Suryaa.co.in

Telangana

మల్కాజిగిరిలో మరోసారి ఘన విజయం సాధించాలి

-టిఆర్ఎస్ బిజెపి అడ్రస్ గల్లంతవ్వాలి
-సీఎం రేవంత్ రెడ్డి
-కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్, టిడిపి, పి అర్ పి పార్టీ, కమ్మ సంఘం నేతలు
-కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ కార్పొరేటర్లు,మాజీ ఎంపీపీలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు
-కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
-పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గతంలో తనను గెలిపించిన మెజార్టీ కంటే భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించి పార్టీ జెండా మరోమారు ఎగురవేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎల్బీనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ కూకట్పల్లి నియోజకవర్గాలకు చెందిన బి ఆర్ ఎస్, టిడిపి, ప్రజారాజ్యం పార్టీ తో పాటు భారీగా కమ్మ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వందల మంది నాయకులు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఓపికగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారితో రేవంత్ రెడ్డి ఇష్ట గోస్తిగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లకు మల్కాజ్గిరిలో ఉనికి లేకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పాల్పడ్డ బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలువ లేవని ఆయన అన్నారు.

ప్రజలు సైతం ఉనికి లేకుండా పోయే పార్టీలకు ఓట్లు వేసే బదులు గ్యారెంటీగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచాలని సూచించారు. ప్రజలతో మమేకమయ్యే రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు పరుస్తామని రానున్న రోజుల్లో తమకు అడ్రస్ లేకుండా పోతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ పై బిజెపి నేతలు, బి ఆర్ ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తున్నామని ఈ దాటికి తట్టుకోలేక 100 రోజుల్లోనే అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితిలో ఉందని వ్యాఖ్యానించారు.

పార్టీలో చేరిన వారిలో 2009 ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున పోటీ చేసిన కృష్ణ ప్రసాద్ తెలంగాణ కమ్మ సంఘం నాయకులు బీ. రవిశంకర్, అరికెపూడి ప్రసాద్ (మేడ్చల్) బోడు వెంకటేష్ యాదవ్ (కుత్బుల్లాపూర్), మాజీ కార్పొరేటర్లు శాలిని, పావని రెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీపీ సి .దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE