Suryaa.co.in

Telangana

అన్ని రకాల వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి

తెలంగాణ రైతు సంఘం

కేవలం సన్న వడ్లకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో రైతాంగంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. రైతాంగం పండించే అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామనడం విడ్డూరం. వడ్లు పండించే రైతులలో 80 శాతం దొడ్డు వడ్లు, 20 శాతం సన్న వడ్లును పండిస్తున్నారు. ఇందులో అత్యధికం సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా వడ్ల పండించిన అందరికి ఒకే రకంగా బోనస్‌ చెల్లించాలి.

ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న యాసంగి పంటలకు వర్తింప చేయాలి. రైతాంగం గందరగోళానికి లోనూ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలి. వడ్లు పండించే రైతులందరికి ఒకే రకమైన బోనస్‌ చెల్లించని పక్షంలో రైతాంగాన్ని కూడగట్టి ఆందోళనా పోరాటాలు నిర్వహిస్తాము.

LEAVE A RESPONSE