– 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం
– అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులనుఆదేశించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– రానున్న ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల ఎకరాలకు ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా గిరిజన రైతులకు సాగు నీటి వసతి
గిరిజన రైతులకు ఇందిరా గిరి జలవికాసం వరం లాంటిది
– రాష్ట్ర సచివాలయంలో ఇందిరా సౌర గిరి జల వికాసంపై ఉన్నత అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈనెల 18న అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు లో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత అధికారులతో సమీక్షించారు.
గిరిజనులకు ఆర్ వో ఎఫ్ ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు, గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 12,600 కోట్ల రూపాయలతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్తు మంత్రి మండలి పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని దానిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు.
రానున్న ఐదు సంవత్సరాలలో రెండు లక్షల పది వేల మంది రైతులకు సంబంధించిన ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ఉపయోగపడుతుందన్నారు. అడవిలో పోడు భూముల సాగుకు కావలసిన విద్యుత్తు సరఫరాకు అటవీశాఖ అనుమతి నిరాకరించడంతో దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్న గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరా గిరి జిల్లా వికాసం పథకం ఒక వరం లాంటిదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏకకాలంలో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకోవడానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని అన్నారు. ఈ పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లు, విద్యుత్తు, ఉద్యాన వన శాఖ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. పట్టాలు పొందిన గిరిజనుల గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లోని భూముల్లో జల వనరుల లభ్యత కోసం జియాలజికల్ సర్వే, తదుపరి బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు బిగించడం, ప్లాంటేషన్, డ్రిప్ ఏర్పాటు చేయించి గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.
అవకాడో, వెదురు, దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ అంజీర్ వంటి పంటలు గిరిజనులు సాగు చేసేందుకు కార్యచరణ రూపొందించుకొని గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పంటల సాగు జరుగుతున్న తీరుపై గిరిజన రైతులకు అవగాహన కల్పించేందుకు స్టడీ టూర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పామాయిల్, వెదురు వంటి పంటలు చేతికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని, ఈలోపు గిరిజనులకు ఆదాయం సమకూరేందుకు అవసరమైన అంతర పంటల సాగును గుర్తించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
హిమాచల్ ప్రదేశ్లో న్యాచురల్ ఫామింగ్ ద్వారా ఆర్గానిక్ కూరగాయలను పండించి ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేస్తున్న మాదిరిగా ఐటిడిఏ ప్రాజెక్టు పరిధిలోని ఏజెన్సీ ఏరియాల్లో ఇదే తరహాలో కూరగాయలను పండించి హైదరాబాదుకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూరగాయల సాగుపై గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. దీని ద్వారా రైతులకు అదనంగా ఆదాయం లభిస్తుందని వివరించారు. అడవులను పెంచుతూనే, గిరిజనులకు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
ఈ పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలను ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ డిప్యూటీ సీఎంకు వివరించారు. స్టేట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ, డిస్టిక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కం పర్చేజ్ కమిటీ, ప్రత్యేకంగా పోర్టల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అడవిలో సాగు నీటి వసతి, కరెంటు సౌకర్యం లేకుండా దశాబ్దాల తరబడి పంటలు పండించుకోవడానికి నిరీక్షిస్తున్న గిరిజన రైతులు ప్రభుత్వం తీసుకొస్తున్న ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ఉప ముఖ్యమంత్రి కి వివరించారు.
ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, spdcl cmd ముషారఫ్ ఫరూకి, Npdcl cmd వరుణ్ రెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్ యాస్మిన్ భాష తదితరులు పాల్గొన్నారు.