Suryaa.co.in

Political News

అన్ని దర్యాప్తుల ముగింపులు ఆగేది ‘అక్కడే’

– అయిననూ బాబును తిడుతూనే ఉండవలె!

మహాభారతం లో ఒక సన్నివేశం ఉంది . ధర్మానికి, న్యాయ వర్తన కు కట్టుబడిన తమకు అర్ధరాజ్యం అవసరం లేదని ; ఓ ఐదూళ్ళయినా చాలునని శ్రీ కృష్ణుడి ద్వారా… పంచ పాండవులు దుర్యోధనుడికి విన్నవించుకుంటారు . వారి పట్ల సర్వ అక్రమాలకు,అధర్మాలకు , దౌర్జన్యాలకు, వీలైతే మాన భంగాలకు , వీలుకాకపోతే సజీవ దహనాలకు , ఆస్థుల ధ్వంసానికి , దుర్భాషణలకు , కుయుక్తులకు , అసత్య ప్రచారాలకు …. నిరంతరాయంగా …నిర్భీతిగా…నిస్సిగ్గుగా …నిర్హేతుకంగా పాల్పడుతున్న దుర్యోధన సార్వభౌముడికి ఈ విన్నపాలు చెవికెక్కలేదు. ఫలితం ?కురుక్షేత్ర యుద్ధం !

“పాండవ ద్వేషం ” తో నిలువెల్లా బుసలు కొట్టే తన బంధు మిత్రులు పోయారు . ‘సలహాదారు’ లు పోయారు . సైన్యం నశించింది. భీష్మ, ద్రోణ, కృపాచార్యుడు వంటి శ్రేయోభిలాషులు పోయారు . దుర్యోధనుడు ఒంటరి వాడయ్యాడు. నానాగడ్డీ కరిచి సంపాదించిన ఆస్తిపాస్తులు పోయాయి . వెనక్కి తిరిగి చూద్దామంటే ; అయ్యో పాపం అనే వారు కనిపించలేదు . ప్రాణ రక్షణ కోసం ఓ నీటి మడుగులో దాక్కున్నాడు. అయినా భీమసేనుడు వదల్లేదు . అధికారం లో ఉన్నప్పుడు ….పాండవుల పట్ల పాల్పడిన సర్వ అకృత్యాలు , ఈర్ష్యా ద్వేషాల ఫలితం గా … “అయ్యో పాపం ” అంటూ రెండు కన్నీటి చుక్కలు విధించడానికి కూడా ఎవరూ మిగలని దయనీయ స్థితి లో దుర్మరణం పొందాడు , దుర్యోధన సార్వభౌముడు . ఇది మన ద్వాపర యుగపు నాటి ఇతిహాసపు కథ .

ఇప్పుడు మనం కలియుగం లో ఉన్నాం. ఈ యుగపు ధర్మమేమో తెలియదు కానీ; 2019 …2024 మధ్య ఆంధ్ర పాలకులను చూసి మెజారిటీ ప్రజలు భయపడి పోయారు . ప్రజాజీవితం లోకి రాగూడని సమస్త సంఘ వ్యతిరేక ‘ శక్తులూ రంగ ప్రవేశం చేశాయి . ప్రజాస్వామ్యాన్ని , ప్రజాస్వామిక వ్యవస్థలను చూసి వికటాట్టం చేశాయి. ఆ వికటాట్టహాసపు సజీవ సాక్ష్యాలే…….ఒక కోడి కత్తి శ్రీను, ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డరు….డోర్ డెలివరీ , ఒక పుంగనూరు అరాచకాలు , ఒక కాకాణి గోవర్ధన రెడ్డి తవ్వకాలు (ఆయన ఇంకా “పరారీ ” లోనే ఉన్నారు . బెయిల్ కోసం వెయిటింగ్ ) , ఒక మద్యం మహా కుంభకోణం , పోలీస్ కస్టడీలో ఒక రామకృష్ణంరాజు టార్చర్ …..హత్యా యత్నం, ఒక ఏబీ వెంకటేశ్వరావు ఐదేళ్ళ విలువైన ఉద్యోగ హరణం- జీత భత్యాలు సైతం నిరాకరణ, ఒక మాచర్ల పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరాచక పర్వం , వళ్ళు గగుర్పొడిచే ఒక బోరుగడ్డ అనిల్ వ్యవహార శైలి , ఒక బొంబాయి నటి కాదంబరి జత్వాని పై ……… ,వ్యవస్థల పై రాగుల రామకృష్ణారెడ్డి వీరంగం…..,ఒక ద్వారంపూడి ‘ యాపారాలు ‘, ఒక పేర్ని నాని , ఒక కొడాలి నాని నోరు, ఒక ఆళ్ల నాని ( ఇప్పుడు నెత్తి మీద కాసిని ‘పసుపు నీళ్ళు’ జల్లు కొన్నారు లే), అంబటి బంగారం , జోగి రమేష్ ,ఆర్కే రోజా , ‘ చిలక ‘ లూరి పేట రజనీ , …..
ఈ జాబితా కు మొదలు ఎక్కడనేది అందరికీ తెలుసు కానీ , చివర ఎక్కడ అనేది ఎవరికీ తెలియదు .

ఈ గ్యాంగులకు తోడు మీడియా ముసుగులో పేటీఎం విశ్లేషకులు, వారి టీవీలు , వారి కరపత్రాలు …. జగన్ పై అజిత్ సింగ్ నగర్ ప్రాంతం ఎవడో ఆకతాయి గులక రాయి లాంటిది విసిరితే …ఆయన బృందం ,దానిని హత్యాప్రయత్నం గా భారీగా ప్రచారం చేసుకుంది. అలా ప్రచారం చేసుకుంటే , రాజకీయం గా లభిస్తుందని ఆయన , ఆయన ‘ సలహా దారు ‘ లు అభిప్రాయపడడాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు.

నాగేశ్వర రావు అనే ఒక పేటీఎం సేలబుల్ విశ్లేషకుడు – ‘ ‘ ‘జగన్ పై రాయి విసిరిన సంఘటన పై చంద్రబాబు స్టాండ్ ఏమిటి !? ‘ అని ఒక వీడియో చేసి దేశం మీదకు వదిలాడు . ఆ రాయి ఘటనకు…చంద్రబాబు వైఖరికి సంబంధం ఏమిటి ? ఈ రకంగా …..డబ్బుతో, మద్యం తో , పోలీసు అరాచకాలతో , దౌర్జన్యాలతో , పేటీఎం భజన బృందాలతో , తమకు 171 కి 171 ఖాయం అని ఈ గ్యాంగ్ లు అంచనాకు వచ్చాయి.

చివరికి – 2019 లో ఇచ్చిన 151 లోనుంచి ఓటర్లు ….2024 ఎన్నికల్లో ….మధ్యలో ఉన్న 5 అంకె ను పీకేశారు .చివరకు 11 మిగిల్చారు. . ఈ చర్య తో ప్రజాస్వామిక లక్షణాలను ఆంధ్రులు పునరుద్ధరించారు .

చిత్తూరు జిల్లాలో పచ్చని పంట పొలాలపై బిల్లబీటుగా పడిన అడవి ఏనుగుల్లాటి ఈ కాలకేయుల గుంపు నుంచి రాష్ట్రాన్ని ఓటర్లు రక్షించారు . తాము స్వేచ్ఛగా జీవించే హక్కును , ఆత్మ గౌరవాన్ని వారు పునరుద్ధరించుకున్నారు . తమ తమ స్థావరాలకు ఈ ఏనుగుల గుంపును పరిమితం చేశారు .

నిజానికి , పాండవ వ్యతిరేక , ద్వేష భావనలు , చర్యలకు పాల్పడకుండా ….తన రాజ్యం ఏదో తాను ప్రశాంతం గా పాలించుకుంటూ….కాలక్షేపం చేసి ఉన్నట్టయితే ; మరో ముప్పై, ముప్పై అయిదేళ్ళు హాయిగా దుర్యోధనుడు పాలన చేసుకుంటూ ఉండేవాడు . కానీ, రాజ్యం చేతికి చిక్కిన తొలిరోజు నుంచే …పాండవ వ్యతిరేకత తో బుసలు కొట్టేవాడు . అందుకే , చివరకు ప్రాణ రక్షణ కోసం నీళ్ల మడుగులో దాక్కోవలసి వచ్చింది .

అలాగే, ” చంద్రబాబు వ్యతిరేకత….టీడీపీ వ్యతిరేకత ….కమ్మ కుల వ్యతిరేకత ” అనే భావనే బైబిల్ గా జగన్ అనుసరించి ఉండక పోతే ; జగన్ మరో ముప్ఫై ఏళ్ళు అధికారం లో ఉండి ఉండేవారు . కానీ; మబ్బుల్లో ఉండే నీళ్ళను నమ్ముకునే కంటే …..ఎదురుగా ఉన్న ముంతలో కనపడుతున్న నీళ్లనే తాగేయడం బెటర్ అనుకున్న జగన్ , ఆయన పరివారం ….రాష్ట్రాన్ని కుళ్ళబొడిచి వదిలారు .
వారందరికి ప్రజలు విశ్రాంతి ఇచ్చి ఇంకా ఏడాది కాలేదు .

175 అసెంబ్లీ స్థానాలలో 151 సీట్లను 2019 లో ఇచ్చిన ప్రజలే ….2024 లో పదకొండే ఎందుకు ఇచ్చారో అన్న ఆత్మ పరిశీలన ఈ పూటకీ లేదు . అధికారం వెలగబెట్టినప్పుడు థగ్గులు….పిండారీలుగా వ్యవహరించిన వారిపై ఆ పార్టీ లో కించిత్తు చర్యలు లేవు .కనీసం విచారం సైతం వ్యక్తం కావడం లేదు . పైపెచ్చు ….”ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది మా ప్రభుత్వమే ” అని ఇలెక్కి కూస్తున్నారు.

వచ్చేది ఎందుకు ? రాష్ట్రం మొత్తం తవ్వేసి, ఇసుకను బొక్కేసి, ప్రభుత్వ భూములను కబ్జా చేసేసి , ఆస్తులు ఆరగించడానికి దొంగ దస్తావేజులు సృష్టించేసి, అదేంటి అని అడిగేవారిని పోలీస్ స్టేషన్ లలో పడేసి కుళ్ళబొడిచేసి , వందల ….వేల ….లక్షల కోట్లు సంపాదించడానికా ? కిందటిసారి అవకాశం దొరికినప్పుడు ఎవరు ఎంత వెనకేశారో ….వారికైనా ఒక ఐడియా ఉందా ?

ఇవేమీ లేనట్టు ….గతంలో రాష్ట్రాన్ని ధర్మ రాజుల్లా పరిపాలించినట్టు , అవినీతి…అరాచకం ….దోపిడీ….కబ్జాలు …ఫోర్జరీ లు …..దౌర్జన్యాలు వంటివేమీ తమకు అసలు తెలియనట్టు ….వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నట్టు శోకండాలు పెట్టడం చూస్తుంటే …. జనానికి చక్కలగిలి పెట్టినట్టుంది.

“చంద్రబాబు ను తిడతాం . అందినంత వరకు దోచేస్తాం ” నినాదంతో ఈ మిడతల దండు మరోసారి రాష్ట్రం పై వాలడాన్ని ప్రజలు భరిస్తారా ? అందుకే ….” థగ్స్ & పిండారీస్ నెవెర్ అగైన్ …” అనే నినాదాలు పుట్టుకొస్తున్నాయి . రోజులు గడిచేకొద్దీ ఈ నినాదాలే….రాష్ట్రాన్ని చుట్టుముడతాయి . ముందుకు నడిపిస్తాయి. చూద్దాం ….ఏమి జరుగుతుందో !
(రచయిత సామాజిక శ్రేయోభిలాషి)

– భోగాది వేంకట రాయుడు
(రచయిత సీనియర్ పాత్రికేయులు)

LEAVE A RESPONSE