Suryaa.co.in

Andhra Pradesh

మంత్రులంతా సజ్జల స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు

– ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే రాష్ట్రంలో విధ్వంస రచన
• వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోంది
• అమలాపురం అల్లర్లు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టే
• మచిలీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ

రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వం చలి కాచుకుంటోందని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపించారు. మంత్రి ఇంటి మీద దాడి నుంచి మంత్రుల వ్యాఖ్యల వరకు అంతా తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోందన్నారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిణీ చేసిన స్క్రిప్ట్ నే మంత్రులంతా చదివి వినిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఇంత అట్టుడుకుతుంటే దావోస్ లో ఉన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం శోచనీయమన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ..

144 సెక్షన్ అమలులో ఉంటే అంత మంది ఎలా వచ్చారు?
అమలాపురం ఘర్షణలు ప్రభుత్వ కల్పితాలే. మంత్రి విశ్వరూప్, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై జరిగిన దాడుల మీద రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అంత మంది మంత్రి ఇంటి మీద దాడికి ఎలా పాల్పడ్డారు. అంత మంది గుంపుగా వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అంత పెట్రోల్ ఎలా తీసుకువచ్చారు? మంత్రి కుటుంబాన్ని ముందుగానే ఎవరు ఖాళీ చేయించారు? పోలీసులు చెప్పారు కాదు వైసీపీ కార్యకర్తలు చెప్పారు అని అస్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారు. పచ్చటి కోనసీమలో కులాల చిచ్చు పెట్టి తద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వమే ఈ గొడవలు సృష్టించిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

అల్లర్లు పూర్తి కాగానే సజ్జల ఏం మాట్లాడారో అదే స్క్రిప్ట్ పొల్లు పోకుండా మంత్రులంతా పదే పదే చదివి వినిపిస్తున్నారు. మంత్రులు రోజా, జోగి రమేష్ లాంటి వారికి ఆ పదవులు ఇలాంటి స్క్రిప్ట్ లు చదివి అప్పచెప్పడానికే వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ రోజు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఉంటే మా జనసైనికులందరికీ పోలీసులు వెళ్తున్నారా అని ఫోన్లు చేస్తున్నారు. పత్రికా ప్రకటనకు కూడా ఉలిక్కిపడుతున్న పరిస్థితుల్లో మంత్రుల ఇళ్లు తగులబెట్టే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ మాజీ గుట్కా మంత్రి శెలవిస్తున్నారు…. కాల్పులు జరిపితే శాంతి భద్రతలు మరింత అదుపుతప్పే ప్రమాదం ఉన్నందువల్లే ఆ పని చేయలేదు అంట.

లా అండ్ ఆర్డర్ కాపాడాలి అంటే కాల్పులు జరపాలా? ఇలాంటి అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేసే మంత్రి పదవి ఊడగొట్టుకున్నారు. ముఖ్యమంత్రి పక్కన పెట్టేసినా సిగ్గు రాలేదు. అస్సలు గుట్కా వ్యాపారాలు, గోవా క్యాసినోలు మినహా గుడివాడ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? మూడేళ్ల పాటు మంత్రి పదవి వెలగబెట్టి ఒక్క రోడ్డు అయినా వేశారా? పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదు. ఇంకోసారి మాట జారితే జనసైనికుల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త.

వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నాశనం చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే విధ్వంస రచనలు చేస్తోంది. దావోస్ లో సేల్స్ మ్యాన్ డ్యూటీలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కి అమలాపురంలో ఇంత విధ్వంసం జరిగితే కనీసం ప్రజలకు శాంతి సందేశం పంపే తీరిక లేదా? ఒక్క ప్రకటన చేసేంత సమయం కూడా లేదా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మీ బండారం మొత్తం బయటపడి పోయింది. ప్రజలు మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధమై పోయారు అని అన్నారు. మీడియా సమావేశంలో మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రామకృష్ణ, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE