– ఉపాధ్యాయ బదిలీ చట్టంపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ
– త్వరలోనే ప్రతి శనివారం నో బ్యాగ్ డే!
– ఉపాధ్యాయులకు ఇకపై ఒకటే యాప్
– ప్రజాభిప్రాయ సేకరణ కోసం త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్!
ఉండవల్లి: పాఠశాల విద్యలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
జీవో 117 ఉపసంహరణపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అతిత్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు. ఈ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.
అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలి. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ ల స్థానంలో ఒకటే యాప్ ను రూపొందించే కార్యక్రమాన్ని త్వరతిగతిన పూర్తి చేయాలి. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్థారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.
ప్రజాభిప్రాయసేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా సమావేశంలో విపులంగా చర్చించారు. ఈ భేటీలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.