వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది

– వైయస్సార్సీపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగింది
– 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు వైయస్సార్సీపీకి అఖండ విజయాన్ని ఇచ్చారు
– ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజలలో విశ్వాసం పెరిగింది
– వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యులు, అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్, వేణుంబాక విజయసాయిరెడ్డి

తాడేపల్లి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జీ, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలతో ప్రజలలో ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసం పెరిగిందని వైయస్సార్ సిపి అనుబంధ విభాగాల ఇన్ ఛార్జీ, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి అన్నారు. తక్కువ కాలంలోనే వైయస్సార్ కాంగ్రెస్
ycp-office పార్టీ రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి కారణం పార్టీ కార్యకర్తల కృషేనని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది కార్యకర్తలేనని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదనే విషయం అందరూ గుర్తించాలని కోరారు.

పార్టీ అనుబంధ సంఘాల పనితీరు, జిల్లాల్లో ఆయా శాఖల పనితీరు ఎలా ఉంది, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సంబంధించిన పలు అంశాలపై విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వైయస్ జగన్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు ఆ పథకాలు నేరుగా చేరడం వల్ల, ప్రభుత్వం పట్ల ప్రజలు అచెంచలమైన విశ్వాసంతో ఉన్నారని అన్నారు. 2019 ఎన్నికలలో 51 శాతం ఓట్లు వైయస్సార్ సిపికి వచ్చాయని, అయితే జగన్ గారు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న అబివృధ్ది – సంక్షేమ కార్యక్రమాల వల్ల, ప్రభుత్వంపట్ల ఆదరణ మరింత పెరిగిందని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా…లేదా …అనే విషయాలను క్షేత్రస్థాయిలో అనుబంధ విభాగాలు పరిశీలించాలన్నారు. అలా అందని కుటుంబాలుగాని, వ్యక్తులుగాని ఉన్నట్లయితే వారికి ఆయా పథకాలను అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తీసుకుని, ప్రజలకు మరింత చేరువ అవ్వాలని కోరారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తగిన గుర్తింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఇంకా గ్రామ, మండల, జిల్లా స్ధాయిలలో పనిచేసిన వారిని గుర్తించి ఆయా జాబితాలను తనకు అందిస్తే వారిని కూడా తగిన విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.

బిసిలకు సంబంధించి 56 కార్పోరేషన్లను ఏర్పాటుచేయడం ద్వారా, ఆ వర్గాల అభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతగా కట్టుబడి ఉన్నారో స్పష్టం చేశారని తెలిపారు. అదేవిధంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వారిలో పేదరికం పోగొట్టి, వారిని అభివృద్దిలోకి తీసుకువచ్చే విధంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. అగ్రవర్ణాలలోని పేదలకు సైతం సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఇచ్చిన సూచనలు, సలహాలతో పాటు, వారు చెప్పిన పలు అంశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ తనకు అప్పగించిన బాధ్యతల దృష్ట్యా అంతా టీమ్ స్పిరిట్ తో పనిచేసి పార్టీని మరింత బలపడేలా చేయాలనేదే తన లక్ష్యం అని అన్నారు.

దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో.. ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడాన్ని చూసి తట్టుకోలేక, దిక్కుతోచని స్దితిలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని కోరారు.

ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ సంఘాల నేతలు ఎంఎల్ఏ మేరుగ నాగార్జున(ఎస్సీ సెల్), జంగా కృష్ణమూర్తి(బీసి సెల్), చల్లా మధుసూధన్ రెడ్డి(ఐటి విభాగం), ఎంవిఎస్ నాగిరెడ్డి(రైతు విభాగం), అంకంరెడ్డి నారాయణ మూర్తి(గ్రీవెన్స్ సెల్), పూనూరు గౌతంరెడ్డి(ట్రేడ్ యూనియన్), చిల్లపల్లి మోహన్ రావు(చేనేత విభాగం), మనోహర్ రెడ్డి (లీగల్ సెల్ ), దొంతిరెడ్డి వేమారెడ్డి (పంచాయితీరాజ్ విభాగం), డాక్టర్ శివభరత్ రెడ్డి (డాక్టర్స్ విభాగం), కె.సుధాకర్ రెడ్డి(పోలింగ్ బూత్ విభాగం), ఎ.హర్షవర్ధన్ రెడ్డి (ఎన్ ఆర్ ఐ విభాగం) తదితరులు హాజరయ్యారు.

Leave a Reply