Suryaa.co.in

Andhra Pradesh

క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సియం వై.యస్.జగన్మోహన రెడ్డి…

గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలలో ప్రజలకు సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛసంకల్పం-క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రారంభించారు.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజిసర్కిల్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక పై తొలుత మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి సియం జగన్మోహన రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదకరంగా నివసించాలని చేపట్టిన క్లాప్ కార్యక్రమంలో భాగంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆవాహనాలు వరుసక్రమంలో ఆయా జిల్లాలకు తరలివెళ్లాయి. మెరుగైన పారిశుద్ధ్య నిర్వాహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేదిశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నాయకత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, జడ్ పి ఛైర్మన్ ఉప్పాల హారిక, పార్లమెంటు సభ్యులు వ ల్లభ నేని బాలశౌరి, శాసనమండలి సభ్యులు యండి. కరీమున్నీసా, టి. కల్పలత, శాసనసభ్యులు మల్లాది విష్ణు, మేకా వెంకట ప్రతాప అప్పారావు, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, కైలే అనీల్ కుమార్, కొరారు అబ్బయ్యచౌదరి, వాసుబాబు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్ పర్సన్ పి. దేవ సేన, ఏపి ఫైబర్ నెట్ ఛైర్మన్ పి.గౌతం రెడ్డి, విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, ఏ. శైలజారెడ్డి, కెడిడిసిసిబి ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఏపిఐడిసి చైర్మన్ బండి పుణ్యశీల, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, స్వచ్ఛ ఆంధ్రకార్పోరేషన్ యండి డా. పి.సంపత్ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతిరాజ్ కమిషనరు యం. గిరిజాశంకర్, పురపాలకశాఖ కమిషనరు యం. మల్లిఖార్జుననాయక్, సహూచార శాఖ కమిషనరు టి.విజయకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టరు జె. నివాస్, నగరమున్సిపల కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్,జాయింట్ కలెక్టర్లు యల్. శివశంకర్, కె. మాధవిలత, శ్రీవాసు నపూర్ అజయ్ కుమార్, కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, అసిస్టెంట కలెక్టరు యస్.యస్. శోభిత, తదితరులు పాల్గొన్నారు.
క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) – “జగనన్న స్వచ్ఛ సంకల్పం”: రాష్ట్రాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత, చెత్త బుట్ట రహిత, చెత్త రహిత నగరాలుగా తీర్చిదిద్దడమే క్లాప్ – “జగనన్న స్వచ్ఛ సంకల్పం” లక్ష్యం. దీని కోసం, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టలు చొప్పున నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్త బుట్టలను పంపిణీ చేసి వంద శాతం వేరు చేసిన చెత్తను సేకరిస్తారు. దీనితో పాటు చెత్తను ఇంటివద్దనే కంపోస్టు చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్ధాలను గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజి ట్రాన్స్ ఫర్ సెంటర్లకు తరలిస్తారు. తిరిగి గార్బేజి ట్రాన్స్ ఫర్ సెంటర్ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరు వేరు వాహనాల ద్వారా ట్రీట్ మెంట్ ప్రాజెక్టుల వద్దకు చేర్చుతారు.. అనంతరం తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు లేక బయో గ్యాస్ తయారు చేస్తారు. పొడి చెత్తలో ఉన్న హానికారక వ్యర్ధాలను నిర్మూలించడంతో పాటు, వాటిలో తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని గ్రామాలు, నగరాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను సంపూర్ణంగా శుద్ధి చేయాలనే సంకల్పంతో క్లాప్ పని చేస్తుంది.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) – జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రధాన అంశాలు :
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతోంది. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారగా జగనన్న ప్రభుత్వం సదరు కేంద్రాల నిర్వహణకు నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి వారికి జీతాలు చెల్లించడంతో పాటు కేంద్రాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని తిరిగి అవి సజావుగా పనిచేసేలా పునరుద్ధరించడం జరిగింది. వీటితో పాటు, మరో 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాల నిర్మాణాన్ని జగనన్న ప్రభుత్వం చేపట్టనుంది. చెత్త రవాణా కోసం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణరవాణాను మరింత మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా 10 వేల పైచిలుకు జనాభా వున్న గ్రామాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న గ్రామాలకు 1,000 ఆటోలు పంపిణీ చేయనున్నారు. మాస్కులు, శానిటరీ పాడ్ లు వంటి వ్యర్ధాల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా, వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాల్చి భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అలాగే కమ్యూనిటీ టాయిలెట్ల పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. వర్షా కాలంలో సాధారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో,దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్లు పంపిణీ చేస్తారు. 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. మరో వైపు 10,645 గ్రామ పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్ కాని వ్యర్ధాలను దగ్గరలో వున్న సిమెంట్ ఫ్యాక్టరీలకు, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలింపు కార్యక్రమం కూడా జగనన్న ప్రభుత్వం చేపట్టనుంది.
గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే, నగరాల్లో కూడా క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోంది.. ఆరు బయట మల, మూత్ర విసర్జనకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేసి సేకరించేందుకు వీలుగా మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి 3 చెత్త బుట్టల చొప్పున కోటి ఇరవై లక్షల నీలం, ఆకుపచ్చ , ఎరుపు రంగు చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. చెత్త సేకరణ మరియు రవాణా మరింత మెరుగు పరిచేందుకు 3,097 ఆటో టిప్పర్లు, 1800 ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయనున్నారు. 124 మునిసిపాలిటీలలో 231 గార్బెజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు, PPP విధానంలో 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ (ISWM) ప్రాజెక్టుల వ్యవస్థాపనకు ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన 32 మున్సిపాలిటీలలోని డంప్ సైట్ లలో వ్యర్థాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ టాంక్ ల నుండి సేకరించిన వ్యర్ధాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (FSTP) ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) – “జగనన్న స్వచ్ఛ సంకల్పం” కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చడం ద్వారా బిన్ ప్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ప్రీగా అభివృద్ధి పరచి జాతీయ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన రాష్ట్రంలోని, గ్రామాలు, నగరాలను మెరుగైన స్థాయిలో నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

LEAVE A RESPONSE