ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచి రోజులు తీసుకొస్తుంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో రాష్ట్ర విషయాల పట్ల చర్చించామని, కచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు మంచి రోజులు తెచ్చే సమావేశం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో శుక్రవారం రాత్రి పవన్ కళ్యాణ్ కలిశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “దాదాపు 8 సంవత్సరాలు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలవడం సంతోషంగా ఉంది. 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ తో కలిసి ఎన్నికల ప్రచారం తర్వాత మళ్లీ మోదీ ని కలవలేదు. ఇప్పుడు రాష్ట్ర పర్యటన సందర్భంగా రెండు రోజులు క్రితం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మోదీ ని కలవాలని చెప్పడంతో ఈ రోజు ఆయనతో పలు విషయాల పట్ల చర్చించాం.

రాష్ట్రంలోని వివిధ అంశాలను, పరిస్థితులను మోదీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిపై నా వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనతో పంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అన్నదే ప్రధాని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలన్నదే మోదీ కోరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో నరేంద్ర మోదీ తో ఈ సమావేశం జరిగింది. కచ్చితంగా దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఉంటాయి” అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

Leave a Reply