• భూ భారతికి అనూహ్య స్పందన
• నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి
• 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి
• భూ సమస్యలపై 11, 630 దరఖాస్తుల స్వీకరణ
• ఈ నెల 5వ తేది నుంచి జిల్లాకు ఒక మండలం చొప్పున 28 మండలాలలో భూ భారతి
• 20 జిల్లాల్లో 45 సదస్సుల్లో స్వయంగా పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
• మార్పుకు నాంది భూ భారతి : మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గత నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్బంగా చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏమాత్రం ఆటంకం కలగకుండా ఉండేలా పైలట్గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణ్పేట్ జిల్లా మద్దూర్, ములుగు జిల్లా వెంకటాపూర్ నాలుగు మండలాల్లో పూర్తి స్ధాయిలో అమలు చేస్తున్నారు.
ఇదే సమయంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతిరోజు ఒక మండలంలో రెండు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఈ రెండు సదస్సుల్లో కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని ఆదేశించింది. ఇందుకోసం మండల స్ధాయిలో తహశీల్దార్ డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో రెండు బృందాలను ఏర్పాటు చేసింది.
ఈ భూభారతి చట్టం రైతులకు అర్ధమయ్యే విధంగా చట్టాన్ని అమలు చేసే అధికారులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహించింది. భూభారతి చట్టంలో కీలక పాత్ర వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక సవాల్గా తీసుకొని విస్తృత స్ధాయిలో జిల్లాల్లో పర్యటించి రోజుకు రెండు, మూడు అవగాహనా సదస్సులలో స్వయంగా పాల్గొన్నారు. ఏప్రిల్ 17వ తేదీనుంచి 30వ తేదీవరకు దాదాపు 20 జిల్లాల్లో సుమారు 45 సదస్సులలో పాల్గొన్నారు.
నాలుగు పైలట్ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 17 వ తేదీ నుంచి 30వ తేదీవరకు రెవెన్యూ సదస్సులను పూర్తిచేశారు. ఈ సదస్సుల్లో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు ఆయా మండలాల్లో భూసమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రశీదు అందజేశారు. ఒక ప్రత్యేక ఫార్మాట్ లో తయారు చేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సుకు ముందు రోజే ప్రజలకు అందించారు.
లింగంపేటలో 3,702, వెంకటాపూర్లో 3,969, మద్దూర్లో 1,341, నేలకొండపల్లిలో 2,618 మొత్తం 11, 630 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పీపీబీకి సంబంధించి 3,446, సాదాబైనామాలపై 2,796 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులన్నింటిని ఏరోజుకు ఆరోజు కంప్యూటర్ లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ మినహా 605 మండలాలకు గాను 555 మండలాలలో బుధవారం నాటికి సదస్సులు పూర్తి అయ్యాయి.
వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జూన్ 2వ తేదీ నాటికి ఆ నాలుగు మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలాన్నిపైలట్ గా తీసుకొని 28 మండలాల్లో పూర్తిస్ధాయిలో భూభారతి చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
మార్పుకు నాంది
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో తీసుకువచ్చిన భూభారతి చట్టం విప్లవాత్మక మార్పుకు నాంది పలకబోతోంది. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ చట్టం ఉంది. ఈచట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో తమ భూ సమస్యలు ఈ భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయనే నమ్మకం, విశ్వాసాన్ని రైతులు వ్యక్తం చేశారు.
ధరణితో వారు అనుభవించిన కష్టాలను, బాధలను వ్యక్తం చేశారు. ధరణి తో వారు ఎదుర్కొన్న సమస్యలను చెప్తుంటే వారు పడ్డ కష్టం కళ్ళముందే కనిపించింది. రైతుల భూ సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించడానికి అధికార యంత్రాంగాన్ని సంసిద్ధం చేశాం. ఇకనుండి రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయంలోనే వాళ్ళ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చు పరిష్కరించే విధానం నిరంతరం కొనసాగుతుంది. ఈ పైలట్ నాలుగు మండలాలలో కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలు మినహా అన్ని సమస్యలను జూన్ 2వ తేదీ నాటికి పరిష్కరిస్తాం. ఆ నాలుగు పైలట్ మండలాల మాదిరిగానే ఈ నెల 5వ తేది నుంచి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో జిల్లాకు ఒక మండలంలో పూర్తి స్థాయిలో భూ భారతిని అమలు చేస్తున్నాం.
చట్టం తీసుకువస్తే సరిపోదు, ఆ చట్టం పూర్తి స్దాయిలో అమలు జరిగినప్పుడే రైతులకు నిజమైన న్యాయం లభిస్తుంది. ఆ దిశగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.