Suryaa.co.in

Political News

ఏబీవీ ‘ హీట్’ మొదలైంది !

పూర్వపు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి పూర్వం…ఆయన ముఖ్యమంత్రి కావడానికి తనవంతు సాయం గా ఓ చిన్న కోడి కత్తి పెట్టి జగన్ ఎడం భుజం పై గీరిన శ్రీనివాసరావు అనే దళితుడు ( కోడి కత్తి శ్రీను ) ;తన విలువైన జీవిత కాలం లో ఓ ఐదేళ్లు జైలు లోనే గడిపేసి, ఇటీవలనే బెయిల్ పై బయటకు వచ్చాడు .అతని జీవితం లో ఇది ప్రైమ్ టైమ్ కూడా .

అయినప్పటికీ ; అతని జైలు జీవితానికి కారకులైన వారిలో పశ్చాతాపం లేదు . ఆ కేసు ను ఒక కొలిక్కి తెద్దామనే ఆతృత లేదు . మరి ఎప్పటికి ఈ బెయిల్ జీవితం ముగిసి , ఆ శ్రీనివాసరావు ఎప్పటికి స్వేచ్ఛా జీవి అవుతాడు . ఇదో దొంగ కేసు అని అందరూ మాట్టాడుతున్నప్పటికీ; స్వప్రయోజనాలకోసం , స్వార్ధం కోసం దొంగ కేసులు పెట్టి అమాయకులను ఏళ్ళతరబడి జైళ్లలో కుక్కించేవారిని మన న్యాయ వ్యవస్థ ఏమీ అనదా?

అందుకే ; జగన్…never అగైన్ నినాదం తో గడప దాటి జనం లోకి వచ్చిన పూర్వపు ఐపీఎస్ అత్యున్నతాధికారి ఏబీ వెంకటేశ్వర రావు ; తన జైత్ర యాత్రను కోడికత్తి శ్రీను కుటుoబాన్ని పరామర్శించడం తో మొదలు పెట్టారు . కటిక వృద్ధాప్య పర్వం లోకి అడుగు పెట్టిన అతని తల్లిదండ్రులను , ఇతర కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని …అమలాపురం లోని బాలయోగి సమాధి వద్దకు వచ్చి , నివాళులు అర్పించారు .

ఏబీవీ పై నోరు పారేసుకోవడానికి అలవాటు పడిన వారి చేతుల్లోని వారి కరపత్రాలు మరో సారి భళ్ళు భళ్ళుమంటూ వాంతులు చేసుకున్నాయి . కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోయాయి .

కానీ , కోడి కత్తి శ్రీను కు జరిగిన అన్యాయం మరోసారి జనం ముందుకు వచ్చింది . ఈ పైశాచికానంద విషాద ఘటనకు ఏబీవీ ఎటువంటి ముగింపు పలుకుతారో చూడవలసి ఉంది .

నిజానికి ఆ రోజునే ఆయన అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళి; హతుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్నిపరామర్శించడానికి ఏబీవీ వెడదామని భావించినప్పటికీ వీలుపడలేదు . ఆ కేసు పూర్వాపరాలు అన్నింటినీ ‘ పోలీస్ కోణం ‘ లో చూడడానికి సమయం తీసుకోవలసి రావడం తో , చివరకు మొన్న 21 న కాకినాడ వెళ్ళారు . గొల్లల మామిడాడ లో బతుకులు వెళ్లదీస్తున్న దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను ఆయన పరామర్శించి ; వారిని వెంటబెట్టుకుని ఎస్పీ ని కలిసి , పోలీసుల “దర్యాప్తు” ఎంత అధ్వాన్నం గా ఉన్నదో వివరించారు .

ఆ కేసు “ఉత్తుత్తి దర్యాప్తు” జరిగిన తీరు కు షాక్ అయిన ఎస్పీ బిందు మాధవ్ షాక్ అయిపోయారు . వెంటనే , పునర్విచారణకు ఆదేశించడమే కాక ; దర్యాప్తు నివేదిక ను 60 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు .

ఈ “ఉత్తుత్తి దర్యాప్తు” కు కర్త, కర్మ , క్రియ ఎవరు అనేది కూడా రహస్యం కాదు . కాకినాడ ప్రజలు పూర్వ జన్మల్లో చేసుకున్న మహా “పుణ్యం కొద్దీ పురుషుడు” ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అని ఏబీవీ చెప్పారు . ఇంతవరకు ఆ పుణ్యపురుషుడు పేరు చెప్పిన ప్రాణి ఎవరూ లేరు .

ఆయన చెప్పింది నిజమో కాదో ….పునర్విచారణ lo తేలిపోతుంది . దీంతో పాటు , హతుడు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆర్ధికం గా ఆదుకుంటామని కలెక్టర్ కూడా హామీ ఇచ్చారు . వారిని కలెక్టర్ వద్దకు గానీ , ఎస్పీ వద్దకు గానీ తీసుకెళ్లి ; ఆ “దిక్కు లేని ” కుటుంబాన్ని ఆదుకోమని చెప్పిన నాయకుడు గానీ , మానవ మాత్రుడు గానీ ఎవరూ లేరు .

ఈ దురాగతం ఒక తార్కిక ముగింపుకు చేరుకుంటే ; ” ప్రజా జీవితం లోకి వస్తున్నా” అంటూ ఏబీ వెంకటేశ్వర రావు చేసిన ప్రకటనకు ఇంతకు మించిన సార్థకత ఏముంటుంది .ప్రజాజీవితం లో ఉన్న వారు ఎవరు ఆయనకు సాటి రాగలరు ?

ఇక, మూడో ఘటన గా ఆయన ముంబయి సినీ నటి జత్వాని ని పరామర్శించి , ఆ కేసు పూర్వాపరాలు అన్నీ తన పోలీస్ బ్రెయిన్ తో విశ్లేషించి మీడియా ముందుకు వద్దామని అనుకున్నారని వినికిడి . మరి, సీ ఐ డీ వారికి “ఉప్పు” అందిందో….ఏమో తెలియదు కానీ , ” మాస్టర్ మైండ్”పోలీస్ బాస్ …. పీఎస్ఆర్ ఆంజనేయులు ను ” ఎత్తేశారు”. ఇంకో అరడజను మందిని ” ఎత్తాల్సి” ఉంది.

అంటే…..; ఏబీవీ – మొన్న 13 వ తేదీన అమలాపురం లో వెలిగించిన”జగన్ … నెవెర్ ఎగైన్ దీపం ….వేడి అక్రమార్కేశ్వర రావు లకు మెల్ల మెల్ల గా తగులు తున్నదని అనుకోవచ్చు .

ఎన్నికలు ఇవ్వాళా… రేపూ ఏమి లేవు . కన్ను మూసి తెరిచేంతలో ఐతే ….అస్సలు లేవు . కుడి ఎడం గా ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది . “ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనమే వస్తాం. (యాడికో!)” అంటూ చెక్క గుర్రం పై ఊగే వాళ్ళకు …. ‘ ఏబీవీ మిషన్ ‘ ఇప్పటికిప్పుడు అర్ధం కాదు . అర్ధం అయ్యేటప్పటికి; అంతా అయిపోతుంది . ఇంకా 165…170 వారాలు పోతేగానీ, ఎన్నికలు రావు . వారం …పదిరోజులకు ఆయన ఒక కేసు పట్టుకున్నా …కావలసిన వారికి పులుసు కారిపోతుంది . సినిమా ఇప్పుడే మొదలైంది

– భోగాది వేంకట రాయుడు
(రచయిత సీనియర్ పాత్రికేయులు)

LEAVE A RESPONSE