మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!

అమ్మా ఆకలి…అంటూ పిల్లవాడు పరిగెత్తుకురాగానే, టూ మినిట్స్‌ అమ్మా! అంటూ మ్యాగీ ప్యాకెట్‌ చించి నీళ్లలో వేసి ప్లేట్‌లో వేడి వేడి నూడుల్స్‌ వడ్డించేస్తుంది. టు మినిట్స్‌ ఫుడ్‌ అంటేనే మ్యాగీ అని అర్థమయ్యేంతగా దాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ బాగా ఆకట్టుకుంది. అయితే రెండు నిముషాల్లో వండి పెట్టడం బాగానే ఉంది కానీ, దాన్ని పూర్తిగా అరిగించుకోవాలంటే మీ జీవితం చాలదు అంటున్నారు ఆహార, ఆరోగ్య నిపుణులు, అధికారులు.

“మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి” !
మ్యాగీలో అనారోగ్య కారకాలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడంతో, లక్నోలోని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఎస్‌డిఎ) సంస్థ మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్‌ తీసుకుని వాటిని పరీక్షల నిమిత్తం కోల్‌కతాకు పంపింది. ఈ పరీక్షల్లో మ్యాగీలో మోనో సోడియం గ్లూటమేట్‌, (ఎమ్‌ఎస్‌జి), లెడ్‌, వాటికి అనుమతి ఉన్న పాళ్లను దాటి ఉన్నట్టుగా కనుగొన్నారు. ఎఫ్‌ఎస్‌డిఎ వారు చెబుతున్న దాన్ని బట్టి ఆహార పదార్థాల్లో లెడ్‌, పది లక్షల పాళ్లు ఆహారానికి 0.01వంతు నుండి 2.5 వంతుల వరకు ఉండవచ్చు. కానీ ఇది మ్యాగీలో ఏకంగా పదిలక్షల పాళ్ల ఆహారంలో 17.2 పాళ్లుగా ఉంది.

లెడ్‌ మనిషి శరీరంలో ప్రతి అవయవానికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్‌ రూపాలీ అనే పోషకాహార నిపుణురాలు ఆహారం, నీరు, మట్టి వీటి ద్వారా మనిషి శరీరంలో లెడ్‌ చేరే అవకాశం ఉందంటున్నారు. ఇది శరీరంలో కొద్దికొద్దిగా చేరుతూ ఉంటుందని, వెనువెంటనే ప్రమాదం లేకపోయినా కొంతకాలం తరువాత ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

రక్త పరీక్షలో మాత్రమే దీని ఉనికి తెలుస్తుందంటున్నారు. పిల్లలు పెరుగుతుంటారు కనుక ఇది వారికి మరింత ప్రమాదకారకమని రూపాలీ చెబుతున్నారు. పెద్దల్లో కంటే పిల్లల్లో ఇది మరింత వేగంగా జీర్ణం కావడం వల్ల కూడా హానిని కలిగిస్తుందని చెబుతున్నారు.
– సంపత్‌రాజు

Leave a Reply