Suryaa.co.in

Telangana

గవర్నర్ తో బీసీ సంఘాల భేటీ

– బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘాల నేతలు
– బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా కేంద్రo తో మాట్లాడాలని గవర్నర్ కోరిన బీసీ నేతలు
– గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసిన అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

హైదరాబాద్: బీసీల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఎలాంటి సవరణలు లేకుండా యధావిధిగా ఆమోదించి రాష్ట్రపతికి పంపించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ సంఘాల ప్రతినిధుల బృందం హైదరాబాదులోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ గారిని బీసీ సంఘాల నేతలు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగనణ, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా చేసిన బీసీ బిల్లు, అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలలో సమగ్ర కులగణను చేపట్టాలని నిర్ణయించడం తదితర అంశాలపై గవర్నర్ గారితో జరిగిన భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాడాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కి మరియు కేంద్ర క్యాబినెట్ కూడా గవర్నర్ ద్వారా బీసీ ప్రతినిధుల బృందం ధన్యవాదాలు తెలిపినట్లు వారు తెలిపారు.

ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జన మహా ధర్నాలో 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొనడంతో దేశస్థాయిలో కులగనన అంశం తీవ్రంగా చర్చకు రావడం, దేశంలో తెలంగాణ మరియు బీహార్ లో జరిగిన కులగణనతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని, కులగనణ చేయమని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా అపిడవిట్టు సమర్పించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు కులగణన చేస్తామని వెల్లడించడం ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఒకవేళ కులగణణ పై సానుకూల వైఖరి ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును తక్షణమే ఆమోదించి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం రోజురోజుకు బలపడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ తమ విశిష్ట అధికారాలను ఉపయోగించి 42 బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా,అలాగే దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేసేలా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ కి విజ్ఞప్తి చేసినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

గవర్నర్ ను కలిసిన బీసీ ప్రతినిది బృందంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE