గాంధీ సిద్ధాంతాన్ని అవమానిస్తున్న గాడ్సే వారసులు

  • నేషనల్ హెరాల్డ్ పత్రికకు తాళాలు వేయడం స్వాతంత్ర సంగ్రామాన్ని అవమానించడమే
  • బిజెపి ప్రచార ఆర్భాటం విడ్డూరంగా ఉంది
  • విచారణ పేరిట సోనియా రాహుల్ వేధిస్తున్న బిజెపికి దేశ ప్రజలు బుద్ధి చెబుతారు
  • సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
  • కూసుమంచిలో ఆజాధీ కా గౌరవ్ యాత్ర ప్రారంభం

స్వాతంత్ర ఉద్యమ ఆలోచనలను ప్రజలకు తెలియజేయడానికి, ఇతర దేశస్తుల మద్దతు కూడగట్టడానికి ఆనాడు నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయానికి బిజెపి తాళాలు వేయించడం స్వాతంత్ర సంగ్రామాన్ని అవమానించడమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసిసీ ఇచ్చిన పిలుపు మేరకు పాలేరు నియోజకవర్గం కూసుమంచి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆజాధీ కా గౌరవ్ యాత్రను మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం కూసుమంచిలో జరిగిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జాతిపితగా మహాత్మా గాంధీని ప్రపంచమే గౌరవిస్తుంటే గాంధీని చంపిన గాడ్సే వారసులు అధికారంలోకి వచ్చి గాంధీ సిద్ధాంతాన్ని అవమానించాడాన్ని తప్పుపట్టారు.

దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని బిజెపి తామే స్వాతంత్రం తీసుకొచ్చినట్టుగా ప్రచార ఆర్భాటానికి పాల్పడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ కుటుంబ సభ్యులైన సోనియా, రాహుల్ పై కక్ష సాధింపునకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఈ.డి నోటీసులు ఇప్పించి విచారణ పేరిట రోజుల తరబడి వేధింపులకు పాల్పడుతున్న బిజెపి పాలకులకు దేశ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దేశ భవిష్యత్తు చల్లగా ఉండాలంటే.. కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.

దేశ స్వాతంత్ర సంగ్రామం లో పోరాడిన వేల మంది కాంగ్రెస్ నాయకులను బ్రిటిష్ పాలకులు అండమాన్ జైల్లో నిర్బంధించి అనేక చిత్ర హింసలు పెట్టి ప్రాణాలు తీశారని పేర్కొన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లు దేశ స్వాతంత్రం కోసం విరోచితంగా ఉద్యమించి తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారని కొనియాడారు. నీలిమందు వ్యతిరేకంగా బీహార్ రైతుల కోసం మహాత్మా గాంధీ మొదలుపెట్టిన సత్యాగ్రహం దేశ సంగ్రామానికి నాంది పలికిందన్నారు. 1885 సంవత్సరం మొదలుకొని 1947 ఆగస్టు 15 వరకు స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలి దేశానికి కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకొచ్చింద న్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు వారైనా పింగళి వెంకయ్య, గోకరాజు పట్టాభి సీతారామయ్య లాంటి పోరాటయోధులు కీలక భూమిక పోషించారని, స్వాతంత్ర పోరాటంలో తెలుగువారి చరిత్ర ఉందన్నారు. దేశానికి జెండాను అందించిన పింగళి వెంకయ్యను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. పింగళి వెంకయ్య అందించిన జాతీయ జెండాకు ప్రతి ఒక్కరు వందనం చేయాల్సిందేనని తెలిపారు. ఆనాటి స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తిని ప్రజలకు వివరించడమే ఆజాదీ కా గౌరవ్ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు.

భారతదేశం అంటేనే కాంగ్రెస్: మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్
భారతదేశమంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ ను దేశాన్ని వేరువేరుగా చూడలేమని మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు.
అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తల దన్నే విధంగా భారత్ ఉండటానికి కాంగ్రెస్ చేసిన కృషి ఫలితమేనని వివరించారు.శసూర్యచంద్రులు ఉన్నంతవరకు కాంగ్రెస్ సిద్ధాంతం ఉంటుందన్నా రు. నాయకులు పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, కార్యకర్తలే బలం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలిపారు.కూసుమంచి శివాలయం నుంచి కేశవపురం, జిల్ల చెరువు, గోపాల్ రావుపేట, తల్లంపాడు, పొన్నేకల్, మద్దులపల్లి గ్రామాల్లో మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 75 వ స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా కూసుమంచిలి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును భట్టి విక్రమార్క కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు మాధవి రెడ్డి, శేఖర్ గౌడ్, వీరభద్రం, సౌజన్య, బంధయ్య, సంతోష్, మట్ట గురువయ్య తదితరులు పాల్గొన్నారు.

సీఎల్పీ నేత భట్టి ని కలిసిన విఆర్ఏలు
75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు కూసుమంచి శివాలయం నుంచి కేశవపురం వెళ్తున్న ఆజాదీ కా గౌరవ్ యాత్ర లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క*ను వీఆర్ఏ లు కలిసి తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వివరించారు. తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు.

స్వాతంత్ర సమరయోధులకు సన్మానం
ఆజాదీ కా గౌరవ్ యాత్ర లో బాగంగా కూసుమంచి శివాలయం వద్ద స్వాతంత్ర సమరయోధులను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు, మాజీ మంత్రి సంబానీ చంద్రశేఖర్ గారు ఘనంగా సన్మానం చేశారు. స్వాతంత్ర సమరయోధులు చాగంటి నారాయణ, ఉన్నం వెంకయ్య, సోమ్లా నాయక్ తదితరులకు పూలమాలవేసి శాలువా కప్పి సత్కరించారు.

కూసుమంచి శివాలయంలో భట్టి దంపతుల పూజలు
75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ్ యాత్ర ను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు ప్రారంభించడానికి
పాలేరు నియోజకవర్గం కూసుమంచి శివాలయం వద్ద కు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆలయం అర్చకులు పూర్వకుంభంతో స్వాగతం పలికి శివాలయం గర్భగుడిలో భట్టి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు.

Leave a Reply