Suryaa.co.in

Telangana

సిద్దిపేట కు పట్టిన చీడ, పీడ మామ ,అల్లుడు

-మామ పోతా పోతా పీనుగులు తినే అల్లుడిని పెట్టి పోయాడు
-దొర దౌర్జన్యం ఇంకెన్ని రోజులు ఇక్కడ నడస్తది?
-దొరల గడిలను బద్దలు కొట్టాలంటే నీలం మధు ముదిరాజ్ గెలవాల్సిందే
-కాశీం రిజ్వి లాగా కేసీఆర్ దగ్గర వెంకట్రామిరెడ్డి
-సిద్దిపేట లో సీఎం రేవంత్ రెడ్డి

మెదక్ పార్లమెంట్ నుంచి బలహీనవర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను పార్టీ అధిష్టానం బరిలోకి దించింది. పార్టీ కార్యకర్తల త్యాగాల వల్లనే మెదక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. 45 ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో మామ ,అల్లుడు శని లా పట్టి పీడిస్తున్నరు. సిద్దిపేట నుంచి మామ పోతా పోతా పీనుగులు తినే అల్లుడిని పెట్టి పోయాడు. సిద్దిపేట ప్రజలను పట్టి పీడిస్తున్న బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి చేయడానికే ఈ గడ్డ మీదికి వచ్చిన.

1980లో ఇందిరాగాంధీ ని గెలిపించి ప్రధానిని చేసిన చరిత్ర మెదక్ ది. ఇందిరమ్మ మెదక్ కు అనేక పరిశ్రమలు తీసుకువచ్చింది. మంచికి మారు పేరు మెదక్ ప్రజలు.. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇక్కడి వారు ఆశ్రయం ఇచ్చారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నుంచి బలహీన వర్గాల బిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. రైతుల భూములు గుంజుకొని మల్లన్న సాగర్ కట్టిన వారు కావాలా లేక బడుగు బలహీన వర్గాల బిడ్డ కావాలా?

రైతులపైన అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించిన చరిత్ర వెంకట్రామిరెడ్డి ది. దొర దౌర్జన్యం ఇంకెన్ని రోజులు ఇక్కడ నడస్తది.. మెదక్ ప్రజలు ఆలోచించండి. సిద్దిపేట గడ్డ పైన మూడు రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా బానిసలుగా బతకాల్సి వస్తుంది. దొరల గడిలను బద్దలు కొట్టాలంటే నీలం మధు ముదిరాజ్ గెలవాల్సిందే.

ఎవడయ్య వెంకట్రామిరెడ్డి.. ఎక్కడి నుంచి వచ్చాడు? మల్లన్న సాగర్ జనాన్ని ముంచినోడు కాదా? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ కిష్టాపూర్ లో జనాన్ని కొట్టించలేదా? భూములు గుంజుకొని ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టింది వెంకట్రామిరెడ్డి కాదా? కలెక్టర్ గా ఉండి ప్రజల ఉసురు తీసినోడు వెంకట్రామిరెడ్డి. నిజాం దగ్గర కాశీం రిజ్వి లాగా కేసీఆర్ దగ్గర వెంకట్రామిరెడ్డి పనిచేశాడు. వెంకట్రామిరెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ రాకుండా చేయాలి.

సిద్దిపేట కు పట్టిన చీడ, పీడ మామ ,అల్లుడు. భూములు గుంజుకొని, రైతుల పై అక్రమ కేసులు పెట్టిన వారికి ఓటు ఎలా వేస్తారో ఆలోచించుకోవాలి. భూములు మింగిన అనకొండ కు గుణపాఠం చెప్పాలి. మొట్టమొదటి సారి గడీలు బద్దలు కొట్టే అవకాశం వచ్చిందని ఇక్కడికి వచ్చాను. సిద్దిపేట గడ్డ పైన నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని వచ్చాను. సిద్దిపేట గడ్డ పౌరుషాన్ని చూశాను..నాకు నమ్మకం కల్గింది.

మెదక్ పార్లమెంట్ లో నీలం మధు లక్ష మెజార్టీతో గెలుస్తారు. సిద్దిపేట లో కాంగ్రెస్ కు మెజారిటీ ఖాయం. సిద్ధిపేటకు వచ్చిన ప్రతి కార్యకర్త వందమందితో సమానం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , ఐటీఐఆర్ , పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్ట్ తో పాటు అనేక పథకాలను సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. చంద్రశేఖర్ రావు, హరీష్ రావు.. ఇంకో రావు కోసమేనా ఈ ప్రాంతం ఉంది?

పొద్దటి పూట రెండు పార్టీలు..రాత్రికి మాత్రం ఒకటే పార్టీ..ఈ రావు లు ఇక్కడ అవసరమా? ముదిరాజ్ సోదరులకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. బీసీ డీ గ్రూప్ నుంచి ముదిరాజ్ ను ఎ గ్రూప్ లోకి తెచ్చే బాధ్యతను నీలం మధు తీసుకుంటడు. ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టి ముళ్ల కంచెలు తొలగించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినం. అద్దంకి దయాకర్ కు మంచి పదవి ఇచ్చే బాధ్యత నాది. హరీష్ రావు రాసి పెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేసే బాధ్యత నాది. సిద్దిపేటకు పట్టిన శనీశ్వర్ రావు ను పాతాళానికి తొక్కే బాధ్యత నాది.

ఆగస్టు 15 నాడు సిద్దిపేట ప్రజలకు శనీశ్వర్ రావుకు విముక్తి కల్గబోతోంది. సిద్దిపేటకు మళ్లీ వస్తా.. కొత్త ఎమ్మెల్యే ను గెలిపిస్తా. లక్ష మందితో సిద్దిపేట లో ఇదే చౌరస్తాలో సభ పెడతా.
వచ్చిన వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశాం. తెలంగాణకు వచ్చి ప్రధాని మోదీ నన్ను తిట్టిపోయాడు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు.. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి.

LEAVE A RESPONSE