Home » అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మాట్లాడుతా

అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మాట్లాడుతా

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

శాసనసభ బడ్జెట్ సమావేశాలు కనీసం 30 నుంచి 35 రోజుల పాటు నిర్వహించాలని బిఏసి సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రజా సమస్యలు‌, ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా తీసుకొని ప్రజల గొంతుక అసెంబ్లీలో గళం వినిపిస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వీటితో ముడిపడి ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల అవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి స్పష్టమైనటువంటి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టడం కోసం మా ప్రయత్నం చేస్తాం.వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ కోతలు, రుణమాఫీ, పోడు భూముల సమస్యలు, ధరణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, పెంచిన కరెంటు చార్జీల గురించి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మాట్లాడుతాము.

ఇరిగేషన్ ప్రాజెక్టులు‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తదితర ప్రజల అంశాలపై శాసనసభలో లేవనెత్తి లోతుగా చర్చించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల ప్రాధాన్యతను ఎంపిక చేసుకొని వాటి గురించి శాసనసభలో సుదీర్ఘంగా లోతైన చర్చ పెడతాము.ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వచ్చిన వినతులు అన్నింటిని పరిష్కరించాలని అసెంబ్లీలో లేవనెత్తుతాను.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు సరిగ్గా లేవు.2022-23 సంవత్సరంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 3.84 శాతం నిధులు కేటాయించగా ఈ సంవత్సరం 3.20 శాతానికి కుదించారు.ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ లాంటి పథకాలకు సైతం కోత పెట్టారు.

దేశంలో చాలామంది ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగానికి ఏటా నిధులు పెంచాల్సిన ప్రభుత్వం కోతలు విధిస్తూ వస్తున్నది.విద్య వైద్యం రంగాలకు సైతం బడ్జెట్లో కోత పెట్టింది.నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. ఉద్యోగాల గురించి వూసే లేదు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.కరోనా సమయంలో చాలామందికి ఉపాధినిచ్చి ఆదుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత రెండు సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులను కోత పెట్టింది.

కార్పొరేట్ అగ్రికల్చర్ చేయడానికి మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు చేస్తున్నది.కార్పొరేట్ అగ్రికల్చర్ దేశానికి, సమాజానికి ప్రమాదకరం.ఈ దేశ సంపదను, వనరులను అంబానీ, ఆదాని కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది.ఆదాని ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అమెరికా ఏజెన్సీ రీసెర్చ్ చేసి బయటపెట్టింది. ప్రధాని మోడీ ఈ దేశ సంపదను వనరులను క్రోనీ క్యాప్టలిస్ట్ లకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిందే నిజమైంది. ఇదే విషయాన్ని ఇప్పుడు అమెరికా ఏజెన్సీ సంస్థ రీసెర్చ్ చేసి బయటపెట్టి రుజువు చేసింది.

ఆదాని చేసిన అతిపెద్ద ఆర్థిక నేరం గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.హాత్ సే హాత్ జోడో యాత్ర గురించి ఈ నెల 4న తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. కార్యాచరణ ప్రణాళికను పార్టీ ప్రకటిస్తుంది. హాత్ సే హాత్ జోడో యాత్రలోపార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పాల్గొనమంటే అక్కడ నుంచి పాల్గొంటాను. రాష్ట్రమంతా చేసే పాదయాత్ర గురించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పాదయాత్ర చేయమని అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నా.

Leave a Reply