రాబోయే 3 నెలల్లో చైనాలో 60% మందికి కొవిడ్
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోన్న ప్రపంచాన్ని చైనాలో కరోనా విజృంభణ మరోసారి భయపెడుతోంది. అక్కడ రోజువారీ కేసులు, మరణాలు విపరీతంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మళ్లీ కొవిడ్ ముప్పు తప్పదేమోనని నిపుణులు వేస్తోన్న అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనా లో ‘జీరో-కొవిడ్’ నిబంధనలను సడలించిన తర్వాత నుంచి కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా వైరస్ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయయాని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ వెల్లడించారు. అంతేగాక, వచ్చే మూడు నెలల్లో ఆ దేశంలో 60శాతం మందికి పైగా వైరస్ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ‘‘ఆంక్షలు సడలించిన తర్వాత చైనాలో ఆసుపత్రులు కొవిడ్ బాధితులతో కిక్కిరిసిపోయాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలో 60శాతం మందికి పైగా, ప్రపంచ జనాభాలో 10శాతానికి పైగా కరోనా బారిన పడే ప్రమాదముందని అంటువ్యాధుల నిపుణులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది చోటుచేసుకునే అవకాశముంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని ఎరిక్ ఓ ట్వీట్ చేశారు. చైనాలో రోగులతో నిండిపోయిన ఓ ఆసుపత్రి దృశ్యాలను కూడా ఆయన షేర్ చేశారు. చైనాలో ప్రస్తుతం మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నప్పటికీ అధికారిక సంఖ్య మాత్రం బయటకు రావట్లేదని తెలిపారు. కొవిడ్ మహమ్మారి నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ ఎరిక్ ట్వీట్ భయాందోళనలు రేపుతోంది.
ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో బీజింగ్ సర్కారు ఇటీవల ‘జీరో-కొవిడ్’ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. నాటి నుంచి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత అక్కడ మరణాలు కూడా నమోదవుతున్నాయి. బీజింగ్లో రెండు మరణాలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఈ మరణాల లెక్క అధికారికంగా ప్రకటించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు హాంకాంగ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. బీజింగ్లోని కొన్ని శ్మశానవాటికలు కొవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. రోజుకు సగటున 200 మృతదేహాలు వస్తున్నట్లు ఆ శ్మశానవాటికలో పనిచేసే ఓ సిబ్బంది చెప్పారని ఆ కథనం వెల్లడించింది. ఇక ఫార్మా దుకాణాల్లో మందుల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో ఇప్పటివరకు 5,327 మంది కొవిడ్తో మరణించారు. ఆ దేశంలో ఎవరైనా కేవలం కరోనా వల్ల చనిపోయినప్పుడే కొవిడ్ మరణంగా గుర్తిస్తారు. చాలామేర ఇతర దేశాల్లో మాత్రం కరోనా వైరస్ సోకి ఆ ప్రభావంతో ఇతర ఏ కారణాలతో మృతిచెందినా కొవిడ్ మరణాలుగానే లెక్కిస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో కొవిడ్ మరణాల సంఖ్య తీవ్రంగా ఉన్నప్పటికీ వాటితో పోలిస్తే చైనాలో గుర్తించిన కొవిడ్ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు, జీరో కొవిడ్ను సడలించిన తర్వాత లక్షణాలు లేని కొవిడ్ కేసులను బీజింగ్ ప్రకటించడంలేదు. అలాగే స్వల్ప లక్షణాలున్న వారిని కూడా నిర్బంధంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించకుండా ఇళ్లలో ఉండాలని సూచిస్తున్నారు.
నిమ్మకాయలకు ఎగబడుతున్న చైనీయులు
కరోనా కేసులతో సతమతమవుతోన్న చైనాలో ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. వీటిని కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఇంతకీ చైనీయులకు వాటితో ఏం పని? అక్కడ నిమ్మకాయలకు ఎందుకంత డిమాండ్..?
కరోనా పుట్టినిల్లు చైనా లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రజాందోళనలతో దిగొచ్చిన బీజింగ్ సర్కారు.. ‘జీరో కొవిడ్ ’ ఆంక్షలను సడలించిన తర్వాత కేసులు అమాంతం పెరిగాయి. రాబోయే మూడు నెలల్లో చైనాలో 60శాతం మంది కొవిడ్ బారిన పడే అవకాశముందని అటు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రజలు గృహ వైద్యంపై దృష్టిపెట్టారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నిమ్మకాయరసాన్ని తెగ తాగేస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో చైనాలో వీటి గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ‘‘నిమ్మకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది’’ అని సిచుయాన్లోని అనియు కౌంటీకి చెందిన ఓ రైతు చెప్పినట్లు బ్లూమ్బర్గ్ కథనం వెల్లడించింది. తాను 130 ఎకరాల్లో నిమ్మకాయలు పండిస్తున్నానని ఆయన తెలిపారు. అంతకుముందు రోజుకు కేవలం 5 నుంచి 6 టన్నుల నిమ్మకాయలు అమ్ముడయ్యేవని, గత వారం రోజుల నుంచి 20 నుంచి 30 టన్నుల వరకు విక్రయిస్తున్నానని ఆయన చెప్పారు. చైనాలో విక్రయించే నిమ్మకాయల్లో 70 శాతం అనియు కౌంటీ నుంచే వస్తాయి. గిరాకీ పెరగడంతో వీటి ధరలు కూడా కొండెక్కాయి. బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో నిమ్మకాయలకు గిరాకీ బాగా పెరిగిందట. మహమ్మారిని ఎదుర్కొనేలా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ‘సి’ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు మెరుగ్గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నిమ్మకాయలను చైనీయులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు నారింజ , పియర్స్ , పీచ్ వంటి పండ్లకు కూడా గిరాకీ పెరిగింది. వీటి కోసం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.
మరోవైపు, కరోనా కేసులు పెరగడంతో ఫార్మా ఫ్యాక్టరీలకు కూడా తాకిడి పెరిగింది. చైనాలో గత కొన్ని రోజులుగా నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయినట్లు సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక గత నాలుగు నెలల తర్వాత బీజింగ్లో 2 మరణాలు చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే అధికారిక లెక్కల కంటే ఈ మరణాల సంఖ్య చాలా ఎక్కువే అని వార్తలు వస్తున్నాయి. శ్మశాన వాటికలకు రోజూ వందలకొద్దీ మృతదేహాలు వస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.