– ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు
– పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి
– ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలి
– పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ముంపుపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం
– రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గడ్ సీఎంతో ప్రధాని మోదీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలి.
ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలి. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుంది.లేదంటే ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయి.పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడింది.
ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉంది.వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయింది… దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలి. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో లో ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ ను ఆమోదించి అన్యాయం చేశారు.
ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు… లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీ అప్పజెప్పారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో మేము గళమెత్తాము. బీఆర్ఎస్ పార్టీ సభ్యులం పార్లమెంటులో మాట్లాడాము కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆ నాడు కూడా పట్టనట్టు వ్యవహరించారు.
కేసీఆర్ బంద్ కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా లేదు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుంది. భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉంది.