– భట్టి బడ్జెట్ ప్రసంగం పచ్చి అబద్దాలు, అసత్యాలు
– బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయింది
– బడ్జెట్ లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమీ లేవు
– కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ఎన్నికల ముందు అన్ని చేస్తాం ,అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నది. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బయట, అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నాడు.
బడ్జెట్ ప్రసంగం అబద్దం 1:
లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నం అన్నరు. 20వేల కోట్లు ఇచ్చినం అంటున్నారు. గతేడాది వచ్చే ఏడాది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తం అన్నరు.
మొత్తం వర్తిస్తదా అంటే లేదు 5లక్ష వరకే వర్తిస్తది అని జీవో 27 ప్రకారం అని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. 5లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా 15లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నరు. తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెబుతున్నది నిజం. అసెంబ్లీ సాక్షిగా మహిళలందర్ని ప్రభుత్వం నేడు మోసం చేసింది.
బడ్జెట్ ప్రసంగం అబద్దం 2:
స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు 75ఇస్తున్నం అంటున్నారు. గత బడ్జెట్ లోనూ ఇదే చెప్పారు, మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నది 50 రూపాయలు మాత్రమే. 75 ఇచ్చినట్లు రెండు బడ్జెట్లలో చెప్పుకున్నారు.
బడ్జెట్ ప్రసంగం అబద్దం 3
రేషన్ కార్డులు:
ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్ లో చెప్పారు. చాలెంజ్ చేస్తున్నా, బీఆర్ఎస్ 6లక్షల 47వేల రేషన్ కార్డులు ఇచ్చినం.
అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్దాలు: 72పేజీల భట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదు.
ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక కూడా అబద్దాలు సోనియా గాంధితో ప్రజలకు ఉత్తరం రాయించారు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని ఈ బడ్జెట్ లో అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజ ఎంతో ఆశగా చూసాడు
మహాలక్ష్మి ఊసే లేదు
2500 లేదు గానీ, 2500 కోట్ల అందాల పోటీల కోసం బడ్జెట్ లో పెట్టారు. చేయూత కింద 4000 పించన్ అన్నరు. అతీ గతీ లేదు. వృద్దులు, గీత, చేనేత, ఎయిడ్స్ పేషెంట్లను కూడా మోసం చేసింది కాంగ్రెస్.
కొత్త పింఛన్ ఇయ్యలేదు, ఉన్న పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టారు. లక్షా 50వేల పింఛన్లు తగ్గినయి. కోత పెట్టారు. రుణమాఫీ అయినోళ్లు తక్కువ, కానోళ్లు ఎక్కువ.రుణమాఫీ అయిపోయినట్లు చేస్తున్నరు. మిగతా వాళ్లకు ఎప్పుడిస్తరు. రెండు లక్ష మీద ఉన్నవాళ్లకు కాలేదు, లోపు ఉన్న వాళ్లకు కాలేదు. నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న 10,150 మందికి రుణమాఫీ కాలేదు.
ఎక్కడి వెళ్దాం, ఎక్కడైనా చర్చకు నేను సిద్దం. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసినవు. తులం బంగారం కేటాయింపులు లేవు.
గత బడ్జెట్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అన్నరు, ఈ ఏడాది పన్నెండు పూర్తి చేస్తం అన్నరు. ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా అయితే ఒక్క దాని పేరు చెప్పండి ఈ బడ్జెట్ లో ప్రస్తావనే లేదు. బడ్జెట్ అన్ రియలిస్టిక్ గా ఉంది. బడ్జెట్ ప్రసంగం మక్కీ మక్కీ ఉంది. సిగ్గుచేటు.
ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది, దక్షిణ బాగానికి డీపీఆర్ చేస్తున్నం అని మల్లా పాత బడ్జెట్ లోని అంశమే మళ్లీ చెప్పారు. పని ముంగటికి పోయింది లేదు, రూపాయి ఇచ్చింది లేదు. ఎకరం సేకరించింది లేదు. జీఎస్డీపీ గ్రోత్ రేటు 12.9శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.1శాతం అన్నారు. 2.8శాతం ఎందుకు తగ్గింది? తలసరి ఆదాయం మా పాలనలో 12.4శాతం. కాంగ్రెస్ పాలనలో 9.6శాతం.
రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అప్పులు అప్పులు అంటడు. బడ్జెట్ పుస్తకాలు చూస్తే రెవెన్యూ సర్ ప్లస్ సేట్ అని చెబుతుంది. గతేడాది 5888 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది. ఈ బడ్జెట్ లో 2738 కోట్ల సర్ ప్లస్ ఉంటదని ప్రతిపాదించారు. సర్ ప్లస్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చిత్రీకరించారు. మీ ఆలోచన విధానం వల్ల దివాలా తీసింది. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నడు, పుస్తెల తాళ్లు తెంచుతున్నడు. ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా 50వేల కోట్ల రాబడి ఆశిస్తున్నడు. బిఆర్ఎస్ హయాం కంటే 12 నుంచి 13 వేల కోట్లు ఎక్కువ.
7వేల కోట్లు ఎక్కువ పెట్టారు అని గత బడ్జెట్ లో నేను ప్రశ్నిస్తే లేదు లేదు అన్నరు.కానీ మద్యం ధరలు విపరీతంగా పెంచారు. తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నరు. చార్జ్ మెమోలు ఇస్తున్నరు అమ్మకాలు పెంచలేదని ఎట్ల పెరుగుతది 14వేల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి?
భూముల అమ్మకం విపరీతంగా పెంచుతున్నారు. మా హయాంలో 23వేల కోట్ల నాన్ టాక్స్ రెవెన్యూ ఉంట కాంగ్రెస్ 32, 618 కోట్లు పెట్టారు. ఎఫ్ఆర్బిఎఫ్ అప్పులు పెరిగాయి మైనార్టీస్ కోసం గతంలో మూడు వేల కోట్లు చెప్పారు. వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఒక్క పథకం అమలు కొత్తగా తేలేదు, కేసీఆర్ ప్రారంభించిన షాదీ ముబారక్ ఇవ్వడం లేదు. మైనార్టీ మంత్రి లేడు, కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలేదు, బడ్జెట్ కూడా లేదు.
టెమ్రిస్ స్కూల్ బంద్ పెడుతున్నరు. ఇంటిగ్రేటెడ్ లో విలీనం అవుతాయని బడ్జెట్ లో చెప్పారు. ఇంతకంటే మైనార్టీలకు అన్యాయం ఏముంటుంది?
కేసీఆర్ ప్రతి మండలానికి డబుల్ లైన్ రోడ్లు వేశారు. 40:60 ప్రభుత్వం, కాంట్రాక్టర్ ద్వారా రోడ్లు వేస్తరా? మండలాలు, జిల్లాలకు పోవాలంటే టోళ్లు కట్టాలా? హ్యాం మోడల్ తెస్తే ప్రజల జేబులకు చెల్లు. బీసీలకు మొండి చేయి చూపింది, దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సబ్ ప్లాన్ అని దోకా చేసింది. 20వేల కోట్లు ఎక్కడా? చేతిలో ఉన్న బడ్జెట్ లో సబ్ ప్లాన్ ఎందుకు పెట్టడం లేదు.
బడ్జెట్ లో పదివేల కోట్లు మాత్రమే పెట్టారు. సీఎస్ఎస్ ద్వారా కేంద్రం నుంచి 15,729 కోట్లు వస్తయని బడ్జెట్ లో పెట్టారు. 2023-24 లో వచ్చింది 5,966 కోట్లు. ఎట్లా వస్తది కేంద్రం నుంచి? 1.34శాతమే కేంద్ర ఇచ్చింది. 2.9శాతం అని పెట్టారు.
అన్ రియలస్టిక్ బడ్జెట్ ఇది. కేంద్రం నరేగా కోసం గతేడాది 86వేల కోట్లు పెట్టింది, ఇప్పుడు కూడా అంతే పెట్టింది. కానీ మీరు గతేడాది 2600 కోట్లు, ఇప్పుడు 3000 కోట్లు వస్తాదని బడ్జెట్ లో పెట్టారు. ఎట్లా వస్తది 400 కోట్లు ఎక్కువ? మిడ్ డే మీల్స్ కోసం గతేడాది 145 కోట్లు వస్తే, ఈసారి 1200 కోట్లు వస్తాదని పెట్టారు. మహిళలకు సంబంధించి 9కోట్ల 90 లక్షలు వస్తే, ఈ సారి 1949 కోట్లు వస్తాదని పెట్టారు
కేంద్రం మొత్తం పెట్టిందే 26000 కోట్లు, అందులో 1949 కోట్లు వస్తయా? పేదల ఇండ్లు కట్టుకోవడానికి 5లక్షలు, ఎస్సీ ఎస్టీకి 6లక్షలు, మొత్తం 4,50,000 ఇండ్లు కడుతం అని గత బడ్జెట్ లో పెట్టారు. బడ్జెట్లో 22,500 కోట్లు పెట్టారు. 22 పైసలు ఖర్చు చేయలేదు, ఒక్క ఇళ్లు ఈ రాష్ట్రంలో కట్టలేదు. ఈ సారి ఏం చెప్పారంటే, మల్ల అదే ముచ్చట. అదే మక్కీకి మక్కీ.
బడ్జెట్ అంకెల గారడీ, అబద్దాల గారడీ.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కేవలం 600 కోట్లు పెట్టారు. రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉంటరు. కోటి మంది కూలీలకు 12వేలు ఎంత కావాలె? నిజానికి 50వేల మందికి కూడా ఇవ్వలేదు. భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్. బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయింది.