-నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను…. దాడులు, నిషేధం పేరుతో మీడియా సంస్థ నోరు నొక్కేసే కుట్ర చేస్తున్నారు
-హిట్లర్, ఇందిరాగాంధీ వంటివారే కాలగర్భంలో కలిసిపోయారనే సంగతిని గుర్తుంచుకుంటే బెటర్
– సిట్ కేసీఆర్ జేబు సంస్థ…. ఆధారాలిచ్చే ప్రసక్తే లేదు
-సిట్ విచారణకు భయపడే ప్రసక్తే లేదు…
-వాస్తవాలు బయటకొస్తే కొడుకు జైలుకు పోతాడనే భయంతోనే సిట్టింగ్ జడ్జి విచారణకు భయపడుతున్న కేసీఆర్
-కొడుకు తప్పు చేయలేదనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
-సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైతే మావద్ద ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదీశారు. కుట్రకు కారకులైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను….. దాడులు, నిషేధం పేరుతో ప్రశ్నించే మీడియా సంస్థల గొంతును అణిచివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఇదే పంథాతో రెచ్చిపోయిన హిట్లర్, ఇందిరాగాంధీ వంటి నియంతలనే మట్టికరిపించిన చరిత్ర ప్రజలకుంది. కేసీఆర్ సర్కార్ కు సైతం అదే గతి పడతనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది.
ఆధారాలు సమర్పించాలని కోరేందుకే సిట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే, సిట్ కు నిబద్ధత ఉంటే…. పేపర్ లీకేజీ కుట్ర వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్లు కేసీఆర్ కొడుకు నాపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కొడుకుకు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్ కు ఉందా? ఆయనను పిలిచి విచారించే ధైర్యముందా?’’ సిట్ కేసీఆర్ జేబు సంస్థగా మారింది. గతంలో డ్రగ్స్, నయీం డైరీ, మియాపూర్ భూములపై సిట్ జరిపిన విచారణలే ఇందుకు నిదర్శనం. ఆయా కేసులను నీరుగార్చడంతోపాటు కేసీఆర్ కు ప్రయోజనం చేకూర్చేలా సిట్ పనిచేసింది. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షిస్తుందనే నమ్మకాన్ని సిట్ ఎప్పుడో కోల్పోయింది.
‘‘తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే, చివరకు తన కొడుకు, బిడ్డ ఉన్నా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డికి, ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడానికంటే ముందే ఆయన కొడుకుకు నోటీసులు ఇప్పించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే పేపర్ లీకేజీ కుట్రదారుల బండారం బయటపడే అవకాశం ఉంది. అదే జరిగితే తన కొడుకుసహా పలువురు బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి వెనుకంజ వేస్తున్నారు.
సిట్ విచారణ పేరుతో కిందిస్థాయి సిబ్బందిని ఇరికించి కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుంది. కేసీఆర్ కొడుకు తప్పు చేయలేదని భావిస్తే తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అప్పుడే తమవద్దనున్న సమాచారాన్ని అందించేందుకు సిద్ధం.