Suryaa.co.in

Telangana

సీబీఐ విచారణ కోరి‌న‌ కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంది?

-జ్యుడిషియల్ ఎంక్వయిరీతో కాలయాపన
-కేసీఆర్ ను కాపాడాలని చూస్తున్నారనే అనుమానం
-బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో జరిగింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ కోరి‌న‌ కాంగ్రెస్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉంది..?జ్యుడిషియల్ ఎంక్వయిరీతో కాలయాపన చేయాలని చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్ష కోట్లకు అంచనాలు పెంచి… వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే గత ప్రభుత్వం తెచ్చిన G.O రద్దుచేసి వెంటనే సీబీఐతో విచారణ జరపాలి .

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే కేసీఆర్ ను కాపాడాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతుంది . గతంలో సిబిఐ విచారణ జరిపించాలంటూ చెప్పి.. సీఎం కుర్చీ ఎక్కగానే మాట మార్చారు.. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయాన్ని సుమారు ₹63,000 కోట్ల నుండి ₹1.50 లక్షల కోట్లకు పెంచింది.

కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జర్పించడం కంటే సిబిఐ విచారణ జరిపిస్తే నిజ నిజాలు బయటపడతాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందన్న ఆరోపణల పైన సి.బి.ఐ విచారణ జరిపించాలని కోరుతూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక మార్లు కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు నిశ్వబ్దంగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలి. మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణం తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదో స్పష్టం చేయాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు పై 2019 జూన్ తరువాత ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి . 2020 జూలై 9న భూపాలపల్లి జిల్లాలోని గ్రావిటీ కెనాల్‌ గోడ సిమెంట్‌ పెచ్చులూడాయి. లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో గ్రావిటీ కెనాల్‌కు ఎడమవైపు సిమెంట్‌ సీలింగ్‌ పెచ్చులు ఊడిపోయాయి.

2022 జూలై 14న గోదావరిలో వచ్చిన భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలోని లక్ష్మీ పంపుహౌస్‌, అన్నారం పంపుహౌస్‌ నీట మునిగాయి. పంపుహౌ స్‌ల నీట మునుగకు ప్రధాన కారణం నిర్మాణంలో నాణ్యత, డిజైన్‌ లోపమే అనే ఆరోపణలు ఉన్నాయి.

LEAVE A RESPONSE