Suryaa.co.in

Features

అర్జున్ అరెస్టు, జైలు, బెయిల్ – సినిమా సూపర్ హిట్

– ఇలాంటి న్యాయం సామాన్యులకు దక్కేనా ?
– సెలెబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అని భావించే పరిస్ధితి

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు, జైలు, బెయిల్ సినిమా సూపర్ హిట్. ఈ వ్యవహారంలో పోలీసులు నడిపిన కథ, కోర్టు ఇచ్చిన క్లైమాక్స్ బంపర్ హిట్. కేవలం 12 గంటల వ్యవధిలోనే సెలెబ్రిటీ అల్లు అర్జున్ అరెస్టు కావడం, పోలీసుల విచారణ ఎదుర్కొవడం, జైలుకు వెళ్లడం, బెయిల్ పై హీరోగా బయటికి రావడం అంతా పుష్ప -2 ప్రీమియర్ షో ను తలదన్నేదిగా ఉంది.

హైదరాబాద్ సంధ్య థియేటర్ లో పుష్ప-2 సినిమా చూడటానికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందే పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

అయితే, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహరంలో హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు, న్యాయ వ్యవస్ధలు రోజంతా పని చేశాయి. ఆగమేఘాల మీద అర్జున్ ను ఇంటికి పంపించడానికి దర్యాప్తు, న్యాయ వ్యవస్ధలు ఉరుకులు పరుగులు తీశాయి. ఒక కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తే, ఆ వెంటనే మరో కోర్టు బెయిల్ ఇచ్చేసింది. మొత్తం మీద ఆ సెలెబ్రిటీని సగౌరవంగా ఇంటికి పంపించాయి.

ఈ వ్యవహారంలో మరో గమ్మతు చోటు చేసుకుంది. ఏ ఒక్కరి ష్యూరిటీ లేకుండానే , ఒక్క పైసా జమ చేయకుండా, కేవలం రూ. 50 వేల బాండ్ పేపర్ మాత్రమే రాసి ఇవ్వడంతోనే మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇలాంటి వెసులుబాటు సామాన్యులకు అసాధ్యం అని న్యాయవాదులు అంటున్నారు. మొత్తానికి న్యాయస్ధానాల్లో కూడా సెలెబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అని భావించే పరిస్ధితి కనిపిస్తుంది.

ఇంత వరకు ఒక సెలెబ్రెటీని అరెస్టు చేస్తారా, జైలుకు పంపుతారా, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించే గొంతుకలు, సామాన్యుడి విషయంలో కూడా గొంతు కలిపితే బాగుండేది. దర్యాప్తు సంస్ధలు, న్యాయ వ్యవస్ధలు ఈ స్ధాయిలో కాకున్నా… అంతో ఇంతో నిబద్దతతో సామాన్యుల విషయంలో వ్యవహరిస్తే, జైళ్లలో ఇంత మంది ఏళ్లతరబడి మగ్గి ఉండే పరిస్థితి ఉండేది కాదు. కోర్టుల్లో లక్షలాది కేసులు ఉండేది కాదు. చట్టం, ధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్నాయా అన్న ప్రశ్నకు సరైన సమాధానం వచ్చుండేది.

చట్టం కొందరికి చుట్టంగా మారి, అధికారం వారికి దాసోహం చేస్తున్నంత కాలం చట్టం, ధర్మం సామాన్యుడి దరి చేరబోవనే నానుడికి, అల్లు అర్జున్ అరెస్టును ఒక ఉదంతంగానే పరిగణించవలసి ఉంటుంది. సంధ్య థియోటర్ వ్యవహారంలో అరెస్టైన వారందరి విషయంలో పోలీసులు, న్యాయ వ్యవస్ధలు ఇదే విధంగా వ్యవహరించక పోవడం కూడా గమనార్హం.చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే ప్రచారంలో వాస్తవం వీసమెత్తైన లేదన్నది ఈ సంఘటనతో తేటతెల్లమవుతోంది.
బెయిలుకు అర్హత ఉండి కూడా, విడిపించే వారు లేక లక్షలాది మంది జైళ్లలోనే ఉండిపోతున్నారు. ఆ విధంగా జైళ్లలో మగ్గుతున్న వారికి ధనం, పరపతి, కులం, హోదా, మతం, ప్రాంతం, అధికారం ఏవీ కూడా దరి చేరడం లేదు. ఇవన్నింటిలో ఏ ఒక్కటి అండగా నిలబడలేక పోతున్నాయి. అందుకే చట్టం వారికి చుట్టం కాలేక పోతుంది.

దేశంలోని కోర్టులలో దాదాపు నాలుగున్నర కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుల్లో ఏ ఒక్క వ్యవస్ధ కూడా వేగంగా నిర్ధిష్టంగా తమ ధర్మాన్ని నిర్వర్తించలేక పోతున్నాయి. సామాన్యుడు కావడం, పరపతి లేక పోవడం, అండ–దండ ఆమడ దూరంలో కూడా కనిపించక పోవడంతో లక్షలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో పోలీసులు, న్యాయ వ్యవస్ధ ఎంత వేగంగా పని చేసిందో దేశ ప్రజలంతా చూశారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ఈ హై డ్రామా.. రాత్రి 12 గంటలకే ముగియడం, సామాన్యులకు ఒకింత ఆశ్చరం అనిపించవచ్చు కానీ, కథ నడిపిన వారికి అదేమంత ఆశ్చర్యం అనిపించక పోవచ్చు. గంటల వ్యవధిలోనే పోలీసు విచారణను ఎదుర్కొని జైలును చూసి, బెయిలును ముద్దాడటం పుష్ప -2 హీరోకే సాధ్యమైంది.

అల్లు అర్జున్ నిజంగానే అదృష్టవంతుడు. ఆయన ఒక సెలబ్రిటీ కావడం వల్లనే అన్ని వ్యవస్ధలు కాలుకు బలపం కట్టుకొని పరుగులు తీశాయి. సామాన్యుడి విషయంలో కూడా పాలన, న్యాయ వ్యవస్ధలు ఇంత కాకున్న ఇంతలో కొంతైన వేగంగా పని చేస్తే జైళ్లు కిక్కిరిసి ఉండేవి కావు.

న్యాయస్థానాల్లో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండేవే కావు. సామాన్యుడికి ఒక న్యాయం, సంపన్నుడికి ఒక న్యాయం అన్నట్లుగా అల్లు అర్జున్ అరెస్టు, విడుదల అంశం తెరమీదికి వచ్చింది. న్యాయ వ్యవస్ధలు, పాలకులు, కార్యనిర్వాహకులు సామాన్యుల పట్ల నిబద్ధతతో వ్యవహరించడం ద్వారానే కోర్టులలో కేసుల సంఖ్య తగ్గుతుంది. జైళ్లలో మగ్గుతున్న వారు జన జీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది.లేని పక్షంలో న్యాయం, ధర్మం సామాన్యుడికి ఆమడ దూరం అనే అపఖ్యాతి కొనసాగతం తథ్యం.

– కొలను వెంకటేశ్వర రెడ్డి
ఎస్పీ జైల్స్ (రిటైర్డ్)

LEAVE A RESPONSE