– రాష్ట్ర హోం అండ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి
అమరావతి: నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం దార్కానిపాడు గ్రామంలో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించినట్టు రాష్ట్ర హోం అండ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు.
ఇదే విషయంపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించి బాధిత కుటుంబానికి పరిహారాన్ని ప్రకటించినట్టు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారాన్ని ప్రకటించారన్నారు. వారి ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాటిజ్ చేయాలని ఆదేశించారన్నారు. ఆ ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పవన్, భార్గవ్ లకు కూడా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని ఆమె తెలిపారు.
మృతుని సొంత తమ్ముడైన పవన్కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఆమె తెలిపారు. అదే విధంగా భార్గవ్కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆమె తెలిపారు. ఈ హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, విచారణ వేగవంతంగా జరిగేందుకు ప్రత్యేక పీపీని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆమె తెలిపారు. ఈ హత్యకు కారణమైన నిందితునికి ఎట్టి పరిస్థితిల్లోనూ బెయిల్ రాకుండా చూడాలని, కఠినంగా శిక్షించేందుకు సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాదికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆమె తెలిపారు.
ఈ సంఘటనను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారని, అందులో నేను, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, తాడేపల్లిగూడెం శాసన సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్, కందుకూరి శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సభ్యులగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ఈ కమిటీ సభ్యులు హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని అనిత తెలిపారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరుగుతుందని భరోసా కల్పించినట్టు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ తన వాహనంతో తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు, పవన్, భార్గవ్ లు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ను రాళ్లపాడు సమీపంలో ఢీకొట్టారని, ఈ ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా, పవన్, భార్గవ్ లు తీవ్రమైన గాయాలకు గురయ్యారని తెలిపారు. బాధితుని సొంత తమ్ముడైన పవన్ వెన్నుపూస పూర్తిగా దెబ్బతిందని, నడవలేని స్థితిలో ఉన్నాడని ఆమె తెలిపారు. హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీ నాయుడు మద్య ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన తేడాల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కుందుకూరు శాసన సభ్యుల ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.