– సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల తెలంగాణకు వరం
– తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
హైదరాబాద్: జపాన్ దేశం ఒసాకాలోని వరల్డ్ ఎక్స్పో 2025లో ఇండియన్ పెవిలియన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జిల్లెల చిన్నా రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి శనివారం సందర్శించారు.
చిన్నారెడ్డిని ఒసాకా వరల్డ్ ఎక్స్పో, ఫుడ్ అండ్ బెవరేజెస్ యూనిట్ ఫంక్షనల్ ఆఫీసర్ డాక్టర్ గరిమా మిట్టల్ ఘనంగా స్వాగతం పలికారు. పెవిలియన్లో భారత దేశంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ హస్తకళలు, ఇస్రో అంతరిక్ష కార్యక్రమం, భారత దేశంలోని ఆధునిక ఆవిష్కరణల గురించి అధికారులు చిన్నారెడ్డికి వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ పట్టుదల, అంతర్జాతీయ అవగాహన, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతీయ గొప్ప తనాన్ని ఈ ప్రపంచ వేదిక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం వంటి అంశాలను చిన్నారెడ్డికి గరీమా మిట్టల్ వివరించారు.
ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తున్నారని, నిధుల సమీకరణకు ప్రపంచ వేదికలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు.