Suryaa.co.in

Telangana

నవశకానికి నాంది “భారత్ రాష్ట్ర సమితి”

– కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: “ఉద్యమ నాయకుడు కేసిఆర్ నాయకత్వంలో ఉప ప్రాంతీయ పార్టీ గా మొదలైన టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం గాంధేయ మార్గంలో రాష్ట్రాన్ని సాధించుకుని అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా అవతరించింది. ఉద్యమ నేత కేసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి.. తెచ్చుకున్న కొత్త రాష్ట్రం ఆనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా,రైతు సంక్షేమ పరిపాలన యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. రైతులు,పేదలు రెండు కళ్ళుగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వాన్ని యావత్ భారతావని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.

రైతు బంధు,రైతు భీమా,24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్,కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్,ఆసరా పెన్షన్లు,దళిత బంధు,సబ్బండ వర్గాల సంక్షేమం లాంటి ఎన్నో సంస్కరణల పథకాలతో తెలంగాణను అభివృద్ధిలో పరుగులు పెట్టించిన కేసిఆర్.. దేశ రాజకీయాల్లోకి వస్తే మా ప్రాంతంలో కూడా తెలంగాణ లాంటి అభివృద్ది జరుగుతుందని వివిధ రాష్ట్రాల ప్రజలు బహిరంగంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కేసిఆర్ ని ఆహ్వానిస్తున్నారు.

లౌకిక దేశాన్ని మత విద్వేశంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ వైఖరి పట్ల, బీజేపీ మోడీ పాలన పట్ల దేశప్రజలు విసుగు చెందారు. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ, నిత్యావసరాల ధరలు పెంచుతూ,ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. అన్ని వర్గాల దేశ ప్రజల నడ్డి విరుస్తున్నారు. యావత్ దేశాన్ని అదోగతి పాలుజేసింది బీజేపీ పాలన. దీన్ని క్షుణ్ణంగా గమనించిన ప్రజలు రానున్న రోజుల్లో గాంధేయ మార్గంలో నడిచే కేసిఆర్ లాంటి నాయకుడు,తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని బలంగా కోరుకుంటున్నారు.

యావత్ దేశ ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ “భారత్ రాష్ట్ర సమితి” తో దేశ రాజకీయాల్లోకి రావడం హర్షణీయం. మా తండ్రి,రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి తో కలిసి టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా…నేడు బిఆర్ఎస్ పార్టీ లో కేసిఆర్ సైనికుడిగా పని చేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజల ఆదరాభిమానాలు,మద్దతు కేసిఆర్ గారికి ఉంటుంది. కచ్చితంగా బి ఆర్ ఎస్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. భారత దేశ దిశా దశ మార్చే సత్తా కేవలం కేసిఆర్ తో మాత్రమే సాధ్యం అవుతుంది. దేశానికి కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష.”

LEAVE A RESPONSE