– చదువుకున్న మహిళలు గృహిణిలుగా ఇళ్లలో మిగిలిపోకూడదు
– వర్క్ ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్లతో మహిళలకు ఉపాధి మార్గాలు
– కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్తో మానవ వనరుల సమర్థ వినియోగం
– వారికి అవకాశాలు కల్పించాలి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్ష చేశారు. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని… అలాంటి వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సీఎం అన్నారు. చదువుకున్న మహిళలు గృహిణిలుగా మిగిలిపోకూడదు, వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. వర్క్ ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళలను ఇంటికి, ఇంటి పనికి పరిమితం చేయడం సరికాదని సీఎం అన్నారు.
ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని… వారికి వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పనిచేసి ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని, కుటుంబ వ్యవహారాలు, బాధ్యత కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారన్నారు. ఇలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే… ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరినాటికి 1.50 సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఒక్కో సీటుకు 50-60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని.. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్లో పనిచేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. అదే విధంగా ఇప్పటికే నిర్ణయించినట్లు రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్లకు అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు.