ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ప్రవాసాంధ్రులకు అనేక సేవలు అందిస్తోంది. APNRTS అనేక సేవలు అందించడమే కాకుండా… ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు ముందస్తు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలామంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే వీరు సరైన అవగాహన లేకుండా, అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి విదేశం వెళ్లి తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి, వలస వెళ్తున్న వారికి సరైన అవగాహన కల్గించడానికి వలసలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలో APNRTS అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందని APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి అన్నారు. ఇందులో భాగంగా ఇవాళ 27అక్టోబర్ 2021 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో శ్రీ సాయినాథ్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు చెరుకువాడ రంగనాధ రాజు గారు, APNRTS విదేశాలకు వెళ్ళే వారి కోసం “సక్రమ వలస” పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతోమందికి ఉపయోగకరమని సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి గారితో అన్నారు. రాబోయే రోజుల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మరెన్నో ఈ అవగాహన సదస్సులు నిర్వహించమని మంత్రికోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ డిఎస్పీ పి. వీరాంజనేయ రెడ్డి, OMCAP OSD రామారావు, పెనుగొండ సిఐ జివివి నాగేశ్వర రావు, ఇరగవరం ఎస్ఐ జె. సతీష్, ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి, జెడ్పిటిసి కె. గౌరీ సుభాషిణి, ఎంపీటీసీలు మంగాదేవి, జి. రామారావు, సర్పంచ్ టి. ప్రియాంక, గరువు సర్పంచ్ నాగరాజు, పెనుమంట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస రాజు, పెనుమంట్ర వైసీపీ ఇంచార్జ్ సుదీర్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి మరియు సాయిబాబా రెడ్డి గారు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సాపూర్ డిఎస్పీ పి. వీరాంజనేయ రెడ్డి ఏపీ నుండి విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి వివరాలు సేకరించి…. వారి కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లల స్థితిగతులు, వారి ప్రవర్తన, చదువు మొదలగు వాటన్నింటిని సర్వే చేసి నర్సాపూర్ డివిజన్ భీమవరంలో “బాసట” పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. APNRTS చేస్తున్న సేవా కార్యక్రమాలు.. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన వారికి సహాయ సహకారాలు అందించడం,భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం, ముఖ్యంగా 24/7 హెల్ప్ లైన్ ద్వారా ప్రవాసాంధ్రులకు ప్రతీక్షణం అందుబాటులో ఉండడం ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమాలన్నీ కాకుండా “సక్రమ వలస” పై వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నకిలీ ఏజెంట్ల గురించి, విదేశాలకు వెళ్ళే వారు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని, మా పోలీస్ శాఖ తరఫున APNRTS కు పూర్తి సహాయ సహకారాలుంటాయని డిఎస్పి అన్నారు.
PDOT (Pre Departure Orientation Training)…అంటే విదేశాలకు వెళ్ళే ముందు ప్రయాణీకులకు ముందస్తు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో OMCAP తరఫు నుండి APNRTS కు సహకారం అందిస్తున్నామని, ఈ అవగాహన కార్యక్రమాలకు సహాయ సహకారాలుంటాయని OMCAP OSD రామారావు తెలిపారు..
APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ….ఈ కార్యక్రమం గురించి చెప్పిన వెంటనే సాయిబాబా రెడ్డి గారు విదేశాలకు వెళ్ళే ఎంతోమందికి ఇది ప్రయోజనకారమని చెప్పి, ఉచితంగా తన స్వంత శ్రీ సాయినాథ్ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహించమని చెప్పడమే కాకుండా, తగు ఏర్పాట్లు చేసి వచ్చిన వారికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. వారికి నా కృతఙ్ఞతలు.
సెప్టెంబర్ 22వ తేదీన రాజంపేటలో ఈ అవగాహన కార్యక్రమం ప్రారంభించి, విజయవంతంగా నిర్వహించడమేకాక, అమలాపురం నియోజకవర్గం లోని సఖినేటిపల్లి కూడా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో వలసలు ఎక్కువగా జరుగుతున్న వై.ఎస్.ఆర్. కడప, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని లోని మరికొన్ని ప్రాంతాల్లో పలు నియోజకవర్గాల్లో ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
APNRTS సీఈఓ కె. దినేష్ కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులతో సమన్వయము చేస్తూ ఏర్పాట్ల పర్యవేక్షణ చేసారు. APNRTS అందిస్తున్న వివిధ సేవలైన 24/7 హెల్ప్ లైన్, ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సర్వీస్, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, అడ్వాన్స్డ్ ఐటి కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు మరియు స్థానిక, విదేశీ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం, విద్యావాహిని ద్వారా విదేశాలలో విద్యా సంస్థల గురించి తెలియజేయడం, అత్యవసర పరిస్థితుల్లో వ్యక్తులను స్వదేశం తీసుకురావడం, ఆయా దేశాలు ఆమ్నెస్టీ ప్రకటించినప్పుడు రాష్ట్రవాసులను ఉచితంగా స్వస్థలాలకు తీసుకురావడం వంటి అనేక సేవలను అందిస్తోంది.
అంతేకాకుండా, పాస్పోర్ట్,వీసాలలో మార్పులకు సహాయం, పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడంలో సహాయం, రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటన, తదితర సేవలను APNRTS అందిస్తోందని, విదేశాలకు వెళ్ళేవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
APNRTS కార్యాలయాలు… ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో, ఉపకార్యాలయం “YSR ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” రాజంపేటలో కలవు.విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.
ఈ కార్యక్రమంలో APNRTS డిప్యూటి డైరెక్టర్మొ హమ్మద్ కరీం, అసిస్టెంట్ డైరెక్టర్లు కళ్యాణ్ కుమార్ , సల్మా బాను మరియు APNRTS సిబ్బంది పాల్గొన్నారు.