* జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచన
పోలవరం: రబీ సీజన్లో భాగంగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు సోమవారం బయలుదేరిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మార్గమధ్యలో గూటాల, పట్టసం వద్ద రహదారిపై ఆరబోసిన రాశులను ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ లక్ష్యం మేరకు దాన్ని సేకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నారని, తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల వల్ల రహదారులపై ఆరబోసిన ధాన్యం రాశులు తడిసిపోతున్నాయని రైతులు వాపోయారు.
తక్షణం స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారి అందుబాటులో ఉండటం లేదని పలు రైతులు ఎంపీ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసి బాధ్యతగా పనిచేయాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టసం సమీపంలో రహదారి పక్కన ఆరబోసిన మొక్కజొన్న కండేలను పరిశీలించిన ఎంపీ మహేష్ కుమార్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
మొక్కజొన్న కండెలు ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. మొక్కజొన్న కండెలు ఆరబోసేందుకు ఫ్లాట్ ఫారంలు, గోదాముల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఎంపీ మహేష్ కుమార్ సూచించారు.