ఇంకా రెండేళ్లు ఉండగానే… ఇప్పుడే ఏంటీ జాతర?!

ఆంధ్రలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే, ఇప్పుడే ఈ జాతర మొదలై పోయిందా అనే విషయం అర్ధం కావడం లేదు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నామధ్యనే స్పష్టంగా ప్రకటించారు కూడా.

‘ఎన్నికలు’ అంటేనే మందూ -మాకూ,…. డబ్బూ -దస్కం …. చీరలు- జాకెట్ ముక్కలు,….ముక్కు పుడకలు- వెండి కుంకుమ భరిణలు…..క్రికెట్ బ్యాట్లు-కిట్ లు,బిర్యానీ పాకెట్లు- క్వార్టర్ బాటిళ్లు , నాటు సారా- చిందు లాటలు,నమస్కారాలు – హత్తుకోడాలు చందాలు-..డొనేషన్లు,పోలీసులు- పంచాయతీలు, రైడింగ్ లు- కలెక్షన్లు,ఉత్తుత్తి వాగ్దానాలు…. మీడియా బొంకులూ,…మైకుల హోరు….మొదలైనవన్నీ కలగలిసి పోయి,వాతావరణం అంతా గజిబిజిగా, గందరగోళంగా చివరికి ‘ఆచార్య’ సినిమాలా తయారవుతుంది.

కానీ, ఆ ‘పండక్కి’, ఆ జాతరకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కదా!కానీ, ఆంధ్ర రాజకీయానికి అప్పుడే ఆ కళ వచ్చేసింది.ఇదివరకైతే, ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత, ఐదవ ఏడే ఎన్నికల సంవత్సరం అనేవారు. కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా ఇదే ఆనవాయితీగా ఉండేది.బహుశా, ఆ రోజుల్లో కరెన్సీ పెద్దగా సర్క్యులేషన్ లో లేక…. అయిదేళ్ల వరకూ ఆగేవారేమో!మరి ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ కదా! దాని రూటే సెపరేటు… మూడేళ్లు పూర్తి అయ్యి, కాకముందే…. ఎన్నికల హడావుడి మొదలైపోయింది.

ప్రశాంత్ కిషోర్ పాపమా అని, దేశంలో ఎన్నికల ప్రచార సరళి కూడా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్ధ పార్టీలపై దుమ్మెత్తి పోయడాలు, ఆరోపణలు, అసత్య ప్రచారాలు, సవాళ్లు…. ప్రతి సవాళ్ళు…!మొత్తం రాజకీయం అంతా పోలేరమ్మ జాతరలా కాలుష్యంతో నిండి పోయి , ఎవరేం అరుస్తున్నారో అర్ధం కాక , రాజకీయ దుమ్ము ఇంతెత్తున పైకి లేచి..అందరి కళ్ళల్లో పడిపోతున్నది .ఆరోగ్యకరమైన ప్రచార సరళికి కాలం చెల్లిపోయింది .

ఇందుకు ఓ ఉదాహరణగా ….., ఒక టీవీ ఛానల్ లో ఇటీవల ప్రసారమైన కుప్పం నియోజకవర్గ వార్త తీరుతెన్నులను తీసుకోవచ్చు.. అది చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ సారి ఎలాగైనా అక్కడ ఆయనను ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకున్నది. తప్పులేదు. అది రాజకీయం.
అయితే, దానికో పద్ధతి ఉంటుంది కదా! కానీ,కుప్పం నియోజక వర్గంలో కరెంట్ లేకుండా చంద్రబాబే చేసేసి, కొవ్వొత్తుల వెలుగుల్లో…కార్యకర్తలతో మాట్లాడుతున్నారంటూ ఓ కామెంటరీని ప్రసారం చేసింది. చీకట్లో టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తుల వెలుగులో మాట్లాడుకుంటున్న విజువల్స్ కూడా ప్రసారం చేసింది. ఆ సమయంలో అక్కడ – చంద్రబాబు కుట్ర వల్లే విద్యుత్ ప్రసారం నిలిచిపోయిందనేది ఆ టీవీ కథనం.

ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే దురుద్దేశంతో , విద్యుత్ తీయించేసి… కొవ్వొత్తులతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించినా ఇంకా బుద్ది రాలేదని టీవీలో చెప్పారు.ఇది చాలా సేపు చూపించారు.చాలా వివరంగా ‘దుమ్మెత్తి పోశారు’.ఇలా ఉంటాయి, ఎన్నికల ప్రచారాలు.ఇదే -ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ ప్రచార సరళి.

అలాగే, ‘దుష్ట చతుష్టయం’ అనే పద ప్రయోగం కూడా!ఈ పదం కూడా ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చింది.ముఖ్య మంత్రి జగన్ – ప్రతి సభలోనూ ఈ పదాన్ని విస్తృతంగా, బలంగా వాడుతున్నారు. తిరుపతి లో మొన్నీమధ్య జరిగిన ఒక సభలో అయితే, ‘ ఈ దుష్ట చతుష్టయం’ నుంచి వెంకటేశ్వర స్వామి తనను కాపాడాలని వేడుకుంటున్నానని కూడా ఆయన అన్నారు.

నిజానికి, ఈ పదానికి చాలా చరిత్ర ఉంది. 1966-1976 మధ్య కాలం లో చైనా లో చోటుచేసుకున్న ‘సాంస్కృతిక విప్లవం’ ఓ నలుగురి కనుసన్నల్లో జరిగింది. వీరిని దుష్ట చతుష్టయం (gang of four ) అని పిలిచేవారు. అప్పటి చైనా అధ్యక్షుడు మావో ఆఖరి భార్య -జియాంగ్ క్వింగ్ ఈ దుష్ట చతుష్టయానికి లీడర్. ఆ తరువాత, మావో చనిపోయిన నెల రోజులకే ఈ దుష్ట చతుష్టయాన్ని కూడా ఉరి తీశారు. అయినప్పటికీ,ప్రపంచ వ్యాప్తంగా – ‘గ్యాంగ్ అఫ్ ఫోర్ ‘(దుష్ట చతుష్టయం ) అనే పదానికి మంచి ప్రచారం లభించింది.

అంతకంటే దాదాపు తొమ్మిదేళ్ల ముందే – అంటే 1957 లోనే విడుదల అయిన మాయాబజార్ సినిమాలో కూడా…. దుర్యోధన, కర్ణ, దుశాసన, శకుని లను ఘటోద్ఘజుడి పరివారం లో -ఈ ‘దుష్ట చతుష్టయం’ గా సంబోధించారు. నోరు తిరక్క, ‘దు ష ట చ తు ష ట యం ‘అంటారు ఆ రాక్షసులు.మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ వల్ల, ఈ పదం సర్క్యులేషన్ లోకి వచ్చింది.ఎన్నికల జాతరకు సమయం దగ్గర పడినట్టుగా భావించడానికి ఇవన్నీ సూచనలు కావచ్చు.

ఇక, పొత్తులపై కూడా పెద్ద రగడ జరుగుతున్నది.మన దేశంలో – కేంద్రంలో గానీ, రాష్ట్రాలలో గానీ ప్రతిపక్షాలు చేతులు కలిపితే ; అధికారం పక్షం ఫినిష్ అనే విషయం అనేక సార్లు రుజువైంది. ఎందుకంటె, పోలైన ఓట్లలో 50% శాతం తెచ్చుకోగలిగిన సీను అధికార పక్షానికి సహజంగా ఉండదు. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల ; 35-40 శాతం ఓట్ల తో గెలిచిన పార్టీలు కూడా 100 % ఓట్లతో గెలిచినంత బిల్డ్ అప్ లు ఇస్తుంటాయి. ప్రతిపక్షాల ఓట్లు చీలక పోతే మాత్రం ; అధికార పక్షాలు జావ కారిపోతుంటాయి . ప్రతి పక్షాల అనైక్యతే…. ప్రధాని మోదీ ప్రధాన బలం అంటారు.

మాంత్రికుడి ప్రాణం – అతనిలో కాకుండా, మర్రిచెట్టు తొర్రలోని చిలకలో ఉన్నట్టు ; జగన్ బలం జగన్ లోనో….,వైసీపీ లోనో కాకుండా,తమ అనైక్యతలో ఉన్నట్టు తెలుగుదేశం, జనసేన, సీపీఐ లకు ఇప్పటికి అర్ధమైంది. వీరికి ఆ విషయం అర్ధమైందనే విషయం వైసీపీకి కూడా అర్ధమైనట్టు కనపడుతున్నది.

జగన్ కు శాసన సభలో 151 స్థానాలు ఉన్నాయి. స్థిరమైన ఓట్ బ్యాంకు ఉంది. తాను అభిమానించే పేదవారు…., కడుపుకు ఇంత తినడానికి అన్నట్టుగా ; ఇప్పటికే లక్ష ముప్పైయేడు వేల కోట్లు తృణ ప్రాయంగా పంపిణీ చేశారు. రాజకీయంగా వైసీపీలో ఆయనకు ఎదురు లేదు.కేంద్రం కూడా జగన్ ఎంత అంటే.. అంత. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలు సాధించాలనే ధృడ నిశ్చయంతో ఆయన ఉన్నారు. ఇటీవలే సమర్ధులైన వారితో మంత్రివర్గాన్ని పునర్నిర్మించుకున్నారు. జిల్లాకో అధ్యక్షుడిని, రెండు మూడు జిల్లాలకో సమన్వయ కర్తను కూడా ఏర్పాటు చేశారు.అలా, ఆయన ఎన్నికలకు సన్నద్ద మవుతున్న సూచనలు కనపడుతున్నాయి.

ఇటు, చంద్రబాబు కూడా ముందస్తు దృష్టితోనే పని చేస్తున్నారు. మామూలు రోజుల్లోనే ఆయన రోజుకు 18 గంటలు పని చేయాల్సిందే.అది ఆయన నైజం.రోజుకు 18 గంటలు పనిచేయడం అనేది చంద్రబాబుకు జన్మతః వచ్చిన జెనేటిక్ లోపం. ఇక, ఇప్పుడు చెప్పేదేముంది? లోకేష్ కూడా లోకేష్ లా కనపడడం లేదు. మినీ చంద్రబాబులా కనపడుతున్నారు.

ఇక, వైసీపీ విషయానికి వస్తే…2019 లో ప్రశాంత్ కిషోర్ మార్గ దర్శకత్వంలో కనీ, వినీ ఎరుగని నెగెటివ్ ప్రచారం పైనే ఆధారపడి వైసీపీ గెలిచింది. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నది కనుక , వైసీపీ ప్రచారం ఓటర్లకు లక్క అతికినట్టు అతుక్కున్నది. 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వైసీపీయే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది.అలవాటైన విద్య కదా అని ఇప్పుడు కూడా ప్రత్యర్థులపై నెగెటివ్ ప్రచారంపైన ఆధార పడితే వైసీపీకి కష్టం అంటున్నారు కొందరు పరిశీలకులు.

ఆ విషయం కాసేపు పక్కనబెడితే, ప్రజలు ఇచ్చిన అవకాశమే ఇంకా రెండేళ్లు ఉంది. ఈ రెండేళ్లు కూడా పూర్తి చేశాకే, ప్రజల దగ్గరకు వెళ్లే విషయం ఆలోచించాలి. అప్పటికి, వైసీపీ ప్రభుత్వం….ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహార శైలి, నవరత్నాలు, వైసీపీ నేతల దక్షత… మొదలైన వాటిపై ‘ఓటర్ మహాశయుల’కు పూర్తి స్పష్టత వస్తుంది.లేకపోతే, ‘మొన్నేగా 151 ఇచ్చాం. అప్పుడే తయారాయ్యారేం ?’ అంటూ జనం విసుక్కునే అవకాశం లేకపోలేదు.అన్నట్టు, ఓట్ నమోదు చేసుకోవడం ఎవరూ మరిచిపోవద్దు. ఈసారి ఓటు రేటు పదివేలు పలకవచ్చు అంటున్నారు.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

Leave a Reply