Suryaa.co.in

Features National

కాశ్మీర్ లేకపోతే భారత్ పరిస్థితి ఏమిటి?

-కాశ్మీర్ లో ఏముంది?
-10వేల కోట్ల ఆదాయం
(వాసు)

ఆ ప్రాంతం కోసమే యుద్ధం మొదలైంది. ఆ ప్రాంతం కోసమే తీవ్రవాదం పుట్టుకొచ్చింది. ఆ ప్రాంతం కోసమే నేటికీ పోరాటం జరుగుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాన్ని కోల్పోయాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా దాన్ని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోడానికి పోరాడుతున్నాం.

ఈ నేపథ్యంలో కాశ్మీర్ ని లాగేసుకోడానికి పాక్ కుతంత్రాలు పన్నుతోంది. అక్కడ అలజడి రేకెత్తించి భూమిపై స్వర్గంలా ఉన్న కాశ్మీర్ ని చిందరవందర చేసి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటోంది. ఆ అలజడితో భయపడిపోయి కాశ్మీర్ ని తమకు అప్పగిస్తారేమోననే దురాశ పాకిస్తాన్ ది. కానీ కాశ్మీర్ విషయంలో ఒక్క అంగుళం కూడా వదులుకోడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు.

అది మన దేశానికి ఎందుకంత ప్రత్యేకత?

ప్రపంచ పటంలో భారత దేశాన్ని ఒక ప్రాణం ఉన్న ఆకారంగా భావిస్తే దానికి తలలాంటిది జమ్మూ కాశ్మీర్. ఆ ప్రాంతం లేకపోతే తలలేని మొండెం లాగా ఉంటుంది భారత పటం. కేవలం ఆకారానికే కాదు, నిజంగానే కాశ్మీర్ అనేది భారత్ కు ఆత్మలాంటిది.

భారత్ లో అందుబాటులో ఉండే కుంకుమ పువ్వు 100 శాతం కాశ్మీర్ లోనే పండుతుంది. మన దేశం నుంచి అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్న వాల్ నట్ 95 శాతం కాశ్మీర్ లోనే లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ యాపిల్ పంట 75శాతం కాశ్మీర్ లోయలోనే పండుతుంది.

శ్రీనగర్, బారాముల్లా, పుల్వామా ప్రాంతాలు గోల్డెన్ యాపిల్ పంటకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. రాజోరీ, పూంచ్ ప్రాంతాల్లో 30 శాతం తేనె లభిస్తుంది. పుట్టగొడుగులకు కూడా జమ్మూకాశ్మీర్ సుప్రసిద్ధం. జమ్మూ ప్రాంతంలో 30శాతం పుట్టగొడుగులు లభిస్తాయి. లద్దాక్ నుంచి 40 శాతం ఆప్రికాట్ లభిస్తుంది. కాశ్మీరీ శాలువాలు 80శాతం ఇక్కడే తయారు చేస్తారు.

భువిపై స్వర్గం

జమ్మూ కాశ్మీర్ ని భూతల స్వర్గంగా పేర్కొంటారు. అక్కడ అందమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, ఉల్లాసభరితంగా ఉండే కొండలు, లోయలు విహారయాత్రలకు అనుకూలంగా ఉంటాయి. దాల్ లేక్ షికారా రైడ్ అత్యద్భుతంగా ఉంటుంది. సోన్ మార్గ్, గుల్ మార్గ్, పహల్గాం ప్రాంతాలను కలిపి మినీ స్విట్జర్లాండ్ అంటారు. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరం కె2 జమ్మూకాశ్మీర్ లోని హిమాలయాల్లో ఉంది.

భారత్ లో అత్యంత పొడవైన రైల్ టన్నెల్ పీర్ పంజల్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ కూడా కాశ్మీర్ కి ప్రాముఖ్యత తెచ్చిపెట్టింది. అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి దర్శనం.. ఇవన్నీ కాశ్మీర్ భారత్ లో ఉండటం వల్లే మనకు సాధ్యమవుతున్నాయి. లేకపోతే ఆయా ప్రాంతాలకు మనం కూడా వీసా తీసుకుని వెళ్లాల్సిందే.

జమ్మూ కాశ్మీర్ ప్రముఖ పర్యాటక కేంద్రం. ఏడాదిలో ఒక్కసారి, వేసవి సమయంలో పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది మొత్తం అక్కడి ప్రజలకు జీవనభృతి. ప్రతి ఏటా టూరిస్ట్ ల ద్వారా 10వేల కోట్ల రూపాయల ఆదాయం జమ్మూకాశ్మీర్ ప్రజలకు లభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే జమ్మూకాశ్మీర్ ని సొంతం చేసుకోవాలనుకుంటోంది పాక్. అందుకోసం పాపిష్టి పనులన్నీ చేస్తోంది.

LEAVE A RESPONSE