సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏ‍ర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్

-గురుద్వారాల‌కు ఆస్తి ప‌న్ను తొల‌గింపు
-పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే గురుద్వారాల్లోని గ్రంధీల‌కు ప్రయోజనాలు
-సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో సిక్కు మ‌త పెద్ద‌లు భేటీ

తాడేపల్లి: సిక్కుల కోసం ప్ర‌త్యేక కార్పొరేషన్‌ ఏ‍ర్పాటుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అదే విధంగా గురుద్వారాల‌కు ఆస్తి ప‌న్ను తొల‌గించాల‌ని సీఎం ఆదేశించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సిక్కు మత పెద్దలు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా సీఎంతో పలు విష‌యాల‌పై చర్చించారు.

గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సీఎం వైయ‌స్ జగన్‌ అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు ప్రకటనపై సీఎం వైయ‌స్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని స్పష్టం చేశారు. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామన్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో చర్యలు ఉండాలని సీఎం సూచించారు. 10 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ఆదేశించారు.

Leave a Reply