Suryaa.co.in

Andhra Pradesh

బాబుకు దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు

– అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపైనా ఆరోపణలు
– టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు?
– ఎఫ్‌ఐఆర్‌ కూడా తప్పులతడకగా నమోదు
– తిరుపతి పద్మావతి మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుపతి: ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ అందరూ బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 194–సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్‌ 105– సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి.

దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి మంచి వైద్యం అందించడంతో పాటు, డిశ్చార్జ్‌ సమయంలో కనీసం రూ.5 లక్షల చొప్పున సాయం అందించాలి. ఇది మా డిమాండ్‌.

చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు. భయం లేదు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపైనా ఆరోపణలు చేశారు. దుష్ప్రచారం చేశారు. ఈరోజు కూడా ఆయన వైఖరి వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది.

దీనికి కారణాలు చూస్తే.. ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు. ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు?

టీటీడీ అధికారులు మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు అందరూ దీనికి బాధ్యులు. చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు 6వ తేదీ నుంచి 8వరకు పర్యటించారు. ఆరోజు మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలోనే ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఆయన దగ్గరే ఉంది. 8వ తేదీ రాత్రి 8.30 గం.కు టోకెన్లు మొదలు పెట్టారు. లక్షల మంది వచ్చినా, తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు.

బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్‌లో ఏర్పాటు చేసిన టోకెన్‌ సెంటర్‌ వద్ద, భక్తులను ముందు పార్కులోనే ఉంచేసి, రాత్రి ఒకేసారి వదిలేశారు. నిజానికి ఆ పార్కులో భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేదు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను కట్టడి చేసేందుకు తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఉన్న కొద్దిమంది పోలీసులు వారిని నియంత్రించలేకపోయారు.

ఇంత జరిగినా, సీఎం చంద్రబాబు పద్ధతి లేకుండా మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా తప్పులతడకగా నమోదు చేశారు. టీటీడీ అనేది ఒక గొప్ప వ్యవస్థ. వైకుంఠ ఏకాదశి రోజున లక్షల మంది వస్తారు. సీఎం చంద్రబాబు మొదలు, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసులు.. అందరూ ఈ దుర్ఘటనకు బాధ్యులే. ఇది సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అయినా టీటీడీ బాధ్యతారహితంగా వ్యవహరించింది.

దుర్ఘటనలో ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. ఉజ్జాయింపు లెక్కల ప్రకారం చూస్తే కనీసం 50 నుంచి 60 మంది గాయపడ్డారు. గతంలో ఏనాడూ తిరుపతిలో ఇంత దారుణ ఘటన జరగలేదు. ఇది పూర్తిగా టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే. తిరుపతికి లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా, వారికి ఏ విధంగా వసతులు కల్పించాలి? ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు కానీ, టీటీడీ ఛైర్మన్‌ కానీ ఆలోచించలేదు.

భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. తాగడానికి మజ్జిగ కూడా సరఫరా చేయలేదు. అన్ని తప్పులు చేసినా, ఏదో గొప్పగా చేశామని ఈరోజు చెబుతున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి కనీసం ఆహారం లేదు. నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఘటనకు పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత.

సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, ఈఓ, ఏఈఓ, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌.. వీరందరిదీ ఈ ఘటనకు బాధ్యులు. కాబట్టి వారందరిపై చర్య తీసుకోవాలి. ఇంకా, హోం మంత్రి, దేవాదాయ మంత్రుల బాధ్యత కూడా ఉంది. ఇక వీరి ఎఫ్‌ఐఆర్‌ చాలా దారుణంగా ఉంది. బీఎన్‌ఎస్‌ 194 సెక్షన్‌ పెట్టారు. అది పూర్తిగా తప్పు. సెక్షన్‌ 105 నమోదు చేయాలి. చంద్రబాబు సీఎం అయ్యాక, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తింటోంది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనా దుష్ప్రచారం చేశారు. ఇవాళ కూడా ఆయన చర్య వల్లనే ఈ ఘటన జరిగింది.

నిజానికి క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఎంతో పేరుంది. కానీ ఈరోజు తిరుమలకు రావాలంటే, భయపడే పరిస్థితి వచ్చింది. తమిళనాడులో శ్రీరంగం అనే క్షేత్రం ఉంది. అక్కడికి కూడా భక్తులు చాలా మంది వెళ్తారు. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చూడండి. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు. అందుకే తిరుమల ప్రసాదంపై కూడా ఆరోపణలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేశారు.

పోలీసులు మొత్తం చంద్రబాబు సేవలోనే ఉన్నారు. ఆయన మూడు రోజులు కుప్పంలో మకాం వేస్తే, పోలీసులు మొత్తం ఆయన భద్రతలోనే ఉన్నారు. దీంతో తిరుపతిలో తగిన సంఖ్యలో పోలీసులు లేరు. ఇది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనకు కచ్చితంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీనే బాధ్యులు.

చంద్రబాబు నిర్వాకం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు 29 మంది చనిపోయారు. కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం అంత మందిని బలి తీసుకున్నారు. నేను ఇక్కడికి వస్తానని, వాస్తవాలు ప్రజలకు చెబుతానని భయపడి నేను ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని చూశారు. నేను ఆస్పత్రికి రాకుండా చేయాలని చూశారు. నన్ను ట్రాఫిక్‌లో ఆపి, నా కాన్వాయ్‌ ఆస్పత్రికి రావొద్దన్న కుట్ర చేశారు.

చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తరలించాలని చూశారు. వారు ఎదురు తిరగడంతో ఊర్కున్నారు. అప్పటికి కొందరు పేషెంట్లను బలవంతంగా డిశ్చార్జ్‌ చేశారు.

LEAVE A RESPONSE