Suryaa.co.in

Telangana

రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్రం సిద్ధం

– ఆ కాంట్రాక్టర్ తో ఉన్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాలి
– కోమటిరెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలి
– అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కేంద్రం సిద్ధం
– ఎన్నికల వరకే రాజకీయాలు…ఆ తరువాత తెలంగాణ అభివృద్ధి మోదీ సర్కార్ లక్ష్యం
– మోదీ పాలనలో ఆదిలాబాద్ సహా రాష్ట్రంలో అభివృద్ధి పనులు
– జాతీయ రహదారుల కోసమే లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోదీ సర్కార్ దే
– గడ్కరీ మంచి మనసున్న మనిషి
– పార్టీతో బేధం లేకుండా ఎవరు వెళ్లినా పనులు చేస్తారు
– సిర్పూర్ కాగజ్ నగర్ బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్

సిర్పూర్ కాగజ్ నగర్: హైదరాబాద్-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి నాగుపాములా అధ్వాన్నంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, దీనిని ద్రుష్టిలో ఉంచుకుని సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని సూచించారు.

కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో రూ.6100 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పలు రహదారులకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, ఎంపీలు వంశీ, నగేశ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించేందుకు వేదిక వద్దకు రాగానే సభకు హాజరైన వేలాది మంది ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో మరిన్ని రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేందు కోసం ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 6 వేల 100 కోట్ల రూపాయలతో 167 కి.మీ. మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన కార్యక్రమాలను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన చేస్తుండటం సంతోషంగా ఉంది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు వెనుకబడిన జిల్లా. రోడ్లు, రహదారుల వ్యవస్థ ఘోరంగా ఉండేది. ఈరోజు ఉదయం నేను కరీంనగర్ నుండి ఇక్కడికి గంటన్నరలోపే వచ్చాను. తెలంగాణలో ఎక్కడికైనా సరే… పొద్దున్నే పోయి పని చూసుకుని మళ్లీ సాయంత్రానికి ఇంటికి రాగలుగుతున్నాం. దీనికి కారణమేంటి? ఒక్కసారి పదేళ్ల క్రితానికి, ఇప్పటికీ ఉన్న తేడాను గుర్తు చేసుకోండి. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు. గత పాలకులు వెనుకబడేసిన జిల్లా. మోదీ ప్రభుత్వం వచ్చాక శరవేగంగా అభివ్రుద్ది పనులు చేపడుతున్నారు.

గత 10 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రానికే జాతీయ రహదారుల(నేషనల్ హైవేస్) అభివృద్ధి కోసం 1 లక్షా 25 వేల 485 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణపట్ల మన మోదీగారికి, మన గడ్కరీ గారికి ఎంత ప్రేమ ఉందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మోదీగారు ప్రధాని కాకముందు అంటే 1947 నుండి 2014 వరకు (గత 67 ఏళ్లలో) 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి.

కానీ మోదీ హయాంలో గడ్కరీ పుణ్యమా అని పదేళ్లలో 5200 కిలోమీటర్లకు పెరిగాయి. అంటే రెట్టింపు స్థాయిలో నేషనల్ హైవేస్ విస్తరించాయి. అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టుల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. ఇయాళ దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోందంటే మౌలిక సదుపాయల కల్పనవల్లే సాధ్యమైంది.

గడ్కరీ వద్దకు ఏ ప్రతిపాదన తీసుకెళ్లినా కాదు, లేదు అనుకుండా నరాజ్ చేయకుండా పనులు చేసి పంపిస్తారు. బీజేపీకే కాదు ఏ మంత్రి, ఎంపీ వెళ్లినా పనులు చేస్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. కోమటిరెడ్డి భోళా మనిషి. మనసులో ఉన్నది చెబుతారు. పనులు చేయించుకుని వస్తారు. ఇక్కడున్న మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్ర అభివృద్ధికి మేం పూర్తి సిద్దం. సహకరిస్తాం.

అనేక సందర్భాల్లో మోదీ ఇదే మాట చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తరువాత అన్ని రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యమని చెప్పారు. తల్లి భారతమాతను విశ్వగురుగా తీర్చిదిద్ది 2047 నాటికి దేశాన్ని నెంబర్ వన్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

వెంకట్ రెడ్డి గారు… గడ్కరీ ప్రామిస్ చేశారు. హైదరాబాద్ నుండి మంచిర్యాల రోడ్డు వరకు రాజీవ్ రహదారి నాగుపాములా ఉండే క్వాలిటీ లేకుండా పనులు చేశారు. రహదారి బాగాలేదు. దయచేసి ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడండి. ఆ సమస్యను పరిష్కరిస్తే రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. గడ్కరీ గారు కూడా హామీ ఇచ్చారు. వెంటనే ఈ విషయంలో కోమటిరెడ్డి చొరవ తీసుకోవాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE