* ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
* ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, టైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
* నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ మహేష్ కుమార్
పోలవరం : రానున్న రెండేళ్లలో ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, టైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులుతో కలిసి సోమవారం ఎంపీ మహేష్ కుమార్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
అనంతరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో పోలవరం పనుల పురోగతిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పనుల పురోగతి పెరగాలని, ఇకపై ప్రతి నెల పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ, నిర్వాసితులకు పరిహారం అందించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఎంపీ ఆరోపించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయని ఎంపీ పేర్కొన్నారు. అలాగే నిర్వాసితులకు రూ. వెయ్యి కోట్లు పరిహారం మంజూరు చేసిందని ఎంపీ తెలిపారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.157 కోట్లు పెండింగ్ ఉందని, భూ సమీకరణకు సంబంధించి రూ.219 కోట్లు చెల్లించాల్సి ఉందని ఎంపీ పేర్కొన్నారు.
అలాగే పోలవరం నిర్వాసితులకు నిర్మిస్తున్న పక్కా గృహాలను నాణ్యత ప్రమాణాల మేరకు పూర్తిచేయాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. పక్కా ఇళ్ల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని, ఫిర్యాదులు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. పక్కా ఇళ్లను ఏడాదిలో పూర్తిచేసి, నూతన గృహప్రవేశాలకు తాను హాజరవుతానని ఎంపీ తెలిపారు.
నిర్వాసితులకు న్యాయం చేయడం, పోలవరం పూర్తిచేయడమే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ వెల్లడించారు. అనంతరం కోండ్రుకోటలోని పోలవరం నిర్వాసితులకు సంబంధించిన ఎల్. ఎన్. డి కాలనీని సందర్శించిన ఎంపీ మహేష్ కుమార్ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఆర్డీవో ఎంవి రమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి. శ్రీనివాసులు రెడ్డి, ఐటీడీఏ పీవో కే.రాములు, హౌసింగ్ ఈఈ జి.సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ కె.శ్రీను, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ టి.లత, ఈడబ్ల్యు డిప్యూటీ ఈఈ ఎ.కోటేశ్వరరావు, ఆర్.అండ్.బి డిప్యూటీ ఈఈ సిహెచ్ హరికృష్ణ, ఆర్.అండ్.బి ఈఈ వైవి కిషోర్ బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.