Suryaa.co.in

Andhra Pradesh

బ్రాండెడ్ కంపెనీలను మూతవేసి సొంత బ్రాండ్లను విస్తరింపజేస్తున్నారు

– మాజీ మంత్రి కేఎస్. జవహర్
మనుషుల బలహీనతలను కూడా వ్యాపారానికి వాడుకోవచ్చని జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. మద్యాన్ని వ్యాపార రంగంగా విస్తరిస్తూ పాలన చేస్తున్నారు. మద్యపాన నిషేదం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. బ్రాండెడ్ కంపెనీలను మూతవేసి సొంత బ్రాండ్లను రాష్ట్రంలో విస్తరింపజేస్తున్నారు. లిక్కర్ తయారీ ఖర్చు ఎంత? నువ్వు పొందే లాభమెంత? వచ్చే ఆదాయంలో ఒక సూట్ కేసు తాడేపల్లి ప్యాలెస్ కు వెళుతోంది. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూపించి ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. రేటు పెంచితే వినియోగం తగ్గుతుందనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
క్వార్టర్ రూ. 200కు అమ్ముతున్నారు. లేబిలింగ్, బాటిలింగ్ కోసం ఎంత ఖర్చవుతోంది? నువ్వు పొందుతున్న లాభమెంత? 90 ఎంల్ తయారీ కి అయ్యే ఖర్చు రూ. 4 . అన్ని ట్యాక్స్ లు కలుపుకుని దాన్ని మార్కెట్ లోకి రూ. 50కి అందుబాటులోకి తెచ్చేవారు. నేడు జగన్ దాన్నే రూ. 200 కు అమ్మతున్నాడు. మద్యం ఆదాయ వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడైనా మద్యం కొనుక్కునేలా వాకింగ్ స్టోర్స్ ప్రారంభించారు. జగన్ చెప్పిన మద్యపాన నిషేదం ఒట్టిమాట. రెండున్నరేళ్లలో ఏ దశలోనూ మద్యపాన నిషేదం చేయలేదు. ఎప్పటి నుంచి మద్యపాన నిషేదం అమలు చేస్తావో చెప్పు.
నాటుసారా తయారీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ హయాంలో సారా రహిత జిల్లాలను ప్రకటించాం. నేడు ఆ వైపుగా చర్యల్లేవ్. మహిళల మాంగల్యాన్ని హరించేలా ప్రభుత్వ చర్యలున్నాయి. నాణ్యమైన మద్యం ఎక్కడా దొరకడం లేదు. నాశిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజాధనం దోచుకుంటున్నారు. మద్యపాన వ్యతిరేక కమిటీ ఎక్కడుంది? వారి అడ్రస్ ఎక్కడో చెబితే మహిళలు బాధలు చెప్పుకుంటారు. గంజాయి సాగు, డ్రగ్స్ నివారణపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది. తాడేపల్లి వేదికగా గంజాయి దందా జరుగుతోంది. ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నారు? మద్యం ఆదాయం రెట్టింపయింది. కొవిడ్ సమయంలోనూ మద్యం షాపులు తెరిచి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మద్యపాన నిషేదం ఎప్పుడు చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE