై సమగ్ర విచారణ జరిపి, దోషులెవరో తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తప్పుడు వార్తలను ప్రసారం చేసిన టీవీ యాజమాన్యాలపైన, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు చెప్పారు. రెడ్డి-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఎవరు రాజకీయంగా లబ్ధి పొందుతారో తెలుసుకోవాలని, చంద్రబాబు కుట్రలకు మీరు బలికావొద్దని జనసేన కార్యకర్తలకు వారు హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ ఛైర్మెన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ…
– పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర అక్టోబరు 31 రాత్రి రెక్కీ జరిగిన ఘటనలో.. అరెస్టు అయిన వ్యక్తులు సాయి కృష్ణ చౌదరి – విజయ్ ఆదిత్య. వారు పవన్ కల్యాణ్ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతూ, సెక్యూరిటీతో గొడవ పడితే.. ఫిర్యాదు మేరకు వారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
– వారిద్దరూ ఎవరంటే.. చంద్రబాబు, లోకేష్ మనుషులే అని.. వారు దిగిన ఫోటోలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుది. ఆ ఫోటోలను కూడా మీడియాకు ఇస్తున్నాం. ఆ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్ మనుషులే అని మేము కూడా బలంగా నమ్ముతున్నా.
– ఎందుకంటే, వాళ్ళే కుట్రకు పాల్పడి, వారు పట్టబడ్డ వాహనం గుజరాత్ రాష్ట్రానికి చెందినది కాగా, ఆ వాహనం నంబరు జీవీ 21 ఏ డబ్ల్యూ 1905.. దాన్ని పక్కదారి పట్టించేందుకు అసలు సంబంధమే లేని నా కారు బోర్డును(రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్) మార్ఫింగ్ చేసి, రెడ్డి-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర పన్ని, దానినే కొన్ని టీవీ ఛానళ్ళల్లో ప్రసారం చేస్తూ, టీడీపీ- జనసేన సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానుల పేరుతో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
– పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా నా పేరుగానీ, నా కారుగానీ ఎక్కడా లేదు. నా బోర్డు వాడుకుని.. దాని మీద ఒక వర్గం మీడియాలో కథనాలు ప్రసారం చేయడం, చర్చలు జరపడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డిగారు ఎవరికీ హానీ తలపెట్టరు. మా కార్పొరేషన్ ఉన్నది- మా కులంలో పేద, అట్టడుగున ఉన్న వారికి న్యాయం చేయటం కోసమే తప్ప అది రాజకీయ పదవి కాదు.
– రెండు, మూడు రోజులుగా నా పై చేస్తున్న జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల, జనసేన కార్యకర్తలు నాపై కోపం పెంచుకుని నాకు ఏదైనా నష్టం చేస్తే.. దానికి ఏబీఎన్ రాధాకృష్ణ, 99 టీవీ, ప్రైమ్ 9 టీవీ యాజమాన్యాలు, ఈ కుట్ర వెనుక ఉన్నవాళ్ళే బాధ్యత వహించాలి.
– చంద్రబాబుకు వయసు పెరిగినా.. బుద్ధి మారలేదు. 40 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి సిగ్గు ఎక్కడ లేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
– ఏ ఒక్కరికీ అపకారం చేయని వ్యక్తిని నేను. నన్ను ఒక క్రిమినల్ గా చిత్రీకరిస్తూ..నాపై అన్యాయంగా నిందలు మోపడం ఆ మీడియాకు తగదు.
– వంగవీటి రంగా గారి హత్య విషయంలో.. ఎవరి పాత్ర ఉందో, కుట్రదారులెవరో, పాత్రదారులెవరో అన్నది కాపు సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య ఆనాడు మంత్రి హోదాలో, ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
– మొన్నటికి మొన్న కోనసీమలో జరిగిన అల్లర్లు, తిరుపతి, విశాఖల్లో జరిగిన దాడుల వెనుక ఎవరు ఉన్నారు, వీటిని ఎవరు చేశారు. ఎందుకు చేస్తున్నారన్నది రాష్ట్ర ప్రజలు గమనించాలి.
– పవన్ కల్యాణ్ మీద రెక్కీ నిర్వహించాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నేను చిరంజీవి అభిమానిని, ఇప్పటికీ చిరంజీవి గారి సినిమాలు చూస్తా.. కులాలను అడ్డు పెట్టుకుని రెచ్చగొట్టడం మంచిది కాదు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో విచారణ జరిపి, తేల్చాల్సిందిగా, నేను డీజీపీకి ఫిర్యాదు చేస్తాను.
కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ మాట్లాడుతూ…
– అధికారం పోయిందని, మళ్ళీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం సమాజానికి మంచిది కాదు. కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు గెలవలేరు.
– పవన్ కల్యాణ్ ను సినిమా స్టార్ గా, ఒక పార్టీ అధినేతగా మేము గుర్తిస్తాం. ఆయన ఒక విమర్శ చేస్తే.. మేము పది చేస్తాం. అంతేగానీ చంద్రబాబులా కులాల మధ్య కుంపట్లు పెట్టే రాజకీయాలు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చేయరు.
– చంద్రబాబు కుట్ర రాజకీయం ఏమిటో ప్రజలకు అర్థమయ్యింది కాబట్టే.. 2019 ఎన్నికల్లో 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఓటమికి కారణాలను పరిశీలించుకోకుండా, కుట్రలు చేస్తే చంద్రబాబు ఎప్పటికీ అధికారంలోకి రాలేడు. ఏదోరకంగా అధికారంలోకి రావాలన్న ఆత్రంతో.. చంద్రబాబు ఇన్ని కుట్రలు చేస్తున్నాడు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. కుట్ర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు అని రాష్ట్రంలో అందరికీ తెలుసు.
– ఇప్పటికైనా వయసుకు తగినట్టుగా చంద్రబాబు నడుచుకుంటే మంచిది. చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని మీడియా సమక్షంలో చెబుతున్నాను.
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ…
– కాపు సామాజికవర్గం మీద పెద్ద కుట్ర జరుగుతోందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నేను ముందు నుంచీ చెబుతున్నాను. పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్ళక ముందే అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసిందీ, మంత్రుల మీద దాడికి పాల్పడిందీ, ఉసిగొల్పిందీ టీడీపీనే.
– పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర రెక్కీకి సంబంధించిన కేసులో దొరికిన వారు టీడీపీకి చెందిన వారే.. అయితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది టీడీపీ-చంద్రబాబే. – పవన్ పై రెక్కీ నిర్వహించాల్సిన అవసరం మా పార్టీలో ఎవరికీ లేదు.
– నిందితుల వాహనానికి ఉన్న బోర్డును మార్ఫింగ్ చేసి, కనీసం అక్కడ దొరికిన కారు ఏ రంగో, సత్యనారాయణ రెడ్డిగారి కారు ఏ రంగో కూడా అవగాహన లేకుండా, నేమ్ బోర్డు మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు చేస్తున్నారు.
– జనసైనికులను కూడా నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు చీప్ ట్రిక్స్ తో మీ నాయకుడు పవన్ కల్యాణ్ మీద కుట్ర చేస్తున్నారేమో మీరు గమనించండి.
– రెడ్డి- కాపు కులాల మధ్య గొడవలు సృష్టించి, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. ఆఖరికి చంద్రబాబు రాజకీయాలను ఎటువైపు తీసుకువెళుతున్నాడో గమనించాలి. టీడీపీ పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్నివిధాలా నష్టపోయింది కాపులే.
– కేఏ పాల్.. కూడా అనేక సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి, నా మీదకుట్ర జరుగుతుంది… నాకు రక్షణ కావాలి అని అడిగినట్టే.. మీరు కూడా అటువంటి రాజకీయమే చేస్తున్నారు. ఇది నేను చెప్పటం లేదు. గత ఎన్నికల సమయంలో నా మీద కుట్ర చేస్తున్నారు. నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ మాట్లాడిన వీడియోలు యూట్యూబ్ లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి చూడండి.
– పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తే.. దానికి మా పార్టీ నుంచి కౌంటర్ ఇవ్వడం తప్పా..? .
– రెడ్లు, కాపుల మధ్య గొడవ సృష్టిస్తే.. లబ్ధి పొందేది ఎవరు అనేది అందరికీ తెలుసు. టీడీపీ రాజకీయంగా లబ్ధి పొందితే.. కేసులు మాత్రం కాపు యువత మీద పెడుతున్నారు.
– ముఖ్యమంత్రి జగన్ గారు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
– కాపు కులస్తులు ఆలోచించి, వెనుక శక్తులను బయటకు లాగండి అని కోరుకుంటున్నాను.
– వైజాగ్ లో పవన్ కల్యాణ్ పై ఎటువంటి దాడి జరగలేదు..మా మంత్రుల మీదనే దాడి జరిగింది.
– వంగవీటి రంగా హత్యలో ప్రధాన పాత్రధారులు చంద్రబాబు, కోడెల శివప్రసాదరావులే అన్నది అందరికీ తెలుసు.
– చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలలో కాపులు బలికావొద్దని మనవి.