పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించిన భట్టి, ఉత్తమ్

రాష్ట్ర సచివాలయంలోని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్లగొండ ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళంల, ఎస్ యల్ బి సి టన్నెల్, నక్కలగండి, చర్ల, రిజర్వార్లు, బునాది గాని పిలాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి మూసి కాలువల పెండింగ్ పనులు పురోగతి గురించి వాడి వేడిగా లోతుగా చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2400 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ పేరిట 13వేల కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని అధికారులను అడిగారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం వల్ల అదనంగా ఆయకట్టు పెరిగిందా? అడిగిన ప్రశ్నకు అధికారులు ఏమాత్రం పెరగలేదని అంతే ఆయకట్టు ఉందని సమాధానం చెప్పారు.

ఆయకట్టు పెంచకుండా రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు అంచనాలను పెంచి ప్రజల సంపదను దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టులో జరిగిన పనుల గురించి వాస్తవాలు చెప్పాలని ఆదేశించడంతో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తయిన బ్యారేజీ కెనాల్స్ పనులు, పెండింగ్లో ఉన్న పనులు, చేయాల్సిన భూసేకరణ, కోర్టు కేసులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల గురించి మంత్రులకు వివరించారు.

బ్యారేజ్ నిర్మాణానికి ఇంకా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. హెడ్ వర్క్ దగ్గర పనులు పూర్తి చేయకుండా చివరి కాలువల వద్ద పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పురోగతిలో ఉందని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అన్న దానిపై అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు మింగారు. నిజాలను దాచిపెట్టకండి వాస్తవాలు చెప్పండి అంటూ అధికారులను సుతిమెత్తగా మందలించారు.

శబరి, గోదావరి నదులు కలిసిన చోట 365 రోజుల పాటు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాంతాన్ని విస్మరించి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైనింగ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వల్ల అంచనా వ్యయం పెరిగింది తప్పా పది సంవత్సరాలుగా అదనంగా ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని అధికారులను నిలదీశారు. గతంలో రూపొందించిన ఇందిరా సాగర్ ప్రాజెక్టును యధావిధిగా కొనసాగిస్తే ఇప్పటివరకు పనులు పూర్తయ్యి నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని, ఇందిరా సాగర్ ప్రాజెక్టు డిజైనింగ్ కరెక్టుగా నే రూపొందించారని అధికారులు చెప్పారు.

గత ప్రభుత్వం తీసుకున్న పాలసీ డిసిషన్ వల్ల ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామన్నారు. నీళ్ల కొరకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలోని ఉమ్మడి జిల్లా లోని కొన్ని మండలాల ప్రజలకు ఇప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదని డిప్యూటీ సీఎం వెల్లడించారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు జోన్ -3 ద్వారా ఏపీకి పంపిణీ అవుతున్నాయని, జోన్- 2 ద్వారా ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలకు ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపిణీ జరిగేదన్నారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతున్న ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ జోన్ -3 లో ఉన్నాయని వీటిని జోన్ -2 లోకి మార్చాలని చాలా సార్లు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

జోన్-3 నుంచి జోన్- 2 కి మార్చడానికి కావలసిన ప్రతిపాదనలను సంబంధిత అధికారుల వద్దకు పంపించమన్నారు. ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న ప్రతిపాదనలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని వీలైనంత తొందరలో జోన్ -3 లో ఉన్న గ్రామాలను జోన్-2లోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి రాష్ట్రం వచ్చే నాటికి మధిర నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న జాలుముడి, మున్నేరు ఆనకట్టలను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వాటిని పూర్తి చేయడానికి కావలసిన అంచాన వ్యయాలను రూపొందించాలన్నారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేసి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాలపై సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ నక్కలగండి డిండి ప్రాజెక్టుల పనులు ఇంకా ఎంత శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఎంత నిధులను ఖర్చు చేసింది, అలాగే ఇంకా ఎంత నిధులు అవసరం ఉన్నాయి. సమృద్ధిగా నిధులు ఇస్తే ఎప్పటిలోగా పూర్తి చేశారన్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఎస్ఎల్బీసీ, నక్కల గండి ప్రాజెక్టులను సందర్శించారని గత ప్రభుత్వాలు వాటిని చాలా నిర్లక్ష్యానికి గురి చేశాయని చెప్పుకొచ్చారు. పది సంవత్సరాలుగా ఎస్ఎల్బీసీ పనులు చాలా నత్తనడకగా సాగడం విచారకరమని పేర్కొన్నారు. తక్కువ అంచనా వ్యయంతో పెండింగ్లో ఉండి 90% పైగా పూర్తయిన ప్రాజెక్టులను అధికారులు గుర్తించి వాటిని పూర్తి చేయడానికి కావలసిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ హెడ్ వర్డ్స్ పూర్తి చేయకుండా చివరి కాలువలు పూర్తి చేసుకుంటే ఫలితం ఏమంటుందని అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం రెండు మూడు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసి వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం వల్ల ప్రజలపై భారం మోపిందన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను నాలుగు రకాలుగా విభజించాలని ఆదేశించారు.

ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యే ప్రాజెక్టులు, 18 నెలల్లోగా ప్రాజెక్టులు 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపివేయాలని ఆదేశించారు.

చెరువుల మరమ్మతులు, చెక్ డ్యాముల నిర్మాణం కోసం, ఎమ్మెల్యే నుంచి వచ్చే సిఫారసులను స్వీకరించి వాటికి కావలసిన నిధుల మంజూరుకి కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు వల్ల వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఇది బ్యాడ్ రీ డిజైనింగ్ లా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అధికారులపై పొంగులేటి ఆగ్రహం
సీత రామ ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలు సమగ్రంగా చెప్పని అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్ ల వారీగా ఆయన జరిగిన పనుల గురించి అధికారులను అడిగారు. తత్తరపాటు సమాధానాలు చెప్పడంతో మీరు చేసే పని పైనే మీకు అవగాహన లేకుంటే ఎలా అంటూ ఈఈని మందలించారు.

ప్రతి సాగునీటి ప్రాజెక్టు గురించి చాలా లోతుగా మంత్రులు చర్చించారు. అదేవిధంగా నాగర్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటి నిల్వలు వాటి వాడకం గురించి తెలుసుకున్నారు. వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply