-టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు
రాయలసీమ ఉద్యమం ముసుగులో కొంతమంది వై. ఎస్.జగన్ రెడ్డి కూలీలు చంద్రబాబుపై విషం కక్కుతున్నారని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు విరుచుకుపడ్డారు. కర్నూలులో కొంతమంది సీమ ద్రోహులు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కల్పించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
అనంతపురంలోని తన స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. మూడు రోజులుగా కర్నూలు జిల్లాలో చంద్రబాబుకు వస్తున్న విశేష జన స్పందనను తట్టుకోలేక వైసీపీ నాయకులు తమ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారన్నారు. మూడు రాజధానులు కావాలంటున్న వారు పాలనా రాజధానిగా విశాఖను అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఉండాలన్నది గతంలోనే చంద్రబాబు నిర్ణయమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిఉంటే ఈపాటికి అది సాధ్యపడేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే హైకోర్టు బెంచ్ ఇంతవరకు ఏర్పడలేదన్నారు. జగన్ కూలి డబ్బులకాశపడి చంద్రబాబును విమర్శిస్తున్న నకిలీ ఉద్యమకారులు హైకోర్టు కోసం వైసీపీ నాయకులను ఎందుకు నిలదీయలేదన్నారు. వైసీపీ ఎంపీలు కర్నూలులో హైకోర్టు కోసం ఢిల్లీలో ఏనాడైనా ప్రయత్నాలు చేశారా అన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదన్నారు.
అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడం మాని ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడమేమిటని నిలదీశారు. జగన్ రెడ్డి ప్రయోజనాలు కాపాడడానికే అతని పేటిఎం బ్యాచ్ సీమలో చిల్లర రాజకీయాలు చేస్తోందన్నారు.
అందుకే గత మూడున్నరేళ్లుగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయినా కుహనా మేధావులు ఏనాడు నోరుతెరవలేదన్నారు. వైసిపి పాలనలో సీమ జిల్లాలకు పరిశ్రమలు రావు, ప్రగతి పనుల్లేవు, మెట్టరైతులకు రాయితీలు ఇవ్వరు.. ఇలా అన్ని రంగాల్లో రాయలసీమను సర్వనాశనం చేస్తున్న జగన్ వినాశకర విధానాలపై పోరాడాల్సిన సమయంలో కొంతమంది పనిమాలిన సన్నాసులు పనిగట్టుకుని చంద్రబాబుపై దుష్ప్రచారం సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వైసీపీ ప్రాయోజిత కుట్రలను సీమవాసులు భగ్నం చేయాలని కాలవ పిలుపునిచ్చారు. జగన్ కూలీలు రాజకీయ కుట్రలు మానుకోకుంటే గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు.