– వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
– కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: జనవరి 6 న భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించుకోనుండడం గర్వకారణం. భాగ్యనగర మణిహారంలో చర్లపల్లి టెర్మినల్ మరొక మణిపూసగా చేరనుంది.
భారత్ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర రైల్వే శాఖా మంత్రివర్యులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారి సారథ్యంలో దేశమంతా రైల్వేరంగం అభివృద్ధి చెందుతోంది. భారతదేశానికి స్వాంతంత్ర్యం సిద్ధించిన తర్వాత తెలంగాణలోనే మొట్టమొదటి టెర్మినల్ గా చర్లపల్లి టెర్మినల్ చరిత్రలో నిలిచిపోనుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో నెలకొన్న ప్రయాణికుల రద్దీని తగ్గించేలా దోహదపడుతూ, ప్రతి రోజు సుమారు 24 ట్రైన్లు చర్లపల్లి టెర్మినల్ కేంద్రంగా రాకపోకలు సాగించనున్నాయి. రాబోయే కాలంలో గూడ్స్ రైళ్ల రాకపోకలకు కేంద్రంగా హైదరాబాద్ పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఈ టెర్మినల్ మరింత దోహదపడనుంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైల్వే ట్రాక్ ల నిర్మాణం, వరల్డ్ క్లాస్ లెవల్ లో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తేవడం కేవలం మోదీ గారి ప్రభుత్వానికే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత పదేళ్లుగా రూ. 32 వేల కోట్లు కేటాయించి, 40 రైల్వేస్టేషన్లను, పలు రైల్వేలైన్లను ఆధునీకరించడం, 5 వందే భారత్ ట్రైన్లను కేటాయించడం తెలంగాణ పట్ల బిజెపి కి ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నది.
బిజెపి ప్రభుత్వం కేవలం ఒక్క 2024-25 బడ్జెట్ లోనే రూ. 5,336 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఏ ఒక్క సంవత్సరం బడ్జెట్ లో ఇన్ని నిధులు కేటాయించడం సాధ్యపడలేదు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను రూ. 720 కోట్లతో, నాంపల్లి రైల్వేస్టేషన్ ను రూ. 350 కోట్లతో ఆధునీకరించడం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సహకరించకపోయినా చర్లపల్లి టెర్మినల్ ను పూర్తిచేసుకుని, జనవరి 06, 2025 న హైదరాబాద్ లో ప్రారంభించుకోనుండడం గర్వకారణం.