Suryaa.co.in

Andhra Pradesh

72 రోజుల తర్వాత అమరావతే రాజధాని

-నాది విజన్..జగన్ ది పాయిజన్
-జగన్ లాంటి మారీచున్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం
-కేజీఎఫ్ ను మరిపించేలా పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ చేపట్టారు
-జగన్ కక్షతో సంగం డెయిరీపైనా దాడి
-పొన్నూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-98 శాతం హామీలు అమలు చేశానన్న జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా వీడియో ప్రదర్శన

పొన్నూరు: ‘టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుంది. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధానిని నాశనం చేశాడు. అమరావతికి తప్పకుండా మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

తనది విజన్ అయితే..జగన్ ది పాయిజన్ అని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా, పొన్నూరులో సోమవారం రా..కదలిరా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ప్రజల్ని మాయ చేయడానికి జగన్ మారీచుడిలా రకరకాల వేషాలేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ముద్దులుపెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి హామీలిచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చాడు. ఇప్పుడు మరోసారి సిద్ధం అంటూ కథలు చెబుతున్నాడు. ఇలాంటి మారీచుల్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలి.

యువత ఎటువైపు ఉంటే విజయం వారిదే. పొన్నూరులో ఏడు సార్లు టీడీపీని గెలిపించి కంచుకోటగా నిలిపారు. అలాంటి పొన్నూరు పొగరు చూపించాల్సిన సమయమొచ్చింది. జగన్ అనే సైకో, ఊరికో సైకోను తయారు చేశాడు. వీరందరినీ అణచివేయడం తధ్యం. రాష్ట్ర, ప్రజల భవిష్యత్తు కాపాడటానికి ముందుకొచ్చాను. జగన్ పాలనలో ఏ బిడ్డకైనా ఉద్యోగాలొచ్చాయా?

జగన్ మార్క్ నయవంచన
జగన్ కొత్త డ్రామా ప్రారంభించాడు. ఇదీ నా మార్క్ అంటూ వెర్రి కథలు చెబుతున్నాడు. ఏది జగన్ రెడ్డీ నీ మార్క్? టీడీపీ హయంలో రూ.200 వచ్చే కరెంటు బిల్లు రూ.1000 చేయడం నీ మార్కా.? క్వార్టర్ రూ.60 ఉన్న మద్యం రూ.200 అమ్మి ప్రజల ఇళ్లూ, ఒళ్లూ గుల్ల చేయడం మార్కా?. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలపడం నీ మార్కా. నిరుద్యోగంలో 24 శాతంతో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలపడం నీ మార్కా. ఉచితంగా అందే ఇసుకను కేజీల లెక్క అమ్ముకోవడం నీ మార్కా. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేయడం, బీసీ బిడ్డని పెట్రోల్ పోసి తగులబెట్టడం నీ మార్కా.?

పరదాలు కట్టుకు తిరగడం, వెళ్లిన ప్రతి చోటా పచ్చని చెట్లు నరికించడం జగన్ మార్క్. రివర్స్ పేరుతో రాజధాని, పోలవరం నాశనం, గంజాయి సరఫరాలో ఏపీని దేశానికి కేపిటల్ చేయడం…ఇదీ జగన్ నీ మార్క్. ప్రతి గ్రామంలో కిలోమీటర్‌కు ఒక ఎలిమెంటరీ స్కూల్, మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, 5కి.మీలకు ఒక హైస్కూల్ ఇది నా మార్క్.

ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నా మార్క్. నాలెడ్జ్ ఎకానమీ, 11 డీఎస్సీలతో 1.50 లక్షల టీచర్ ఉద్యోగాల భర్తీ నా మార్క్. పేద పిల్లలకు విదేశీ విద్య, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, పొదుపులో దేశానికి ఆదర్శంగా మార్చడం, ఆడబిడ్డలకు నాయకత్వం ఇవ్వడం మార్క్. దీపం పథకంతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లివ్వడం నా మార్క్. దేశ ప్రగతిని మార్చే పాలసీలు, రోడ్ల నిర్మాణం, సంపద సృష్టి నా మార్క్. బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నా మార్క్. దళిత బిడ్డలు బాల యోగిని లోక్‌సభ స్పీకర్‌గా, మృణాళినిని అసెంబ్లీ స్పీకర్‌గా చేయడం నా మార్క్.

అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయడం నా మార్క్. సైబరాబాద్ నిర్మాణంతో రైతు బిడ్డని లక్షలు సంపాదించేలా చేయడం నా మార్క్. కియా కంపెనీ నా మార్క్. అశోక్ లే ల్యాండ్ నామార్క్. పోలవరం పరుగులు నా మార్క్. పట్టిసీమ వెలుగులు నా మార్క్. 25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, గ్రామ గ్రామాన ఎల్ఈడీ లైట్లు నా మార్క్. పేదలకు రూ.5కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు పెట్టాను…ఇదీ జగన్ రెడ్డీ నా మార్క్.

నాది విజన్.. జగన్ ది పాయిజన్
నేను ఐటీని ప్రోత్సహించి కంపెనీలు తెస్తే.. జగన్ రెడ్డి ఐదువేలకు వాలంటీర్ ఉద్యోగాలిచ్చాడు. ఫిష్ మార్టులు, మటన్ కొట్లు, మద్యం కొట్లలో వ్యాపారం అంటూ యువత జీవితాలను చిత్తు చేస్తున్నాడు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు లాంటి దాదాపు 130 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. అధికారం కోసం శవం ముందు సంతకాలు సేకరించిన పార్టీ జగన్ రెడ్డిది.

ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో నేను ముందడుగేశా. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా సంపద సృష్టించా. సైబరాబాద్ నిర్మించడంతో దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. అదే స్థాయిలో అమరావతి నిర్మాణానికి శీకారం చుట్టాను. కానీ జగన్ రెడ్డి సర్వ నాశనం చేశాడు. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చేయని సాహసం అమరావతి రైతులు చేశారు. 35 వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు.

అలాంటి అమరావతిపై కులం ముద్ర వేశాడు, మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని నాశనం చేశాడు. నేను శాశ్వతం కాదు.. జగన్ శాశ్వతం కాదు..రాష్ట్రం శాశ్వతం. లక్షల మందికి ఉపాధినిచ్చే అమరావతిని నాశనం చేశాడు. అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు అన్నీ కట్టాం. విట్, ఎస్.ఆర్.ఎం, అమృత్ లాంటి యూనివర్శిటీలు అమరావతికి తీసుకొచ్చా.

దేశంలో టాప్ వర్శిటీలు, స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు ఇక్కడకు రావాలని కలలుకన్నా. ఇది దేవతల రాజధాని. ఇలాంటి సైకోలు ఎంత మంది వచ్చినా అమరావతిని ఏమీ చేయలేదు. మనం కట్టిన ఇళ్లకు రంగులేసుకున్నాడే తప్ప..పేదలకు అందించలేదు. జగన్ వచ్చాక దొంగలంతా కలిసి రోడ్లలోని గ్రావెల్ కూడా ఎత్తుకెళ్లిపోతున్నారు.

ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టేందుకు ప్రజలు ఏకమవ్వాలి
జగన్ పార్టీ ఫ్యాన్ మూడు రెక్కలు విరగ్గొట్టేందుకు ప్రజలంతా ఏకమవ్వాలి. బాదుడే బాదుడు రెక్కను ఉత్తరాంధ్ర వాళ్లు విరగ్గొట్టాలి. విధ్వంసాల రెక్కను రాయలసీమ వాసులు విరగ్గొట్టాలి. హింసా రాజకీయాలను కోస్తా వాసులు విరగ్గొట్టాలి. రెక్కల్లేని ఫ్యాన్ తాడేపల్లిలో కూర్చోబెట్టాలి. యువతకు ఉద్యోగాలొచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. జాబు రావాలంటే తిరిగి బాబు రావాల్సిందేని యువత చెప్తోంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా..వారి భవిష్యత్ బాగుండాలన్నా టీడీపీ రావాలి. యేడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటా.

పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తా. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతిగా నెలకు రూ.3000 ఇస్తా. ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాలి. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగాలు పొందవచ్చు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు కట్టించి అక్కడే కలిసి పని చేసుకునే సదుపాయం కల్పిస్తా. పల్లెల్లో ఉండే వారు కూడా ప్రపంచంతో అనుసంధానమై పని చేసుకునే పరిస్థితి భవిష్యత్తులో చూస్తాం.

ఉద్యోగులిచ్చిన హామీలపై చేతులెత్తేశాడు
రాష్ట్ర విభజనతో అప్పులు తప్ప ఆదాయం లేదు. అయినా తెలంగాణ కంటే ఒకశాతం ఎక్కువగా 43% ఫిట్ మెంట్ ఇచ్చాను. డీఏ, పెన్షన్ అన్నీ ఇచ్చాను. వారంలో సీపీఎస్ రద్దు అంటూ హామీ ఇచ్చిన జగన్ చేతులెత్తేశాడు. సీపీఎస్ ఎలాగో లేదు.. కనీసం నెలవారీ జీతాలిస్తే చాలు అనే స్థితికి ఉద్యోగుల్ని తీసుకొచ్చాడు. ఒకప్పుడు జీతాలు పెరగాలని పోరాటాలు చేసిన వారు ఇప్పుడు సకాలంలో జీతాలొస్తే చాలు అనే పరిస్థితి.

ఈ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయింది. కాంట్రాక్టర్లకు రూ.95 వేల కోట్ల బకాయిలున్నాయి. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టారు. పోలీసులతో ఉపాధ్యాయులపై కేసులు పెట్టారు. పోలీసులు కూడా తప్పుని సమర్ధించొద్దు. తప్పు చేసిన వారు ఎవరైనా ఒకేలా వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరించే వారికి ఇబ్బందులు తప్పవు. దేశంలో తొలిసారిగా స్థానిక సంస్థల్లో మహిళలకు 8% రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆర్. మహిళా సాధికారత ప్రారంభమైంది టీడీపీతోనే.

ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చట్టం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. చదువుకోని మహిళల్లో కూడా సమర్ధత ఉందని, వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మి డ్వాక్రా తెచ్చా. ఆ వ్యవస్థ ఎంత బలంగా తయారైందో ఇప్పుడు గ్రామ గ్రామానా చూస్తున్నాం. జగన్ రెడ్డి ఎన్నో వ్యవస్థల్న నాశనం చేసినా.. డ్వాక్రాను మాత్రం కదపలేకపోయాడు. మహిళల కోసం ప్రత్యేకంగా కాలేజీలు పెట్టా. ఉద్యోగాలొచ్చి ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళాభ్యున్నతి ద్వారా మాత్రమే పేదరిక నిర్మూల సాకారమవుతుంది.

అందుకే మహాశక్తికి రూపకల్పన చేశాను. ఆడబిడ్డ నిధితో ప్రతి మహిళకూ నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ విధానాన్ని తీసుకొచ్చాం. ధరలు తగ్గించి, ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాను. జగన్ రెడ్డి రూ.10 ఇచ్చి రూ.1000 దోచేస్తున్నాడు. నిత్యావసరాలు, పన్నులు, ఛార్జీల్లో దోచుకుంటున్నాడు. రూ.10 ఇస్తా..దాన్ని రెట్టింపు చేసుకునేందుకు మార్గాలు చూపిస్తా.

నేను చేస్తున్న ఈ యజ్ఞానికి ఆడ బిడ్డలే సారథులు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా ఆశయం. డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళా నాకు స్టార్ క్యాంపెయినర్. 72 రోజుల పాటు సైనికుల మాదిరి పని చేయండి మన కుటుంబాలు, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాలని షర్మిల అడుగుతుంటే ఆమెను వేధించడం మొదలు పెట్టారు.

జగన్ ఏది నీ విశ్వసనీయత?
విశ్వసనీయత అంటూ జగన్ డైలాగులు చెబుతున్నాడు. ప్రత్యేక హోదా, మద్యం నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పోలవరంపై మాట మార్పు, బీసీ సబ్ ప్లాన్‌, బీసీలకు 139 కార్పొరేషన్లు, పంట వేసే ముందే మద్దతు ధర, గిట్టుబాటు ధర, అమరావతి రాజధాని, కాపు కార్పొరేషన్ నిధులు, వివేకా హత్య, కరెంటు ఛార్జీలు, 2024 నాటికి మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అని చెప్పావు..ఒక్కటైనా అమలు చేశావా.?

ఏది నీ విశ్వసనీయత? జగన్ రెడ్డి మీ బిడ్డ కాదు..రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. బీసీలకు యేటా రూ.15వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చ చేస్తానన్నాడు..75 పైసలు కూడా ఖర్చు చేయలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకు చెందిన నిధులు బొక్కేసి మీ బిడ్డ అంటున్నాడు. 99 శాతం హామీలు అమలు చేసేశానని చెప్పే అబద్ధాలతో ఆస్కార్, నోబెల్ ఇచ్చినా తక్కువే. మరోవైపు సిద్ధం అంటూ సభలు పెడుతున్నాడు.

మేము కూడా సిద్ధమే..జగన్ రెడ్డిని గద్దె దించడానికి. మొన్నటి వరకు నాకు అడ్డం లేదు..నా వెంట్రుక పీకలేరు అన్నాడు. ఇప్పుడు నేను సంతోషంగా దిగిపోతా అంటూ బీద అరుపులు అరుస్తున్నాడు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణపై ఆంబోతు రాంబాబు దాడి చేయించాడు. విశాఖలో మీటింగ్ పెట్టి మా కటౌట్లు పెట్టి వాటిని వైసీపీ కార్యకర్తలతో కొట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇప్పడు ఇక్కడ జగన్ ఫోటో పెట్టి కొట్టలేమా..మాకు చేతకాదా..కానీ మన సంస్కృతి అది కాదు.

మాచర్లలో దుర్గారావు అనే మత్స్యకారుడు పార్టీ మారనందుకు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. గతంలోనూ తోట చంద్రయ్య వైసీపీకి జై కొట్టమంటే కొట్టనందుకు పీక కోసి చంపారు. ఈ సైకో, పిల్ల సైకోల వేధింపులతో బలైపోయిన వారంతా తిరుగుబాటు చేయడం తధ్యం.

అనంతపురంలో ఒక మహిళ పెన్షన్ అడిగితే..నటరాజ్ అనే వైసీపీ నాయకుడు పక్కలోకి రమ్మన్నాడు. తిరగబడినందుకు రోడ్డుపైనే ఆమెను కొట్టినా పోలీసులు స్పందించలేదు. ఈ ఆంబోతుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఇలాంటి దుర్మార్గుల్ని రాష్ట్రం నుండి తరిమితరమి కొడదాం. రంకెలేసే ఆంబోతుల్ని నడిరోడ్డుపై కట్టి కొడతా.

సామంతుల రాజ్యంలో.. సామాజిక న్యాయమెక్కడ?
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నిన్న జగన్ రెడ్డి, వారి ముఠా ఆగడాలను ప్రశ్నించాడు. నా నియోజకవర్గంలో మీ పెత్తనమేంటని నిలదీశాడు. మట్టి అమ్ముకుంటూ, భూములు కబ్జాలు చేస్తున్న సొంత వర్గం నేతలపై నోరెత్తకుండా తనకు సీటు దూరం చేయడంపై తిరుగుబాటు చేశాడు. ఇదేనా సామాజిక న్యాయం? 175 మంది ఎమ్మెల్యేల్లో 68 మందిని మార్చాడు. అందులో 49 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. 11 మంది ఈ జగన్ రెడ్డి సైకో పెత్తనాన్ని తిరగబడ్డారు. వారికి సీట్లు ఎగ్గొట్టాడు.

10 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులను ట్రాన్స్ ఫర్ చేశాడు. ప్రత్తిపాడులో ఉండే ఎమ్మెల్యేని తాడికొండకు ట్రాన్స్ ఫర్ చేశాడు. వేమూరులో మంత్రిని సంతనూతలపాడుకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఇక్కడి చెత్త అక్కడ బంగారం అవుతుందా? కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి నీ రిపోర్టు బాగోలేదనడంతో నీ రిపోర్టు బాగుందా అని ఎదురు ప్రశ్నించాడు. నాకు సీటు ఇవ్వకపోతే.. ఈ ముఖ్యమంత్రి ఎలా గెలుస్తాడో చూస్తాడని ఎమ్మెల్యే తిరుగుబాటు చేశాడు.

సొంత ఎమ్మెల్యేలు సైతం తిరుగుబాటు చేస్తున్నారంటే.. జగన్ రెడ్డి నియంతృత్వం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి. ప్రతిపక్షంపై వేధింపులు.. అధికారులపై బెదిరింపులు.. సొంత వారికి కక్ష సాధింపులు అనే పరిస్థితి నెలకొంది. అణచివేత అధికమైతే.. తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది?

టీడీపీ గేట్లు తెరిస్తే.. వైసీపీ ఖాళీ
టీడీపీ గేట్లు తెరిస్తే.. జగన్ రెడ్డి పార్టీ ఖాళీ అవడం తధ్యం. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య..కిలాడి రోశయ్యగా..గ్రావెల్ రోశయ్యగా మారాడు. పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్ తయారు చేశాడు. కేజీఎఫ్ ని మరిపించేలా కిలాడీ తవ్వేశాడు. 700 ఎకరాల్లో రూ.2వేల కోట్ల విలువైన మట్టి అమ్మేశాడు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రజల కోసం విక్రమార్కుడిలా పోరాడాడు. సంగం డైరీ గుంటూరు పాడి రైతుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. అలాంటి సంగంపై దాడి చేశారు. నరేంద్రను జైల్లో పెట్టారు.

ఈ రోజు మనం ఎదుర్కొన్న ప్రతి ఘటనకూ రేపు చక్రవడ్డీతో సహా చెల్లించడం తధ్యం. జగన్ రెడ్డి అరాచకానికి రాష్ట్రంలో అందరూ బాధితులే. మంగళగిరి ఎమ్మెల్యే మనపై ఎన్నో కేసులేశాడు. అమరావతి, రింగ్ రోడ్డు లాంటి ఎణ్నో కేసులు వేశాడు. ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న వాడిని ఒక తన్ను తన్నాడు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా.. గంజాయి, గుట్కా, డ్రగ్స్ లాంటి చేయని వ్యాపారం లేదు. పనిమనిషి కొడుకు టీడీపీ నేతలతో తిరిగాడని తల్లిపై తప్పుడు కేసు పెట్టాడు. ఇలాంటి తప్పుడు చర్యలను అల్లా చూస్తూ ఊరుకోడని గుర్తుంచుకో జగన్ రెడ్డీ అని హెచ్చరించారు.

మన దగ్గర నుండి వెళ్లిన ఒక ఎమ్మెల్యే అక్కడ చిత్తుకాగితంలా తయారయ్యాడు. ఆ నియోజకవర్గానికి చిలకలూరిపేట నుండి చెత్తను తెచ్చి వేశాడు. వారి కథ తెలిసే లోగా ఎన్నికలు అయిపోవాలని కలలు కంటున్నాడు. ప్రత్తిపాడుకు చెందిన హోం మంత్రి.. దిశ చట్టం ఉందని చెప్పేది. ఎక్కడ అంటే సమాధానం లేదు. పదవులిప్పిస్తామని సొంత పార్టీ వారి దగ్గర డబ్బులు లాక్కోవడం తప్ప చేసిందేమీ లేదు.

తెనాలి ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందిని ఇంట్లో పనిమనుషులుగా వాడేస్తాడు. కంకర నుండి ఇసుక వరకు ఏదీ వదలడు. చేనేత కార్మికులు, రైతులు, బీసీలు ఎక్కువగా ఉండ మంగళగిరిని అభివృద్ధిలో ఏపీలో నెం.వన్ చేస్తా.

పెన్షన్ ఎక్కడైనా, ఎప్పుడైనా తీసుకునే సదుపాయం
చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ రూ.35తో పెన్షన్ విధానాన్ని తెచ్చారు. నేను దాన్ని రూ.75 చేశాను. మళ్లీ రూ.200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెంచి రూ.2000 చేశాను. వితంతువులు , ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్స్, అందరికీ ఇచ్చాం. చేతి వృత్తుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చా. కానీ, జగన్ రెడ్డి పెంచుతూ….పోతా అంటూ దగా చేశాడు. ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలంటూ నిబంధనలు పెట్టాడు. కానీ నేను హామీ ఇస్తున్నా..మూడు నెలల వరకు ఎప్పుడైనా ఎక్కడైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు తీసుకొస్తా.

ప్రతి పెన్షన్ దారుడికీ అండగా ఉంటా. అమరావతి రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదలి రావాలి. ప్రతి గడపనా రా కదలి రా అనే నినాదం వినిపించాలి. తెలుగు జాతిని నెం.1 చేయడం కోసం పోరాడుదాం. రైతు సంక్షేమం కోసం కలిసి పని చేద్దాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్యమిద్దాం.

మహిళా సాధికారత సాధించేందుకు నడుం బిగిద్దాం. రాతి యుగాన్ని పారదోలి..స్వర్ణయుగాన్ని సాధించుకుందాం’’ అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE