ఎన్టీఆర్ కు ద్రోహం చేసినట్టే.. బీసీలకూ బాబు ద్రోహం

– వెన్నెముక కులాల వెన్ను విరిచింది బాబే
– బీసీలంటే బాబు దృష్టిలో రామోజీ, రాధాకృష్ణలే..!?
– ఆత్మన్యూనత నుంచి.. ఆత్మగౌరవంగా బీసీలు బతికేలా..
– జగన్ గారి సత్యం ముందు బాబు అసత్యం నిలవదు
– రాజకీయ అవసరాల కోసమే బాబు ఎన్టీఆర్ జపం
– ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు తెచ్చారా?
– స్పీకర్ స్థానంలో ఉన్న బీసీ వ్యక్తిని అగౌరవపరుస్తారా..?
-రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ

అధికారం పోయాకే బాబుకు బీసీలు గుర్తొస్తారు
చంద్రబాబు అధికారంలో ఉంటే బీసీలను పట్టించుకోడు. అధికారం పోయిన తర్వాత మాత్రం బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ సినిమా డైలాగులు చెబుతాడు. సమాజానికి వెన్నెముక అయిన బీసీ కులాల వెన్ను విరిచింది చంద్రబాబే. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు నేతృత్వంలో చేసిన డిక్లరేషన్‌ సందర్భంగా.. భారత దేశ సంస్కృతిని సంరక్షించిన, మనిషి అవసరాలను తీర్చే మహోన్నత వ్యక్తులు బీసీలు అని, వారిని వెనుకబడిన కులాలుగా కాకుండా… వెన్నెముక కులాలుగా అభివర్ణిస్తూ మాట్లాడిన నాయకుడు జగన్‌ . తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఎంత ద్రోహం చేశారో… బీసీలకు కూడా అంతే ద్రోహం చేశారు. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి, అధికారం నుంచి దించేసినట్టు.. బలహీన వర్గాలకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వెన్నుముక కులాలకు వెన్ను కదిలేలా చేశాడు చంద్రబాబు.

బీసీలంతా జగన్ వెంటే..
అదే జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక, ఇచ్చిన మాట ప్రకారం, బీసీ వర్గాల్లోని 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, అన్ని పదవుల్లోనూ బీసీలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వృద్ధిలోకి తెస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికారు. దాంతో రాష్ట్రంలో బీసీలంతా ఏకపక్షంగా జగన్‌ మోహన్‌ రెడ్డిపక్కన చేరారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకు ఏం చేశావు అని బీసీలు నీకు మద్దతు ఇస్తారు బాబూ..?
– బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఒక లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా వివిధ పథకాల ద్వారా అందించాం. దీనిపై చర్చించే సత్తా ఉందా? ఈ మూడేళ్ల కాలంలో మేము చేసిన మంచిని ఇంటింటికి వెళ్లి చెప్పే ధైర్యం మా శాసనసభ్యులకు ఉంది, మీకుందా.. ?

బాబు వెన్నుపోటు పార్టనర్సే బీసీలా..?
బీసీలను చంద్రబాబు కేవలం ఓటుబ్యాంకుగానే చూశారు. టీడీపీ వచ్చాక బీసీల నాయకత్వం పెంచామని సోది కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఎవరు నాయకత్వం పెంచావు చంద్రబాబూ? మీకు వత్తాసు పలికేవారిని మాత్రమే బీసీలుగా గుర్తించావు తప్ప… మీ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కొత్తగా ఎవరైనా ఒక్క బీసీ నాయకుడు తయారయ్యాడా? మీ వెన్నుపోటుకు సహకరించిన యనమల రామకృష్ణుడు, కింజారపు కుటుంబం తప్ప … మిగతావారిని ఎప్పుడైనా బీసీలుగా గుర్తించావా?

దేశంలో ఎక్కడా రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నప్పుడు.. పదిశాతం రిజర్వేషన్లు పెంచినట్టు పెంచి, మళ్ళీ మీ పార్టీకి చెందిన వ్యక్తి ద్వారానే కోర్టుల్లో కేసులు వేయించి, వాటిని రద్దు చేయించడం బీసీలను మోసం చేయడం కాదా?. జగన్‌ మోహన్‌ రెడ్డి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానంటే.. మీ సహచరుడు ప్రతాప్‌ రెడ్డితో కోర్టులో కేసు వేయించిన సంగతిని బీసీలు మర్చిపోరు. అది మీ ద్వందనీతికి నిదర్శం కాదా?.

కేంద్రానికి ఎర్రన్నాయుడును పంపించానని చెబుతున్నావు సరే.. మరి, ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపించావా.. రాజ్యసభలో మన రాష్ట్రం నుంచి తొమ్మిది ఖాళీలు ఏర్పడితే అందులో అయిదు స్థానాలను బీసీలకు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిది. పదవుల్లో 50 శాతం బీసీలకు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు.

బీసీల పేరుతో బాబు కొంగ జపం
రాష్ట్ర కేబినెట్‌లో బీసీలకు అత్యున్నత శాఖలు లేవని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. మంత్రివర్గంలోని 25 మందిలో 11మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం మీకు కనిపించడం లేదా? చంద్రబాబు ఎవర్ని మోసగించడానికి ఈ మాటలు చెబుతున్నారో ఆలోచించుకోవాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు 40 నెలలు తర్వాత రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, వాళ్లంతా మీ పార్టీని, మిమ్మల్ని వదిలి వెళ్లిపోయారనే.. బీసీల పేరుతో కొంగ జపం చేయడాన్ని అందరూ గమనిస్తున్నారు.
14ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలో బీసీలకు ఏం మేలు జరిగింది..? ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. ఏది చెప్పినా బీసీలు నమ్ముతారనే భ్రమల్లో బతుకుతున్న ఆయన వాస్తవాల్ని గుర్తించాలి.

– కుల వృత్తుల వారికి ఆదరణ పథకం పేరుతో చంద్రబాబు చేసిన మోసం అందరికీ తెలుసు. సర్పంచ్‌ల నుంచి అధికారాలను తస్కరించాలనే ఆలోచనతోనే కదా చంద్రబాబు జన్మభూమి కమిటీలను తీసుకువచ్చింది…?, అటువంటి చంద్రబాబు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నాడు.

ఆఖరికి మీ జన్మభూమి కమిటీలు సంతకం చేస్తేనే పెన్షన్‌ మంజూరు చేసే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లావు. ఆదరణ పథకంలో బీసీల ఎంపికకు జన్మభూమి కమిటీల పెత్తనం పెట్టి చిత్రహింసలు చేసిన విషయాలను మా బీసీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. మీ హయాంలో పచ్చ కార్యకర్తలకే పథకాలు అందిస్తే.. మా హయాంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్‌ ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించి, వారికి పథకాలు అందచేస్తున్నారు.
ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. మీ హయాంలో మాదిరిగా ఇస్త్రీ పెట్టో, మోకో ఇవ్వడం లేదు. అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.

మీ పాలనలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అదే మా ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల మగ్గం ఉన్న ప్రతివ్యక్తికి ఏటా 24 వేలు నేతన్న నేస్తం ద్వారా అందిస్తున్నాం. అలాగే ఆ కుటుంబంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మిగతా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కితే లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుంది. ఏ ఒక్క బీసీ తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, సగర్వంగా, తలెత్తుకుని బతికేలా, ఈ ప్రభుత్వంలో ఫలాలు అందుతున్నాయి.

బీసీలంటే బాబు దృష్టిలో ఆ ఇద్దరే
బీసీలు అంటే చంద్రబాబు ఉద్దేశంలో కేవలం ఇద్దరు మాత్రమే. ఒకాయన రామోజీరావు, రెండో ఆయన రాధాకృష్ణ. మద్యపాన నిషేధంపై చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. ఎన్టీఆర్‌గారు మద్య నిషేధం విధిస్తే, బాబు అధికారంలోకి రాగానే దాన్ని ఎత్తివేసింది మరచిపోయాడా?. వీధి వీధినా 43వేల బెల్ట్‌ షాపులు పెట్టి, అధికారులకు టార్గెట్లు ఫిక్స్‌ చేసి, జనాలను తాగండి అంటూ మత్తులో ముంచేసింది బాబు కదా? ఇవాళ ఏమీ తెలియనట్టు, మీరు ఒక పునీతుడు మాదిరిగా కొంగ జపం, మొసలి కన్నీరు కార్చుతున్నావు. మా ప్రభుత్వం అందించే డీబీటీ పథకాల ద్వారా ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడుతున్న చంద్రబాబు.. చర్చకు వస్తారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

-మీ హయాంలో 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా, 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గాయి. బీరు అమ్మకాలు చూస్తే.. 2018–19లో 277.10 లక్షల కేసులు కాగా 2021–22లో గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. అది కేవలం జగన్‌గారు తీసుకున్న దశలవారీ మద్యపాన నిషేధం నిర్ణయం వల్లే సాధ్యమైంది.

స్పీకర్ స్థానంలో ఉన్న బీసీ వ్యక్తిని అగౌరవపరుస్తారా..?
అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నది మీరు కాదా? సభా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు తగులుతూ.. రోజూ ఏదో విధంగా సస్పెండ్‌ చేయించుకుని వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. చంద్రబాబుకు అసలు వ్యవస్థల పట్ల గౌరవం ఉందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అన్ని వ్యవస్థలను కుప్పకూల్చేసింది మీరే కాదా బాబూ? సభకు మీరు రారు… మిమ్మల్ని మీ పార్టీ నాయకులు ఫాలో అవ్వరు. ప్రజా సమస్యలపై సభలో చర్చిస్తుంటే దాన్ని అడ్డుకుంటారు. యూనివర్సిటీ విషయంలో ఎన్టీఆర్‌ పేరుమీద రాద్దాంతం చేస్తున్న మీ పార్టీ సభ్యులు… చివరకు ఎన్టీఆర్‌ ఫ్లకార్డును చించేసి స్పీకర్‌ మీద విసిరేసేశారు. సభా అధ్యక్ష స్థానంలో కూర్చున్న ఒక బీసీ వ్యక్తిని అగౌరవపరిచి, అవమానించిన మీరు, మీ పార్టీ మనుషులు.. బీసీలను గౌరవిస్తారా..?, వ్యవస్థలను గౌరవిస్తారా..?

మీకు వత్తాసు, మద్దతు పలికే ఎల్లో మీడియా ద్వారా మాయమాటలు చెప్పించడం ద్వారా ప్రజలు నమ్ముతారనే భావనను ఇప్పటికైనా మానుకోవాలి. రాష్ట్రంలో సచివాలయాల్లో ఇచ్చిన లక్షా 27వేల శాశ్వత ఉద్యోగాల్లో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. 2లక్షల 80వేల మందితో వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు?. మీ అయిదేళ్ల పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే… అదే మా ప్రభుత్వం మూడేళ్లలోనే 2లక్షల 6వేల ఉద్యోగాలు కల్పిస్తే అందులో ప్రయోజనం పొందినవారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కదా. వారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరం.

ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు తెచ్చారా?
ఎన్టీఆర్‌ పేరు తొలగించారని రాద్ధాంతం చేస్తున్న టీడీపీ, ఎల్లో మీడియా.. మరి, నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసి, వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు, మీ ఈనాడులో వేసిన కార్డున్లు మీకు కనిపించ లేదా? చంద్రబాబు-ఏబీఎన్‌ రాధాకృష్ణలు లైవ్ లో వాడు-వీడు అంటూ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడిన మాటలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. టీడీపీ హయాంలో బీసీలకు చేసింది ఏమీలేదనేది వాస్తవం.

డబ్బులేని పేదలకు, బీసీలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనేది పేద విద్యార్థుల పాలిట ఒక సంజీవని. మీరు అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కుదించింది నిజం కాదా?. మళ్ళీ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పే మాటలను ఎవరు నమ్ముతారు? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్‌ కాలేజీని అయినా తెచ్చారా అని సూటిగా అడుతున్నా. వైద్య సేవలు అందరికీ అందేలా కృషిచేసిన వైయస్సార్‌ పేరు హెల్త్‌ యూనివర్శిటీకి పెడితే లబోదిబోమంటారా?

రాజకీయ అవసరాల కోసమే బాబు ఎన్టీఆర్ జపం
ఎన్టీఆర్‌కు వెన్నపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన చంద్రబాబు ఇవాళ తన రాజకీయ లబ్ది కోసం ఎన్టీఆర్‌ జపం చేస్తున్నాడు. అదే జిల్లాకు ఎన్టీఆర్‌పేరు పెడితే.. కనీసం ముఖ్యమంత్రిగారిని అభినందించావా చంద్రబాబూ..?. మీ రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్‌ పేరు వాడుకుంటావు…లేకుంటే వాడెవడో అంటావు కదా. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారని చెప్పింది నువ్వుకాదా చంద్రబాబూ?. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే బీసీల తోలు తీస్తానంటావు, తోకలు కత్తిరిస్తానంటావా..?.

చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర, కుతంత్రం మాత్రమే. ఆయన బతుకు అంతా అబద్ధాల అజెండానే. సత్యాన్నే దైవంగా ఎంచుకున్న జగన్‌ మోహన్‌ రెడ్డి ముందు చంద్రబాబు అసత్యం నిలవదు. చంద్రబాబు బీసీలను భస్మం చేయడానికి ప్రయత్నిస్తే.. వారిని రక్షించేందుకు వచ్చిన వ్యక్తే జగన్‌ మోహన్‌ రెడ్డి . చంద్రబాబు ఇకనైనా అసత్యాలు ఆపేస్తే మంచిది.

Leave a Reply